ETV Bharat / city

ఒకప్పుడు రాష్ట్రం అభివృద్ధికి చిరునామా.. ఇప్పుడు అరాచకాలకు అడ్డా: చంద్రబాబు

author img

By

Published : Oct 14, 2022, 4:23 PM IST

Chandrababu
చంద్రబాబు

Chandrababu Comments: ఒకప్పుడు అభివృద్ధికి చిరునామాగా నిలిచిన ఏపీ.. ఇప్పుడు అరాచకాలకు అడ్డాగా మారిందని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కరుడుగట్టిన నేరస్థుడికి అధికారం ఇస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు అలాగే ఉందని వ్యాఖ్యానించారు. ఎక్కడికక్కడ విధ్వంసం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులకు శిక్ష తప్పదని హెచ్చరించారు.

Chandrababu Comments: దేశ రాజకీయాల్లో ఎన్నో కీలక మార్పులకు తెదేపా నాంది పలికిందని చంద్రబాబు అన్నారు. తన 40 ఏళ్లలో ఇంతటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని చూడలేదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు, ప్రభుత్వాలతో ఈ 40 ఏళ్లలో పోరాడామన్నారు. రాష్ట్రంలో పోలీసులు ఇలా అయిపోతారని తాను ఎప్పుడూ అనుకోలేదన్నారు. ముఠా కక్షలు, రౌడీలను అణిచివేసింది ఈ పోలీసు వ్యవస్థేనన్న ఆయన... ఇప్పుడు కొందరు పోలీసుల అధికారులు పూర్తిగా గాడి తప్పారని విమర్శించారు. ఇప్పుడు అవినీతి అధికారులకు కీలక పోస్టులు ఇస్తున్నారన్నారు. కరుడుగట్టిన నేరస్థుడికి అధికారం ఇస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు అలాగే ఉందని వ్యాఖ్యానించారు.

వివేకా హత్య కేసులో నిందితులు చనిపోతున్నారన్న చంద్రబాబు.. అప్రూవర్​గా మారిన దస్తగిరి ఇప్పుడు ప్రాణభయంతో ఉన్నాడని తెలిపారు. వివేకా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐపైనే కేసులు పెట్టిన ప్రభుత్వం ఇదని విమర్శించారు. సీబీఐకే దిక్కులేకపోతే... డ్రైవర్​గా ఉండే తన పరిస్థితి ఏంటని దస్తగిరి అడుగుతున్నాడన్నారు. ఒక ఎంపీ రాష్ట్రానికి రాలేని పరిస్థితిని కల్పించారన్న చంద్రబాబు... ట్రైన్​లో వస్తే అతడిని అందులోనే అంతమొందించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో ప్రాథమిక హక్కులు లేవా అని నిలదీశారు.

వైకాపాపై చంద్రబాబు ధ్వజం

"ధర్మం, న్యాయం కోసం పోరాడుతున్నాం. నేరస్థుల కట్టడికి ప్రాణం ఉన్నంతవరకు పోరాడుతూనే ఉంటాం. వివేకా హత్య తర్వాత ఇద్దరు చనిపోయారు. అప్రువర్‌గా మారిన దస్తగిరి కూడా ప్రాణభయంతో ఉన్నారు. ఏపీలో ప్రజలకు రక్షణ లేకుండా పోయింది. ఎంపీ రఘురామపై ఇష్టానుసారంగా ప్రవర్తించారు. ఒక ఎంపీకే ఇలా ఉంటే... సామాన్యుల పరిస్థితేంటి?. పోలీసు వ్యవస్థను వైకాపా ప్రభుత్వం భ్రష్టుపట్టించింది. అందరి చరిత్ర నా వద్ద ఉంది... ఎవరూ తప్పించుకోలేరు. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎంత పెద్ద అధికారైనా తప్పించుకోలేరు." -చంద్రబాబు

తెదేపా మీడియా కోఆర్డినేటర్ నరేంద్రను పోలీసు కస్టడీలో హింసిచే అవకాశం ఉందని.. ముందే అందరికీ లేఖలు రాశామన్నారు. అయినా నరేంద్రను హింసించారని, 'మీరు పోలీసులా? ఉన్మాదులా' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొట్టిన వారి పేర్లు కూడా ఉన్నాయన్న చంద్రబాబు.. చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులకు శిక్ష తప్పదని హెచ్చరించారు.

అమరావతిలో రైతులు 35 వేల ఎకరాలు ఇచ్చారని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ల్యాండ్‌ పూలింగ్‌ చేసిన ఘనత తెదేపాది అని తెలిపారు. అలాంటి అమరావతికి నాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్‌ సరే అన్నారని.. చిన్న రాష్ట్రం విభేదాలు వద్దని ప్రతిపక్షంలో ఉన్న జగన్‌ అన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు 3 రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ధ్వజమెత్తారు. రుషికొండను బోడికొండ చేసేశారని విమర్శించారు. ఓ పక్క కోర్టులో విచారణ జరుగుతుంటే.. మరో పక్కన తవ్వేస్తున్నారని దుయ్యబట్టారు. పోలవరాన్ని 70 శాతం పూర్తి చేస్తే... దాన్ని ముంచేశారని ఆరోపించారు. ఎక్కడికక్కడ విధ్వంసం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వితండవాదాలు, రౌడీయిజంతో తప్ప మరొకటి లేదన్నారు. 'నా రాష్ట్రం-నా భవిష్యత్‌' అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

"అమరావతిలో 35 వేల ఎకరాలు ఇచ్చారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ల్యాండ్‌ పూలింగ్‌ చేసిన ఘనత తెదేపాది. అలాంటి అమరావతికి నాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్‌ సరే అన్నారు. చిన్న రాష్ట్రం విభేదాలు వద్దని ప్రతిపక్షంలో ఉన్న జగన్‌ అన్నారు. ఇప్పుడు 3 రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. రుషికొండను బోడికొండ చేసేశారు. ఓపక్క కోర్టులో విచారణ జరుగుతుంటే.. మరో పక్కన తవ్వేస్తున్నారు. పోలవరాన్ని 70 శాతం పూర్తి చేస్తే....దాన్ని ముంచేశారు. ఎక్కడికక్కడ విధ్వంసం సృష్టిస్తున్నారు. వితండవాదాలు, రౌడీయిజంతో తప్ప మరొకటి లేదు. నా రాష్ట్రం-నా భవిష్యత్‌ అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలి." -చంద్రబాబు

అచ్చెన్నాయుడు: అన్ని సర్వేలు చంద్రబాబు మళ్లీ సీఎం అవుతారని చెబుతున్నాయని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టంచేశారు. జీవితాంతం వైకాపా అధికారంలో ఉండదని, అధికారంలో వచ్చాక.. వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. వీటన్నింటికీ తిరిగి అంతకు అంతా చెల్లిస్తామన్న అచ్చెన్న... ఈసారి అధినేత ధర్మం, న్యాయం అంటే కూడా కుదరదని వ్యాఖ్యానించారు. తెదేపా కేంద్ర కార్యాలయంలో లీగల్ సెల్ నూతన కమిటీ ప్రమాణస్వీకారం కార్యక్రమానికి చంద్రబాబు, అచ్చెన్నాయుడు హాజరయ్యారు. రాష్ట్రం, ప్రజాస్వామ్యం గురించి తెదేపా పోరాటం చేస్తుందని తేల్చిచెప్పారు. తెదేపా... వైకాపాలా గాలికి పుట్టిన పార్టీ కాదన్న అచ్చెన్న.. నందమూరి తారక రాముడు 40 ఏళ్ల క్రితం పార్టీ పెట్టారని గుర్తు చేశారు. సీఎం జగన్​కు పిచ్చి ముదిరి పాకన పడిందని, తెదేపా నేతలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. అర్ధరాత్రి సమయంలో లాయర్లు కోర్టులకు వెళ్లి కార్యకర్తలకు సాయం చేస్తున్నారని తెలిపారు.

పోలీసు వ్యవస్థను సీఎం జగన్​ పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు. తెదేపా... జగన్ చర్యలకు భయపడదని తప్పు చేయలేదని ఉద్ఘాటించారు. సీఐడీ అంటే అగ్రిగోల్డ్ స్కాం అప్పుడు మాత్రమే చూశామని, సీఐడీ అంటే ఇలాంటి కేసులు చూస్తుందని అప్పుడే తనకు తెలిసిందన్నారు. ఇప్పుడు భార్యాభర్తలు గొడవ పడితే కూడా సీఐడీ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కేసులతో సీఐడీ ద్వారా తెదేపా నేతలను, కార్యకర్తలను వేధిస్తున్నారని ఆరోపించారు. పార్టీ మీడియా సమన్వయకర్తను అరెస్టు చేసి హింసించారని, గుండె రగిళిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.