వరద బాధితులకు సాయం పెంచాలి.. సీఎస్​కు చంద్రబాబు లేఖ

author img

By

Published : Jul 31, 2022, 5:50 PM IST

babu

Chandrababu letter to CS: గోదావరి వరద బాధితుల కష్టాలు, పోలవరం నిర్వాసితుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. గోదావరి వరదలు వేల కుటుంబాలను చిన్నాభిన్నం చేశాయని.. ఇళ్లు మునిగిపోయి, కూలిపోయి భారీ నష్టం జరిగిందన్న చంద్రబాబు.. ప్రభుత్వ సాయం పెంచాలని లేఖలో కోరారు. పోలవరం నిర్వాసితులకు దశల వారీ పరిహారం అనే విధానాన్ని పక్కనపెట్టి.. అందరికీ ఒకేసారి పరిహారం ఇవ్వాలని తేల్చిచెప్పారు. పోలవరం కోసం తమ భూములు, ఊళ్లు ఇచ్చి త్యాగం చేసిన నిర్వాసితులకు న్యాయం చెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు.

Chandrababu letter on Flood Aid: పోలవరం ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన నిర్వాసితులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు (Chandrababu) డిమాండ్‌ చేశారు. గోదావరి వరదలపై నాలుగు జిల్లాలలో తన పర్యటన అనంతరం.. ప్రజల వెతలపై ప్రభుత్వ సాయం పెంపు కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS)కి లేఖ రాశారు. గోదావరి వరదలతో ప్రజల కష్టాలు, పోలవరం నిర్వాసితుల సమస్యలను లేఖలో ప్రస్తావించారు. గోదావరి వరదలు వేల కుటుంబాలను చిన్నాభిన్నం చేశాయని.. ఇళ్లు కూలిపోయి, మునిగిపోయి భారీ నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి బాధిత ప్రజలకు సరైన సాయం అందలేదని తన పర్యటన ద్వారా తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికీ ముంపు గ్రామాల ప్రజలకు ఇళ్లలోకి తిరిగి వెళ్లలేని దారుణ పరిస్థితులు ఉన్నాయని చెప్పారు.

వరద సాయం రూ.2 వేలేనా?: 2014లో హుద్ హుద్, 2018లో తిత్లీ తుఫాను సమయంలో తెదేపా ప్రభుత్వం పరిహారం పెంచి ఇచ్చిందని గుర్తు చేశారు. 8 ఏళ్లతో పోల్చితే ఇప్పుడు పెరిగిన ధరలు, వరదల తీవ్రత, జరిగిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని మరింత పెంచి గోదావరి వరద బాధితులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వరదలతో ఇళ్లు కూలిపోయి, ఇంట్లో సామగ్రి వరద నీటికి కొట్టుకుపోయి ఆర్థికంగా నష్టం జరిగిందని.. గృహోపకరణాలు నీటమునిగి బాధిత ప్రజలు పెద్ద ఎత్తున నష్టపోయారని తెలిపారు. గ్రామాలకు గ్రామాలు వారం రోజుల పాటు వరదలో ఉండిపోవడం వల్ల నష్టం, కష్టం రెట్టింపయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కుటుంబానికి రూ.2 వేలు సాయం న్యాయబద్దంగా లేదని విమర్శించారు.

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలివ్వాలి: హుద్‌ హుద్‌ సమయంలో ఇచ్చిన జీవో ద్వారా వరికి హెక్టారుకు ఇన్‌పుట్‌ సబ్సిడీ రూ.15 వేలకు పెంచామని.. తరువాత వచ్చిన తిత్లీ తుఫాను సమయంలో మళ్లీ పరిహారం పెంచి రూ.20 వేలు ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఉద్యాన పంటలకు హెక్టారుకు పరిహారం రూ.15 వేల నుండి రూ.20 వేలకు.. అరటికి రూ.30 వేలు, ప్రతి కొబ్బరి చెట్టుకు రూ.1500 గా నిర్ణయించామని వివరించారు. రాష్ట్ర విభజన సమస్యలతో నాడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్యాకేజీని పెంచి ఇచ్చామన్నారు. వరద ప్రభావిత ప్రాంతంలో ప్రతి బాధిత కుటుంబానికి రూ.10వేలు ఆర్థిక సాయం చెయ్యాలని డిమాండ్‌ చేశారు. పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.50వేలు ఇవ్వడంతో పాటు 2.50 లక్షలతో కొత్త ఇల్లు నిర్మించి ఇవ్వాలన్నారు. పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు 10 వేలు.. పూర్తిగా దెబ్బతిన్న ఇంటికి రూ.25 వేలు అందించాలని పేర్కొన్నారు. వరికి ఇన్‌పుట్‌ సబ్సిడీ హెక్టారుకు కనీసం రూ.25 వేలు మరియు ఆక్వాకల్చర్‌కు రూ.50 వేలు ఇవ్వాలని స్పష్టం చేశారు. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి రూ.10 లక్షలు ఎక్స్‌ గ్రేషియా ఇవ్వాలన్నారు. చనిపోయిన ఆవు లేదా గేదెకు రూ.40వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వరద బాధిత ప్రాంతాలకు మూడు నెలలు ఉచిత విద్యుత్ ఇవ్వడంతో పాటు ప్రభుత్వమే కొత్త మీటర్లు అందజెయ్యాలని కోరారు.

పోలవరం ప్రాజెక్టు కోసం సేకరించిన భూమికి సీఎం చెప్పినట్లు ఎకరానికి రూ.5 లక్షలు అదనపు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజ్ కింద ప్రభుత్వం ప్రకటన చేసినట్లు 10 లక్షల రూపాయలు ఇవ్వాలన్నారు. పోలవరం నిర్వాసితులకు దశల వారీ పరిహారం అనే విధానాన్ని పక్కనపెట్టి.. అందరికీ ఒకేసారి పరిహారం ఇవ్వాలని తేల్చిచెప్పారు. పోలవరం కోసం తమ భూములు, ఊళ్లు ఇచ్చి త్యాగం చేసిన నిర్వాసితులకు న్యాయం చెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. లేఖతో పాటు హుద్‌ హుద్‌ సమయంలో పరిహారంపై ఇచ్చిన జీవో నెం.9, తిత్లీ పరిహారంపై ఇచ్చిన జీవో నెం.14ను చంద్రబాబు జత చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.