Polavaram: పోలవరం నీటి లెక్కలపై తకరారు.. సరిదిద్దాలని కేంద్ర జలసంఘం సూచనలు

author img

By

Published : Aug 11, 2022, 9:53 AM IST

Polavaram calculations
పోలవరం లెక్కలు ()

Polavaram calculations: ధవళేశ్వరం బ్యారేజి వద్ద లెక్కలకు- పోలవరం లెక్కలకు పొంతన ఉండట్లేదని కేంద్ర జలసంఘం సందేహం వ్యక్తం చేసింది. ఈ లెక్కలను సరిదిద్దాలని కేంద్ర జలసంఘం సూచనలు చేసింది.

Polavaram calculations: పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద ఎంత ప్రవాహం దిగువకు మళ్లిందనే లెక్కల నిబద్ధతపై సందేహాలు ఏర్పడ్డాయి. ధవళేశ్వరం బ్యారేజి వద్ద లెక్కలకు- పోలవరం లెక్కలకు పొంతన ఉండట్లేదు. ధవళేశ్వరం బ్యారేజి లెక్కలకు ఏళ్ల తరబడి అదే విధానం అనుసరిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ముందు భద్రాచలం గోదావరి వద్ద, శబరి.. ఆ దిగువ ప్రవాహాలు కలిపి ధవళేశ్వరానికి చేరేవి. లెక్కల్లో పెద్ద తేడాలు రాలేదు. భద్రాచలం... ధవళేశ్వరం మధ్య పోలవరం ప్రాజెక్టు నిర్మించారు. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నిర్మాణం జరగకపోయినా స్పిల్‌ వే 48 గేట్ల నుంచి నీటిని వదులుతున్నారు. భద్రాచలానికి, ధవళేశ్వరానికి మధ్య ప్రస్తుతం వ్యత్యాసం రావచ్చు. మధ్యలో కొంతనీరు పోలవరం జలాశయంలో నిల్వ ఉంటుంది. కానీ పోలవరం.. ధవళేశ్వరం లెక్కల మధ్య తేడా రావడంతో కేంద్ర జలసంఘం జోక్యం చేసుకుందని సమచారం.

పోలవరంలో 21.83 లక్షలు, ధవళేశ్వరంలో 25.86 లక్షలు
జులైలో గోదావరి భారీ వరదల్లో పోలవరం స్పిల్‌ వే వద్ద 21.83 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు లెక్కలు నమోదయ్యాయి. అదే సమయంలో ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 25.86 లక్షల క్యూసెక్కులు వదిలారు. రెండు ప్రాజెక్టుల మధ్య దాదాపు 4 లక్షల క్యూసెక్కుల తేడా ఉండటాన్ని కేంద్ర జలసంఘం గుర్తించింది. ఇక్కడి లెక్కలపై దృష్టిసారించి.. పోలవరం స్పిల్‌ వే దిగువన స్పిల్‌ ఛానల్‌, పైలట్‌ ఛానల్‌ తర్వాత నదిలో కలిసేచోట నీటిలెక్కలు తీయాలని సూచించినట్లు పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యదర్శి రఘురామ్‌, సీఈ దీపక్‌చంద్ర పాటిల్‌ సూచించినట్లు తెలిసింది. వాళ్లు పోలవరం ప్రాజెక్టులో రెండు రోజులు తిరిగి అన్నీ పరిశీలించారు. ఈ సందర్భంగా అనేక సూచనలు చేశారు. పోలవరం నీటిప్రవాహ లెక్కలను సరిచేయాలనేది ఇందులో కీలకాంశం.

ఇటీవల వరదల ముందే పోలవరం వద్ద ప్రవాహ లెక్కలను సరిచేసే పని చేపట్టారు. భద్రాచలం వద్ద విడుదలయ్యే నీరు, పోలవరం, ధవళేశ్వరం మధ్య నీటిలెక్కల్లో భారీ తేడా ఉంటోంది. దీంతో నీటిని లెక్కించే ఫార్ములాను కొంత మార్చారు. అయినా ఈ లెక్కలు సరిపోవడం లేదు. మరోవైపు పోలవరం పనుల షెడ్యూలును మళ్లీ తయారుచేసి పంపాలని కోరారు. ప్రస్తుతం వరదలకు ప్రాజెక్టు నిర్మాణ స్థలంలో నీరు నిలిచిపోవడంతో పనులు జరగట్లేదు. గోదావరికి మళ్లీ వరద వస్తోంది. అక్టోబరు వరకూ పనులు ప్రారంభించగలిగే అవకాశాలు తక్కువేనని ఇంజినీర్లు అంటున్నారు. తదనుగుణంగా మళ్లీ షెడ్యూలు రూపొందించాలి.

ఎగువ కాఫర్‌ డ్యాం వద్ద కూడా తేడా
ఎగువ కాఫర్‌ డ్యాం వద్ద కూడా నీటిమట్టాల్లో తేడాలు కనిపించాయి. పోలవరం స్పిల్‌వే వద్ద గరిష్ఠంగా 36.545 మీటర్ల నీటిమట్టం గుర్తించగా, అదే సమయంలో ఎగువ కాఫర్‌ డ్యాం వద్ద 36.890 మీటర్ల నీటిమట్టాలు గరిష్ఠంగా నమోదయ్యాయి. గోదావరి సహజ ప్రవాహమార్గంలో తొలుత ప్రవాహాలు ముందుకొచ్చి.. తర్వాత మళ్లింపు మార్గం వైపు వెళ్లడం, మధ్యలో కొండ ఉండటం, అప్రోచ్‌ ఛానల్‌ తవ్వకం పూర్తి చేయకపోవడం ఇలాంటివన్నీ ఇందుకు కారణమని విశ్లేషిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.