ETV Bharat / city

కేసులు మళ్లీ ఎందుకు పెరుగుతున్నాయంటే..!

author img

By

Published : Mar 22, 2021, 10:39 PM IST

Ccmb Director Rakesh Mishra interview
సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ కే మిశ్రా

దేశంలో మరోమారు కరోనా విజృంభిస్తోంది. తెలంగాణలోని పాఠశాలల్లో రోజు రోజుకీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాలలను మూసే వేయాలన్న వాదనలు వినిపిస్తున్నాయి. మహమ్మారి తగ్గుతోంది అని భావిస్తున్న తరుణంలో కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. అయితే సరికొత్త వేవ్​కి కారణం ఏమిటి? ప్రజల అజాగ్రత్తా..? ప్రభుత్వాల అశ్రద్ద?.. ఆది నుంచి కరోనాపై అనేక పరిశోధనలు చేస్తూ.. ఎప్పటికప్పుడు వైరస్​కి సంబంధి అప్రమత్తం చేస్తోన్న సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ కే మిశ్రా ఏమంటున్నారంటే.

సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ కే మిశ్రాతో ముఖాముఖి

ప్ర. 100 రోజుల తరవాత మళ్లీ కరోనా కేసుల సంఖ్య పెరగటాన్ని ఎలా చూడాలి..?

జ. ఇందుకు ఎన్నో కారణాలున్నాయి. మాట్లాడటం, దగ్గరగా ఉండటం ద్వారా ఓ వ్యక్తి నుంచి మరో వ్యక్తికి ఈ కరోనా వైరస్‌ సోకుతుంది. జనసందోహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాస్క్‌ వేసుకోవటంలో నిర్లక్ష్యం వహిస్తే...కేసుల సంఖ్య భారీగా నమోదయ్యే ప్రమాదముంది. చాలా రోజులుగా కేసులు తగ్గిపోవటం వల్ల ప్రజలు కరోనా నిబంధనలు నిర్లక్ష్యం చేశారు. ఇంకా ఈ ముప్పు తప్పిపోలేదని...జాగ్రత్త వహించాలని నిపుణులు చెబుతున్నారు. నిర్లక్ష్యం వల్లే పలు దేశాల్లో సెకండ్, థర్డ్‌ వేవ్‌లు చూడాల్సి వస్తోంది. లాక్‌డౌన్‌ విధిస్తే..కేసులు తగ్గుతాయేమో. కానీ... ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సరైన నిర్ణయం కాదు. స్వచ్ఛందంగా ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తే.. ఈ ఉద్ధృతిని నియంత్రించవచ్చు. చాలా మంది కొత్త వేరియంట్లు వచ్చాయని అనుమానిస్తున్నారు. ఇది చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. అందుకే...కరోనా కేసులు పెరుగుతున్నాయి. భారత్‌లో..ఈ విదేశీ వేరియంట్ల కారణంగానే కేసులు పెరుగుతున్నాయని చెప్పలేం. ఇక్కడ విదేశీ వేరియంట్ల కేసులు 5-6% మేర మాత్రమే ఉన్నాయి. అంటే..90%పైగా కేసులకు విదేశీ వేరియంట్లు కారణం కాదు. ఈ కేసులు ఎక్కువగా ఉన్న చోట మేము జన్యు పరివర్తనా క్రమాలను విశ్లేషిస్తున్నాం. ఫలానా వేరియంట్‌ వల్లే ఈ పరిస్థితులున్నాయని కచ్చితమైన ఆధారాలు ఏమీ దొరకలేదు. కొత్త వేరియంట్లు ఎంత వేగంగా వ్యాప్తి చెందుతోంది, ఏ మేర ప్రమాదకరమైంది అన్నది పక్కన పెడితే.. మాస్క్‌లు ధరించటం, భౌతిక దూరం పాటించటం, వ్యక్తిగత శుభ్రతతో ఎదుర్కోవచ్చు. ఈ నిబంధనలు పాటించటమే ప్రాథమిక విధి. ఇవి పాటించకపోవటం వల్లే ఇలా కేసులు పెరుగుతున్నాయి. స్థానిక ఎన్నికలు, వివాహాలు, పాఠశాలల పున:ప్రారంభం, మెట్రో సేవలు ప్రారంభమవటం లాంటివి ప్రమాదకరంగా మారుతున్నాయి.

ప్ర. కరోనా కేసుల పెరుగుదలకు కారణం..ప్రజల నిర్లక్ష్యం అనుకోవాలా..? లేక ప్రభుత్వాల అజాగ్రత్త అని భావించాలా..?

జ. ప్రభుత్వ బాధ్యతను ప్రశ్నించటం సరికాదు. మాస్క్‌ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వాలు ప్రకటనలు ఇస్తూనే ఉన్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి, ప్రధానమంత్రి కూడా సూచనలు చేస్తూనే ఉన్నారు. అవగాహన కల్పించటం వరకే ప్రభుత్వాల బాధ్యత. మాస్క్‌లు ధరించని వారిని శిక్షించకపోవటాన్ని మాత్రమే నిందించాలి. కానీ...ఈ విషయంలో ప్రజలే బాధ్యతాయుతంగా ఉండాలి. నేను ఏడాదిగా జాగ్రత్తలు పాటిస్తున్నాను. ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందుతున్నందున అప్రమత్తంగా ఉండాలి. కరోనా నిబంధనలు పాటించటం సామాజిక బాధ్యత. ఇవి పాటించకపోతే...మనం ప్రమాదకారకులమవుతాం.

ప్ర. కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే కేసులు ఎక్కువగా నమోదు కావటానికి కారణాలేంటి..?

జ. మహారాష్ట్రలో స్థానిక పంచాయతీ ఎన్నికలు, పెద్ద ఎత్తున వివాహాలు జరిగాయి. ఇలాంటి కార్యక్రమాల తరవాత కేసులు పెరగటం మనం చూస్తూనే ఉన్నాం. చాలా చోట్ల ప్రజలు కరోనా నిబంధనలు గాలికొదిలేశారు. కేరళలో ఓనమ్‌ తరవాత కేసులు ఒక్క ఉదుటన పెరిగాయి. వివాహ కార్యక్రమాల్లో ఎవరైనా కరోనా అసింప్టమేటిక్‌ ఉంటే...వారి నుంచి 5-100 మందికి వ్యాప్తి చెందుతోంది. ఇవే సూపర్ స్ప్రెడర్‌లుగా మారుతున్నాయి. ఇలాంటి కార్యక్రమాలు వరుసగా నిర్వహిస్తే...తక్కువ సమయంలోనే కరోనా ఉద్ధృతమవుతుంది. ప్రస్తుతం మహారాష్ట్రలో ఆందోళనకర పరిస్థితులున్నాయి. రోజువారీ కేసులు గతంలో కన్నా ఎక్కువగా నమోదువుతున్నాయి. మరో ప్రమాదం తప్పదేమోనన్న భయం కలుగుతోంది. ఇలాగే కేసులు పెరుగుతూ పోతే...కొత్త వేరియంట్లు భారత్‌లోనూ విజృంభించే ప్రమాదముంది.

ప్ర. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి..? ముఖ్యంగా తెలంగాణలో విద్యా సంస్థల్లో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. వీటిని తగ్గించటం ఎలా..?

జ. పాఠశాలల్లో కరోనా నియంత్రణ కష్టసాధ్యమనే చెప్పాలి. ఇప్పటికే చాన్నాళ్ల పాటు బడులు మూతపడ్డాయి. కానీ...కొత్త వేరియంట్ల ఆందోళన, పాఠశాలలు సూపర్‌ స్ప్రెడర్‌లుగా మారటం లాంటి పరిణామాలు చూస్తుంటే...రెండు, మూడు నెలల పాటు మళ్లీ మూసివేయటమే మంచిదనిపిస్తోంది. విద్యార్థులు ఒకరితో ఒకరు ఆడుకుంటారు. మాట్లాడుకుంటారు. అక్కడ కరోనా నిబంధనలు పాటించటం కష్టం. పిల్లలపై కరోనా ప్రభావం తక్కువే ఉన్నప్పటికీ...ప్రాణాలకు ప్రమాదం లేదని చెప్పలేం. వాళ్లు కుటుంబ సభ్యులతో కలిసి ఉండటం వల్ల వారికీ ఇబ్బందులు తలెత్తుతాయి.

ప్ర. ఏడాది కాలంగా కరోనా జన్యు పరిణామాలపై పరిశోధన సాగిస్తున్నారు. ఇప్పటి వరకు భారత్‌లో ఎన్ని స్ట్రెయిన్‌లను కనుగొన్నారు..? వాటిలో ఏది వేగంగా వ్యాప్తి చెందుతోంది..?

జ. గతంలో బాధితుల వైరస్ నమూనాలు సేకరించి దాదాపు 6 వేల జీనోమ్‌లను విశ్లేషించాం. వాటిలో దాదాపు 7 వేల మ్యుటేషన్‌లు జరిగినట్టు గుర్తించాం. కానీ...వాటి వల్ల దుష్పరిణామాలు ఏమీ లేవు. ఇవి పెద్దగా వ్యాప్తి చెందవు. అయితే..వైరస్ జన్యుపటంలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయనటానికి ఇది నిదర్శనం. వైరస్ వ్యాప్తి చెందటానికి మనమెంత అనువైన పరిస్థితులు కల్పిస్తే..అది అంత ప్రమాదకరంగా మారుతుంది. ఇటీవల మరోసారి ఈ అంశంపై పరిశోధనలు చేశాం. ప్రస్తుతం నమోదవుతున్న కొత్త కేసుల్లో 5% నమూనాలను అధ్యయనం చేయాలని ప్రభుత్వం భావించటం మంచి పరిణామం. దేశంలో అన్ని ప్రాంతాల్లో ఇలాంటి అధ్యయనమే చేయాలి. కొత్త వేరియంట్ వస్తుందా లేదా అన్నది అప్పుడే తెలుస్తుంది. వారానికోసారి ఈ మదింపు చేపట్టాలి. సమన్వయంతో నమూనాలు సేకరించి అధ్యయనం జరిపితే.. వేరియంట్లు గుర్తించటంలో తోడ్పాటుగా ఉంటుంది.

ప్ర. విదేశాల నుంచి వస్తున్న వారిలో కొంత మందికి పాజిటివ్‌గా నిర్ధరణవుతోంది. విదేశీ వేరియంట్ల ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉంది..?

జ. హైదరాబాద్ విమానాశ్రయానికి వచ్చే వారందరినీ పరీక్షించటం ద్వారానే ఈ విషయంలో ఓ స్పష్టత వస్తుంది. స్వదేశం నుంచి కొవిడ్ సర్టిఫికేట్‌ ఉండటమూ మంచిదే. విమానాశ్రయంలోనే కొవిడ్ పరీక్షా వసతులున్నాయి. పాజిటివ్ వచ్చిన వారందరి నమూనాలనూ సీసీఎమ్‌బీకి పంపుతున్నారు. అది యూకే వేరియంటా మరింకేదైనా అన్నది మేం నిర్ధరిస్తున్నాం. బాధితులను క్వారంటైన్‌కు పంపాలి. విదేశీ వేరియంట్‌ కాకపోతే..ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉండేలా చర్యలు చేపట్టాలి. యూకే వేరియంట్లు ఎక్కువగా గుర్తించాం. దక్షిణాఫ్రికా వేరియంట్‌ ఒకటి గుర్తించినా.. బ్రెజిల్ వేరియంట్ల ఉనికి అసలు లేదు. ప్రయాణ చరిత్ర లేని వారిలో యూకే వేరియంట్లు కనిపించటం లేదు.

ప్ర. ఇటీవలే హైదరాబాద్‌లో 9 వేల మందిపై సీసీఎమ్‌బీ సీరమ్ సర్వే చేపట్టింది. అందులో 55% మందికి ఇప్పటికే కరోనా వచ్చిందని, వారిలో యాంటీబాడీలున్నాయని తేలింది. హైదరాబాద్‌ హెర్డ్‌ ఇమ్యూనిటీకి దగ్గర్లో ఉందని భావించాం. ప్రస్తుత కరోనా ఉద్ధృతిలో ఇది సాధ్యమని అనుకోవచ్చా..?

జ. హెర్డ్‌ ఇమ్యూనిటీ అనేది నెమ్మదిగా వస్తుంది. వ్యాక్సినేషన్‌ ద్వారా ఇది సాధించవచ్చు. 56% మందిలో ఇన్‌ఫెక్షన్‌ ఉందని తేలటం కచ్చితంగా గుర్తించాల్సిన విషయం. మేము రెండు విధానాలు అనుసరించి అధ్యయనం చేసినా...దాదాపు ఇదే సంఖ్యలో ఇన్‌ఫెక్షన్‌లున్నాయని గుర్తించాం. 70-80% మంది వేగంగా వ్యాక్సిన్‌లు అందించగలిగితే...హెర్డ్‌ ఇమ్యూనిటీ తొందర్లోనే సాధించవచ్చు. ఇప్పుడు కరోనా ఉద్ధృతి ఉన్నా...వ్యాక్సిన్‌ అనే అస్త్రం మన చేతిలో ఉంది. కానీ..పెద్ద మొత్తంలో అందిస్తేనే...టీకాలతో ఉపయోగం ఉంటుంది. ఈ ప్రక్రియలో జాప్యం జరిగితే వైరస్‌ మరో కొత్త అవతారంలో వ్యాప్తి చెందుతుంది. వీలైనంత త్వరగా వైరస్ గొలుసును తెంచేయాలి. లేకపోతే కొత్త రకం వైరస్‌ మళ్లీ సోకే ప్రమాదముంది. రీ ఇన్‌ఫెక్షన్‌ కేసులు ప్రస్తుతానికి తక్కువే ఉండటం శుభ పరిణామం. వ్యాక్సిన్‌ల ద్వారా యాంటీబాడీలు పెరిగి రీ ఇన్‌ఫెక్షన్‌కు ఆస్కారం తక్కువగా ఉంటుంది. ఎంత తొందరగా వ్యాక్సినేషన్‌ చేపడితే అంత వేగంగా కరోనాకు కళ్లెం వేయొచ్చు. అందరికీ టీకాలు అందించాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తాను. సరఫరా అనేది ఇప్పుడు సమస్యే కాదు. నెలకు 60-70లక్షల డోసులు అందుతున్నాయి. భారత్‌ బయోటెక్, సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌లు ఈ డోసుల సంఖ్యను పెంచవచ్చు. ఇప్పటికే కోట్లాది మంది ఈ టీకాలు తీసుకున్నందున ఇది సురక్షితమా కాదా అన్న అనుమానమే అక్కర్లేదు.

ప్ర. పెద్ద మొత్తంలో ప్రజలకు వ్యాక్సినేషన్‌లు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కానీ ప్రజలు ఈ విషయంలో ఆసక్తి చూపటం లేదని చెబుతోంది. వారిలో అవగాహన కల్పించి వ్యాక్సిన్‌ తీసుకునేలా ఎలాంటి చర్యలు చేపట్టాలి..?

జ. ప్రభుత్వం ప్రకటించినట్టుగా ఎవరైనా వ్యాక్సిన్ తీసుకునే అవకాశముంటే...కచ్చితంగా అందరూ ముందుకొస్తారనే భావిస్తున్నాను. దీర్ఘకాలిక వ్యాధులున్న వారు మొదట తీసుకోవాలని చెబుతున్నారు. ఎలాంటి జబ్బులు లేని వారితో పోల్చి చూస్తే...వ్యాక్సిన్ దుష్ఫలితాలు వీరిపై ఎక్కువగా ఉంటాయి. కానీ...వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉంటే...ప్రాధాన్య క్రమంలోని వారికే కాకుండా అందరికీ అందించాల్సిన అవసరముంది. కొందరిలో లక్షణాలు కనిపించకపోయినా.. కరోనా వ్యాప్తి చెందే ప్రమాదమున్నందును అందరికీ టీకాలు అందించాలి. ఇది ప్రజారోగ్యానికి మేలు చేస్తుంది. మొదట్లో టీకాలు సురక్షితమా కాదా..? ఎందుకంత తొందరగా వాటికి అనుమతులిచ్చారు..? అన్న చర్చలు సాగాయి. ఇప్పుడు టీకాలతో రక్తం గడ్డకట్టుకుపోతోందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ అనవసరమైన చర్చలు. వ్యాక్సిన్‌లు కచ్చితంగా సురక్షితమే. అలా కాకుంటే..మొత్తం మూడు దశల ట్రయల్స్‌ దాటుకుని మార్కెట్‌లోకి రానే రావు. ఈ విషయంలో ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు. భారత్‌తో సహా మరికొన్ని చోట్ల మొత్తంగా 3 కోట్ల మందికి వ్యాక్సిన్‌లు అందాయి. ఇంగ్లాండ్‌లో పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్‌ చేపట్టటం వల్ల కరోనా తగ్గుముఖం పట్టింది. ఎవరైనా టీకాలు తీసుకోవచ్చని ప్రభుత్వాలు ప్రచారం చేయాలి. మీడియాతో పాటు అవగాహన ఉన్న వారంతా టీకాలు సురక్షితమని వివరించాలి. ఇతర వ్యాక్సిన్ల లాగానే కరోనా టీకాలు తీసుకోవచ్చని చెప్పాలి. టీకా తీసుకోవటం అనేది సామాజిక బాధ్యత. ఇది మనకోసం మాత్రమే కాదు. ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదమున్నందున టీకా తీసుకోని వారే వైరస్ వాహకులుగా మారతారు. అదే వ్యాక్సిన్ తీసుకుంటే ఈ ముప్పు తొలిగిపోతుంది. ఇది ఉమ్మడిగా పోరాడాల్సిన సమయం.

ప్ర. ఇప్పటికే టీకాలు తీసుకున్న వారు తాము ఇక మాస్క్‌లు ధరించాల్సిన పని లేదని భావిస్తున్నారు. వైద్యులు మాత్రం టీకాలు తీసుకున్న వారు తమను తాము రక్షించుకో గలిగినా..వైరస్ వాహకులుగా మారతారని చెబుతున్నారు..? ఇందులో వాస్తవమెంత..?

జ. ప్రస్తుతానికి వ్యాక్సిన్‌లు దుష్పరిణామాల నుంచి మాత్రమే కాపాడతాయి. టీకా తీసుకున్నా... కరోనా రాదని, వారి నుంచి వైరస్ సోకదనటానికి ఆధారాలు ఏమీ లేవు. వ్యాక్సిన్‌ తీసుకున్నా... వైరస్ సోకి ఆ లక్షణాలు కనపడకపోయినా...ఆ వ్యక్తి నుంచి వ్యాప్తి చెందే అవకాశాలున్నాయి. అందుకే కచ్చితంగా మాస్క్ ధరించాలని చెబుతున్నాం. వ్యాక్సిన్‌ అనేది 100% మందికి 100% రక్షణ కల్పిస్తుందని చెప్పలేం. ప్రస్తుతానికి టీకా 70-80% మందికి మాత్రమే అందుబాటులో ఉంది. ఆ మిగతా 30% మందిలో మనం ఉండము అని ధీమాగా ఎలా ఉంటాం..? మాస్క్‌ ధరించకపోతే...ఆ వ్యక్తి కరోనా టీకా తీసుకున్నాడని ఎలా అనుకోగలం..? ఎవరూ మాస్క్‌ ధరించనప్పుడు నేను మాత్రం ఎందుకు పెట్టుకోవాలి అన్న ఆలోచన వచ్చేస్తుంది. ఇదొక సామాజిక బాధ్యత. అందరూ మాస్క్‌లు పెట్టుకోవాలి. మనవల్ల ఎలాంటి ముప్పు కలగకూడదు. మాస్క్‌ ధరించనివారికి సామాజిక స్పృహ లేదని భావించాల్సి ఉంటుంది. టీకా తీసుకున్నా, తీసుకోకపోయినా...మాస్క్‌లు తప్పనిసరి.

ప్ర. మహారాష్ట్ర, కర్ణాటకతో సరిహద్దులు పంచుకున్న ప్రాంతాల్లో కరోనా వైరస్ ఉద్ధృతిని అడ్డుకునే విషయంలో ప్రభుత్వాలకు మీరు ఎలాంటి సూచనలు చేస్తారు..?

జ. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు కీలకం. సరిహద్దులు దాటుకుని ప్రయాణించటం ఇక్కడ చాలా సులువైపోయింది. అందుకే..సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచాల్సిన అవసరముంది. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగానూ నియంత్రణ చర్యలు చేపట్టాలి. కరోనా పరీక్షలు వీలైనంత మేర పెంచాలి. ఇవి ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలకు బదులుగా ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేయటం మంచిది. యాంటీజెన్‌ టెస్టుల్లో 50% మేర మాత్రమే ఫలితాలు కచ్చితంగా వస్తున్నాయి. యాంటీజెన్‌లో నెగటివ్ వచ్చిన వారు నిర్లక్ష్యంగా ఉండే అవకాశముంది. ఫలితంగా బాధితులతో సన్నిహితంగా ఉన్న వారిని గుర్తించటానికి వీలుండదు. అందుకే...సరైన విధానంలో పరీక్షించటం మంచిది. ప్రస్తుతానికి ఈ పరీక్షల వ్యయం కూడా తగ్గిపోయింది. ఈ పరీక్షలతో బాధితులను గుర్తించి క్వారంటైన్‌కు పంపటం ప్రభుత్వాల విధి. వీలైనంత త్వరగా ఎక్కువ మందికి వ్యాక్సిన్‌లు అందించేందుకు ప్రయత్నించాలి. 60 ఏళ్లు, 45 ఏళ్ల లోపున్న వారికీ టీకాలు అందేలా కేంద్రాలు పెంచాలి. టీకాలు సురక్షితమని ప్రజలకు వివరించాలి. ప్రజలు కూడా సహకరించాలి. అందరూ కరోనా నిబంధనలు పాటించాలి. మాస్క్‌లు ధరించటాన్ని భారంగా భావించవద్దు. భౌతికదూరం, వ్యక్తిగత శుభ్రత తప్పనిసరి. ఈ మూడింటిని అనుసరిస్తే...వైరస్ ఇబ్బందులతో పాటు మరోసారి లాక్‌డౌన్‌ పరిస్థితులు తలెత్తవు.

ఇదీ చూడండి:

వెటర్నరీ పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ ​సిగ్నల్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.