ETV Bharat / city

ఇవాళ కేబినెట్ భేటీ.. చర్చించే అంశాలివే

author img

By

Published : May 4, 2021, 4:16 AM IST

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి వేళ.. పాక్షిక కర్ఫ్యూ, ఆస్పత్రుల్లో పడకల పెంపు, వ్యాక్సినేషన్ వంటి కీలకమైన అంశాలపై నేడు మంత్రివర్గ సమావేశం జరగనుంది. విశాఖలో ప్రభుత్వ అతిథి గృహాలను పర్యాటక శాఖ ద్వారా నిర్మించే అంశంపైనా చర్చించనుంది. సచివాలయంలో ఉదయం పదకొండున్నరకు మంత్రివర్గం సమావేశం కానుంది.

cabinet-meeting-today
cabinet-meeting-today

ఇప్పటికే 2సార్లు వాయిదా పడిన కేబినెట్ సమావేశంలో కీలకమైన అంశాల చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కరోనా రెండో వేవ్ కార్చిచ్చులా వ్యాపిస్తున్న సమయంలో.. కట్టడికి పాక్షికంగా కరోనా కర్ఫ్యూ ఏర్పాటుపై కేబినెట్‌ చర్చించనుంది. ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఆంక్షలు సడలిస్తూ.. మిగతా సమయం అంతా 144 సెక్షన్ విధించేందుకు కేబినెట్‌ సమ్మతించనుంది. ఆస్పత్రుల్లో పడకల పెంపు, ఆక్సిజన్ సరఫరా, రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు, వ్యాక్సినేషన్ ప్రక్రియపైనా నిర్ణయాలు తీసుకోనుంది. 18-45 ఏళ్ల మధ్య వారికి వ్యాక్సినేషన్ కోసం నిధుల కేటాయింపుపైనా కేబినెట్ ఆమోదం తెలపనుంది.

విశాఖలోని కైలాసగిరి నుంచి భోగాపురం విమానాశ్రయం వరకూ పర్యాటక ప్రాజెక్టుల పేరిట రాష్ట్ర అతిథిగృహాల నిర్మాణం చేపట్టే కీలకమైన అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. మొత్తం 8 ప్రాజెక్టుల నిర్మాణం కోసం పర్యాటకశాఖ కేబినెట్​కు ప్రతిపాదించింది. బీచ్ రోడ్ అభివృద్ధి, రిషికొండ, గ్రేహౌండ్స్ కొండ, తొట్లకొండ, బే పార్క్ ప్రాజెక్టుల ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదాన్ని తెలియచేసే అవకాశాలున్నాయి. రాష్ట్ర అతిథిగృహం నిర్మాణాన్ని పర్యాటక ప్రాజెక్టు కిందే చేపట్టాలని పర్యాటకశాఖ ప్రతిపాదించింది.

రామాయపట్నం పోర్టు నిర్మాణానికి బిడ్ల ఖరారుపై ర్యాటిఫికేషన్​కు కేబినెట్‌ లాంఛనంగా ఆమోదాన్ని తెలియచేయనుంది. భూసేకరణలో ఎస్సీ, ఎస్టీలకు 10 శాతం అదనంగా పరిహారం ఇచ్చే ప్రతిపాదన చర్చకు రానుంది. అర్చకుల వేతనాల పెంపు ప్రతిపాదనలకూ కేబినెట్ పచ్చజెండా ఊపుతుందని సమాచారం. ప్రైవేటు వర్సిటీలు 35 శాతం మేర సీట్లు కన్వీనర్ కోటాలో ఇచ్చేలా ప్రతిపాదనలకూ అంగీకరించే అవకాశముంది. విశ్వవిద్యాలయాల్లో స్థానిక, నాన్ లోకల్ సీట్ల కేటాయింపులపై కొత్తగా నిర్ణయం తీసుకునే ఆస్కారం ఉంది. ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలు ప్రభుత్వ ఆధీనంలోకి తీసువచ్చేలా ప్రతిపాదనలు, అధ్యాపకులను ప్రభుత్వ సర్వీసులోనికి తీసుకునేలా ప్రతిపాదనలు చేశారు. మున్సిపాలిటీల్లో ఉన్న లే అవుట్లలో భూమి రిజిస్ట్రేషన్ విలువలో 5 శాతం మేర జగనన్న కాలనీలకు కేటాయించేలా ప్రతిపాదనలపైనా కేబినెట్​లో చర్చించనున్నారు. చెన్నై-బెంగుళూరు పారిశ్రామిక కారిడార్ లో 5 వేల కోట్లతో అభివృద్ధి కోసం చేసిన ప్రతిపాదనలపైనా కేబినెట్ చర్చించనుంది.

ఇదీ చదవండి: కేరళ సీఎం విజయన్​ రాజీనామా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.