ETV Bharat / city

'తప్పులు సరి చేసి నూతన జాబితా విడుదల చేయండి'

author img

By

Published : Oct 22, 2020, 3:26 PM IST

నవంబర్​లో జరగనున్న గ్రూప్-1 పరీక్షను వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రాథమిక పరీక్షలో దొర్లిన తప్పులను సరి చేసి నూతన జాబితా విడుదల చేయాలని ఏపీపీఎస్సీని ఆదేశించింది. గ్రూప్-1 పరీక్ష నిర్వహణపై దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన ధర్మాసనం.. ఈ మేరకు తీర్పునిచ్చింది.

AP High Court Ordered APPSC over Primary Key Issues
'తప్పులను సరిచేసి నూతన జాబితా విడుదల చేయండి'

న్యాయవాది యోగేశ్

నవంబర్​లో జరగనున్న గ్రూప్-1 ప్రధాన పరీక్షలను వాయిదా వేయాలని హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ప్రాథమిక పరీక్షలో దొర్లిన తప్పులను సరి చేసి నూతన జాబితా ప్రకటించాలని ధర్మాసనం ఏపీపీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. 2018 డిసెంబర్​లో 169 గ్రూప్-1 పోస్టుల భర్తీ నిమిత్తం ఏపీపీఎస్సీ ప్రకటన జారీ చేసింది. ప్రాథమిక పరీక్ష 2019 మే 26న నిర్వహించారు. ప్రాథమిక పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి. నవంబర్ 2 నుంచి ప్రధాన పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ప్రాథమిక పరీక్ష మొత్తం 120 ప్రశ్నల్లో ఆంగ్ల ప్రశ్నలను తెలుగులోకి అనువాదం సందర్భంగా 51 తప్పులు దొర్లాయని, ప్రాథమిక పరీక్షను రద్దు చేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. కొంతమంది అభ్యర్థుల తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు, తాండవ యోగేష్ గత విచారణలో వాదనలు వినిపించారు. పరీక్ష సమయంలో నాన్ ప్రోగ్రామబుల్ క్యాలిక్యులేటర్లు అనుమతిస్తామని ప్రకటనలో పేర్కొన్నారు. అయితే వాటిని అనుమతించలేదన్నారు. పరీక్ష పూర్తయ్యాక సంబంధిత సబ్జెక్ట్ నిపుణులు క్యాలిక్యులేటర్లు అనుమతించాల్సిన అవసరం లేదని ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు.

ఆంగ్ల ప్రశ్నలను తెలుగులోకి అనువాదం చేసినప్పుడు దొర్లిన 26 తప్పులను న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. ఆ ప్రశ్నలన్నింటిని తొలగించి సవరించిన ప్రతిభావంతుల జాబితాను తయారు చేసేలా ఏపీపీఎస్సీని ఆదేశించాలని కోరారు. సమస్య పరిష్కారమయ్యే వరకు నవంబర్​ 2న నిర్వహించనున్న ప్రధాన పరీక్షను కొన్ని రోజులు వాయిదా వేసేలా ఆదేశించాలని కోరారు.

మొదటిసారి 'కీ' విడుదల చేసిన తర్వాత.. అభ్యర్థుల నుంచి అభ్యంతరాల్ని స్వీకరించామని ఏపీపీఎస్సీ తరపు న్యాయవాది మల్లిఖార్జున గత విచారణలో కోర్టుకు తెలిపారు. తర్వాత సవరించిన 'కీ' ఇచ్చామని.. మళ్లీ అభ్యంతరాలు స్వీకరించామన్నారు. ఆ తర్వాత తుది 'కీ' విడుదల చేశామని వాదించారు. పిటిషనర్లు సకాలంలో అభ్యంతరాలు తెలపకుండా కోర్టును ఆశ్రయించడం సరికాదన్నారు. తప్పులు దొర్లిన 25 ప్రశ్నలను తొలగించే తుది 'కీ' విడుదల చేశామని వివరించారు. పిటిషనర్లు తాజాగా అభ్యంతరం తెలుపుతున్న 26 ప్రశ్నలు గతంలో తొలగించిన 25 ప్రశ్నల్లో భాగంగా ఉన్నాయా..? లేదా..? అని ఏపీపీఎస్సీ న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం తీర్పు రిజర్వులో ఉంచి నేడు వెలువరించింది.

ఇదీ చదవండీ... మహా పాదయాత్రతో ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి: రైతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.