ETV Bharat / city

ప్రపంచమంతా కరోనాను ఎదుర్కొంటోంది.. మనకూ ఎలాంటి మినహాయింపుల్లేవు

author img

By

Published : Jul 3, 2020, 6:06 AM IST

ap high court on corona situation
ap high court on corona situation

కరోనా విపత్కర పరిస్థితుల్లో న్యాయవ్యవస్థ ఓ కుటుంబంలా ఒకరికొకరు సహకరించుకుంటూ పనిచేయాల్సిన సమయమని హైకోర్టు పేర్కొంది. న్యాయమూర్తులు, కోర్టు సిబ్బందిని ఉద్దేశించి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జేకే మహేశ్వరి .. ఇచ్చిన సందేశానికి సంబంధించి హైకోర్టు ఇన్​ఛార్జి రిజిస్ట్రార్ జనరల్ సునీత ఉత్తర్వులు జారీచేశారు. కష్టకాలంలో ఆశ అనేది ఇంధనంలా పనిచేస్తుందన్నారు. ప్రపంచం మొత్తం కరోనా మహ్మమ్మారిని ఎదుర్కొంటోందని.. కొన్ని మిలియన్ల మంది జీవితాల్నికరోనా ప్రభావితం చేస్తోందన్నారు. మనకూ ఎలాంటి మినహాయింపులు లేవని ప్రధాన న్యాయమూర్తి సందేశంలో తెలిపారు.

'కష్టకాలంలో ఆశ ఇంధనంలా పనిచేస్తుంది. ప్రపంచమంతా కరోనాను ఎదుర్కొంటోంది. మనకూ ఎలాంటి మినహాయింపులు లేవు. ఈ కష్టకాలంలో న్యాయవ్యవస్థకు మూలస్తంభాలైన న్యాయాధికారులు, సిబ్బందికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తరఫున ఈ సందేశాన్ని తెలియజేస్తున్నా. హైకోర్టు, దిగువ న్యాయస్థానాల న్యాయమూర్తులు, సిబ్బంది అంతా న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠ, ప్రాముఖ్యాన్ని తెలియజేయాల్సిన సమయమిది. ప్రజల హక్కులను కాపాడే విషయంలో కోర్టులు పనిచేయడం తప్పనిసరనేది గుర్తుంచుకోవాలి. సేవల్లో ముందు వరుసలో ఉన్న ఆరోగ్య, పురపాలక, నీటిసరఫరా, విద్యుత్‌, పోలీసు తదితర విభాగాల మాదిరిగానే న్యాయవ్యవస్థా పనిచేయాలి. న్యాయసేవలను నిరాకరించలేం. వ్యాధి విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. మనకున్న సమాచారం ప్రకారం ఏపీలో కరోనాను ఎదుర్కొని కోలుకున్న వారు 98శాతంకంటే ఎక్కువ ఉంది. హైకోర్టు అధికారులు, సిబ్బందికి చేసిన పరీక్షల్లో 26 మందికి పాజిటివ్‌గా తేలింది. వారందరూ నిపుణులైన వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నారు. వారి ఆరోగ్య స్థితిపై వ్యక్తిగతంగా హైకోర్టు రిజిస్ట్రార్‌ (మేనేజ్‌మెంట్) ద్వారా సీజే పర్యవేక్షిస్తున్నారు. కరోనా విషయమై రాష్ట్రంలోని వైద్యులు ఐ.రమేశ్‌ (డీఎంహెచ్‌వో), అమృత (మెడికల్‌ ట్రైనీల జిల్లా అధికారి) తదితరులతో హైకోర్టు సీజే చర్చించారు. బాధితులకు కుటుంబసభ్యుల సహకారం ఎంతైనా అవసరం. సిబ్బంది తోడ్పాటుతో హైకోర్టు పరిపాలన విభాగం సమస్యను ఎదుర్కోడానికి నిబద్ధతతో పనిచేస్తుంది. బాధితుల పట్ల అపోహలను తొలగించుకుంటూ సరైన వైద్య పరిజ్ఞానంతో సలహాలనివ్వాలి. వారికి భరోసానివ్వడం ఈ సమయంలో ఎంతైనా అవసరం' అని ఉత్తర్వులలో పేర్కొన్నారు.

మధ్యంతర ఉత్తర్వులు 4 వారాలు పొడిగింపు
లాక్‌డౌన్‌ నేపథ్యంలో కూల్చివేతలు, టెండర్లు తదితర వ్యవహారాలపై మార్చి 26న మధ్యంతర ఉత్తర్వులను పొడిగించారు. వాటిని మరో 4వారాలు పొడిగిస్తూ హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులనిచ్చింది.

ఇదీ చదవండి: రాజ్యాంగం ప్రకారం ఎవరి పరిధిలో వాళ్లుండాలి: సభాపతి తమ్మినేని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.