ETV Bharat / city

AP-TG WATER ISSUE: కృష్ణా జలాలపై.. మరోసారి సుప్రీంకు రాష్ట్ర ప్రభుత్వం

author img

By

Published : Jul 14, 2021, 11:48 AM IST

Updated : Jul 14, 2021, 5:45 PM IST

krishna water
krishna water

11:45 July 14

చట్టబద్ధమైన నీటివాటాను తెలంగాణ అడ్డుకుంటోందని నివేదన

 పొరుగు రాష్ట్రం తెలంగాణతో ఉన్న కృష్ణా జలాల వివాదంపై ఏపీ ప్రభుత్వం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తమకు రావాల్సిన చట్టబద్ధమైన వాటాను రానివ్వకుండా తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుంటోందని పిటిషన్​ దాఖలు చేసింది. రాష్ట్రానికి దక్కాల్సిన న్యాయమైన వాటాకు తెలంగాణ గండికొడుతోందని, తక్కువ స్థాయిలో నీటిమట్టం ఉన్నా.. నిబంధనలకు విరుద్దుంగా శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని ఫిర్యాదు చేసింది. తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధమైన చర్యలు చేపడుతోందని.. ఇది ఏపీ ప్రజల జీవించే హక్కు హరించటమేనని పిటిషన్‌లో పేర్కొంది.  

 ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఏర్పడిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను, నదీ జలాల పంపకంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను కృష్ణా నది యాజమాన్య బోర్డు అమలు చేయడం లేదని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌లో వివరించింది.  

మానవ హక్కుల ఉల్లంఘనే...

 బచావత్‌ ట్రైబ్యునల్‌ అవార్డు ప్రకారం తాగునీరు, సాగునీటి అవసరాలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని.. సాగు అవసరాల కోసం నీటిని విడుదల చేసినప్పుడు మాత్రమే విద్యుదుత్పత్తి చేయాలని పిటిషన్‌లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. ఎగువ ప్రాంతం సాగునీటి, తాగునీటి అవసరాలు లేకుండానే కేవలం విద్యుదుత్పత్తి కోసం.. విలువైన జలాలను సముద్రంలోకి వృథాగా వదిలేసే పరిస్థితులు తీసుకురావడం మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుందని ఏపీ ప్రభుత్వం పిటిషన్​లో తెలిపింది.

కేంద్రానికి అప్పగించండి..

 రిజర్వాయర్లు, వాటిపై ఉన్న విద్యుత్‌ కేంద్రాలను కేంద్రం తన అధీనంలోకి తీసుకుంటే తారతమ్య భేదం లేకుండా వ్యవహరించే అవకాశం ఉంటుందని తెలిపింది. కృష్ణా బోర్డు పరిధి, విధివిధానాల ఖరారు లాంటి అంశాల్లో కేంద్రం గట్టిగా చర్యలు తీసుకోకపోవడాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చింది.  

విధివిధానాలు ఖరారు చేయాలి..

 పూర్తి సామర్థ్యం మేరకు జల విద్యుత్‌ ఉత్పత్తి చేయాలని ఆదేశాలు ఇస్తూ.. తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన జీవోను వెంటనే నిలుపుదల చేయాలని పిటిషన్​లో ఏపీ ప్రభుత్వం కోరింది. కృష్ణా బోర్డు విధివిధానాలను ఖరారు చేయాలని, కేఆర్‌ఎంబీ పరిధిని నిర్ణయిస్తూ.. కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. ఉమ్మడి యాజమాన్యంలో ఉన్న రిజర్వాయర్లు, విద్యుత్తు ప్రాజెక్టుల నిర్వహణను కేంద్రానికి అప్పగిస్తూ ఆదేశించాలని విజ్ఞప్తి చేసింది. గతంలో నిర్ణయించుకున్న వాటాల ప్రకారమే నదీ జలాలు వాడుకునేలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌  ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానానికి పిటిషన్‌ ద్వారా విజ్ఞప్తి చేసింది. 

ఇదీ చదవండి:

కృష్ణా జలాల వివాదంపై సుప్రీంకోర్టుకు వెళ్తాం: సజ్జల

Last Updated : Jul 14, 2021, 5:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.