ETV Bharat / city

AMARAVATI: కలల రాజధాని ఇప్పుడిలా..!

author img

By

Published : Aug 8, 2021, 4:16 AM IST

Updated : Aug 8, 2021, 4:35 AM IST

గత ప్రభుత్వ హయాంలో నిర్మాణ పనులతో కళకళలాడిన రాజధాని అమరావతి ప్రాంతం ఇప్పుడు వెలవెలబోతోంది. సగం పూర్తైన నిర్మాణాలు, పిచ్చిమెుక్కలు, తుప్పుపట్టిన కట్టడాలతో అందాలు కళ తప్పాయి. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంటి కలల రాజధానిపై నీలినీడలు కమ్ముకున్నాయి. అప్పటి నుంచే అక్కడ అభివృద్ధి, నిర్మాణ పనులు క్రమంగా అటకెక్కాయి. దేశ రాజధానిని తలదన్నే రాజధాని కట్టాలనుకున్న తెలుగోడి ఆశయం ప్రస్తుతం నిలిచిపోయింది. ప్రస్తుతం అక్కడి దయనీయ పరిస్థితులు వాస్తవాలకు అద్దం పడుతున్నాయి.

AMARAVATI
AMARAVATI

టు చూసినా బహుళ అంతస్తుల ఆకాశ హర్మ్యాలు.. విశాలమైన రహదారులు.. అందమైన ఉద్యానవనాలు.. జల విహారానికి వీలుగా తీర్చిదిద్దిన కాలువలు.. అన్ని వర్గాల వారూ సుఖంగా, సౌఖ్యంగా నివసించే మహానగరం! విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు నెలవు. ఆంధ్రప్రదేశ్‌కు తలమానికంగా నిలిచే ప్రజా రాజధాని. ఇదీ రెండేళ్ల క్రితం వరకూ అమరావతి గురించి రాష్ట్ర ప్రజలు కన్న కల! అది సాకారమవుతున్న దశలో రాజధాని పనులు అటకెక్కాయి! వేల కోట్ల రూపాయలతో చేపట్టిన పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రాజధాని నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నప్పుడు 15 వేల మంది కార్మికులతో, వాహనాల రాకపోకలతో, విద్యుద్దీపాల వెలుగుల్లో రేయింబవళ్లు కళకళలాడిన అమరావతిలో.. ఇప్పుడు ఎటు చూసినా నీరవ నిశ్శబ్దం. అమరావతిని కాపాడుకోవడానికి 600 రోజులుగా ఎండనక, వాననక.. ప్రభుత్వ నిర్బంధాల్నీ, ఆంక్షల్ని, ఖాకీ బూట్ల పదఘట్టనల్ని, లాఠీ ఛార్జీల్ని భరించి, సహించి, ఎదురొడ్డి పోరాడుతున్న రాజధాని గ్రామాల ప్రజలు, రైతులు, రైతులు కూలీల ఆక్రందనలు, ఉద్యమ నినాదాలు తప్ప అక్కడ ఎలాంటి శబ్దాలూ వినిపించడం లేదు.

రాజధానికి అవసరమైన భారీ భవనాల కోసం నిర్మించిన పునాదులు నెలల తరబడి నీళ్లలో నానుతూ తటాకాల్ని తలపిస్తున్నాయి. సగంలోనే పనులు ఆగిపోయి.. యుద్ధంలో క్షతగాత్రులైన సైనికుల్లా మిగిలిపోయిన బ్రిడ్జిలు.. ఇప్పటికే చాలావరకూ పూర్తయిన, వివిధ దశల్లో ఉన్న నివాస భవనాల ఆవరణల్లో అంతెత్తున పిచ్చిమొక్కలు.. నిలువెత్తు పెరిగిన తుమ్మచెట్ల మధ్య దీనంగా కనిపిస్తున్న రహదారులు.. భవనాల పునాదులు, బ్రిడ్జిలు, నివాస భవనాల నిర్మాణాల్ని నిలిపివేయడంతో ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ తుప్పు పడుతున్న ఇనుప చువ్వలు! చెదురుమదురుగా పడిన నిర్మాణ సామగ్రి, యంత్ర పరికరాలు.. దొంగల పాలవకుండా వాటికి కాపలా కాస్తూ బిక్కుబిక్కుమని కాలం గడుపుతున్న ఒకరో ఇద్దరో సెక్యూరిటీ గార్డులు..! ఇదీ ఇప్పుడు అమరావతి దీనస్థితి..!

అలుపెరగని పోరాటం

2019 డిసెంబరు 17న అసెంబ్లీలో ముఖ్యమంత్రి చేసిన మూడు రాజధానుల ప్రకటన శరాఘాతంగా తగలడంతో.. ఆ మర్నాటి నుంచే రాజధాని గ్రామాల్లో ఉద్ధృతంగా మొదలైన అమరావతి పరిరక్షణ ఉద్యమం ఆదివారంతో 600వ రోజుకు చేరుతోంది. మధ్యలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదురు నిలిచి, కరోనా మహమ్మారినీ తట్టుకుని, ఒక్కరోజు కూడా విరామం లేకుండా అమరావతి ప్రజలు ఉద్యమనినాదాన్ని వినిపిస్తూనే ఉన్నారు. ప్రతి దశలోనూ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన మహిళలు... ఇప్పటికీ అదే స్ఫూర్తితో పోరాడుతున్నారు.

అమరావతి దైన్యస్థితికి అద్దం పట్టే దృశ్యాలివి...

అవును.. ఇది ప్రయోగశాల!

రూ.254 కోట్ల అంచనా వ్యయంతో తలపెట్టిన ఫోరెన్సిక్‌ ప్రయోగశాల దుస్థితి ఇది. నిర్మాణం మధ్యలో నిలిచిపోవడంతో అసాంఘిక శక్తులకు నిలయంగా మారింది. దీని నిర్మాణంలో వాడిన ఊచల్ని దొంగలు కోసుకుని వెళ్లిపోయారు.

నీళ్లలోనే రూ.300 కోట్ల పునాదులు!

10 మీటర్ల లోతు తవ్వి, అక్కడి నుంచి నాలుగు మీటర్ల మందంతో ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ విధానంలో వేసిన... సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల పునాదులు ఇవి. ఐదు భవనాల పునాదులకు రూ.300 కోట్ల వరకు ఖర్చయింది. ఒక్కో టవర్‌ పునాదికి 1500 టన్నుల ఉక్కు, కొన్నివేల ఘనపు మీటర్ల కాంక్రీట్‌ వినియోగించారు. పనులు నిలిపివేయడంతో ఇవన్నీ తటాకాల్ని తలపిస్తున్నాయి. వీటికి సమీపంలోనే హైకోర్టు భవన నిర్మాణానికీ ర్యాఫ్ట్‌ పునాది వేశారు. రూ.30 కోట్ల వరకు ఖర్చయింది.

ప్రధాన మార్గం గేదెలకు ఆవాసం..!

రాజధాని అమరావతిలో కీలకమైన ప్రధాన అనుసంధాన రహదారి (సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు) ఇది. రూ.400 కోట్లకు పైగా అంచనా వ్యయంతో 8 వరుసలుగా దీన్ని నిర్మించారు. రాజధాని పనులు సగంలో నిలిచిపోవడంతో ఈ రహదారి పాక్షికంగానే వినియోగంలో ఉంది. దీన్ని ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలు... ఇలా గేదెల్ని కట్టేసుకోవడానికి వాడుకుంటున్నారు.

ఎటు చూసినా ఇలాంటి దృశ్యాలే..!

రెండు రోడ్లు కలిసే కూడలిలో.. కమ్యూనికేషన్‌, విద్యుత్‌ వంటి భూగర్భ కేబుళ్లను అనుసంధానించేందుకు ఇలాంటి జంక్షన్లు ఏర్పాటుచేశారు. పనులు ఆగిపోవడంతో దాని కోసం తవ్విన గోతుల్లో నీరు చేరి గేదెలకు ఆవాసంగా మారుతున్నాయి.

ఇవి కాలువలు కావు..!

ఇవన్నీ రోడ్లు వేయడానికి తవ్విన కందకాలు. మధ్యలో నానుతున్నవి డక్ట్‌ నిర్మాణానికి వేసిన ఊచలు. రహదారుల మధ్యలో భూగర్భంలో డక్ట్‌లు ఏర్పాటుచేసి... వాటిలోంచి విద్యుత్‌ సరఫరా లైన్లు పంపేలా కొన్ని రోడ్లను డిజైన్‌ చేశారు. ఆ డక్ట్‌ల నిర్మాణంలో వాడిన ఇనుము ఇలా నీటికి నానుతూ తుప్పు పడుతోంది.

మంత్రుల నివాస భవనాల నిర్మాణాల దుస్థితి ఇదీ..

తుప్పలతో నిండి ఉన్న ఇవన్నీ మంత్రులు, ఐఏఎస్‌ల కోసం తలపెట్టిన బంగ్లాలు. మంత్రులు, జడ్జిలు, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారుల కోసం మొత్తం రూ.526 కోట్ల వ్యయంతో 186 బంగ్లాల నిర్మాణం తలపెట్టారు. రూ.100 కోట్ల వరకు ఖర్చుచేశారు. నిర్మాణాలు వేర్వేరు దశల్లో ఉన్నాయి. సగటున 26.98% పనులు పూర్తయ్యాయి. ఆ దశలో వీటిని నిలిపేశారు.

దీనస్థితికి మౌన సాక్షులు..

300 ఎకరాల్లో తలపెట్టిన శాఖమూరు పార్కు ప్రాజెక్టులో భాగంగా నిర్మించాలనుకున్న శిల్పారామం కోసం సిద్ధం చేయించిన బొమ్మలివి. పనులు ఆగిపోవడంతో ఈ బొమ్మలు ఇలా మిగిలిపోయాయి.

తటాకాలు కావు... బ్రిడ్జిలు!

రహదారుల నిర్మాణం, ఇతర మౌలికవసతుల కల్పనలో భాగంగా 45 బ్రిడ్జిలు నిర్మించాలని తలపెట్టారు. 39 బ్రిడ్జిల నిర్మాణం మొదలైంది. సుమారు 76% పనులు పూర్తయ్యాయి. ఆ దశలో వీటిని ఇలా వదిలేయడంతో బ్రిడ్జిలు నీళ్లలో నానుతున్నాయి.

ఎక్కడి సామగ్రి అక్కడే..!

భారీ భవంతులు, రహదారుల నిర్మాణానికి తెచ్చిన సామగ్రి ఇలా ఎక్కడికక్కడ పడి ఉంది. ఈ ఫొటోలో కనిపిస్తున్నవి నిరుపయోగంగా పడి ఉన్న కాంక్రీట్‌ మిక్సర్లు.

ఇదీ చదవండి:

Amaravati Protest: అమరావతి పోరుకు 600 రోజులు.. ఏ రోజు ఏం జరిగిందంటే !

Last Updated :Aug 8, 2021, 4:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.