ETV Bharat / city

అమరావతి అసైన్డ్ భూముల కేసు.. మాజీ మంత్రి నారాయణకు ముందస్తు బెయిల్‌

author img

By

Published : Sep 14, 2022, 3:58 PM IST

Updated : Sep 14, 2022, 8:22 PM IST

Amaravati assigned land
Amaravati assigned land

15:56 September 14

నారాయణకు 3 నెలల ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిన హైకోర్టు

Anticipatory Bail For Ex Minister Narayana : అమరావతి అసైన్డ్ భూముల కేసులో మాజీ మంత్రి నారాయణకు.. హైకోర్టు 3 నెలల ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. నారాయణ ఆరోగ్య పరిస్థితి బాగోలేదని.. ముందస్తు బెయిల్​ మంజూరు చేయాలని అతడి తరఫు న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు కోర్టులో వాదనలు వినిపించారు. మిగతా నిందితులకు కింది కోర్టు రిమాండ్‌ తిరస్కరించినట్లు తెలిపారు. మరోవైపు ఈ కేసులో నారాయణ కీలక నిందితుడని ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదించారు. ఎస్సీ, ఎస్టీ కేసులో బెయిల్ ఇవ్వకూడదని వాదించగా.. మరో కేసులో నారాయణకు ముందస్తు బెయిల్ వచ్చిందని నారాయణ తరఫు న్యాయవాది పేర్కొన్నారు.

నేడు ముగ్గురు నిందితులు కోర్టులో హాజరు : రాజధాని ప్రాంతంలోని అసైన్డ్​ భూముల కొనుగోలు కేసులో ముగ్గురు నిందితులకు.. విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్​ను తిరస్కరించింది . 41ఏ సీఆర్పీసీ ప్రకారం నోటీసులు ఇవ్వాలని సీఐడిని ఆదేశించింది. అమరావతి ప్రాంతంలోని అసైన్డ్​ భూములు వ్యవహారంలో నిన్న ఐదుగురిని అరెస్టు చేసిన సీఐడీ అధికారులు నిన్న ఇద్దరిని కోర్టులో హాజరు పరచగా.. మిగిలిన ముగ్గురుని ఈరోజు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.

నిందితులపై నమోదు చేసిన సెక్షన్లు వర్తించవని ..41 ఏ సీఆర్పీసీ ప్రకారం నోటీసులు ఇచ్చే విధంగా ఆదేశించాలని న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ వాదించారు . ఈకేసులో మాజీమంత్రి నారాయణ నిందితులుగా ఉన్నారని .. కేసు చాలా తీవ్రమైనదని ..నిందితులకు రిమాండ్ విధించాలని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం రిమాండ్​ను తిరస్కరించి ..సీఆర్పీసీ 41 ఏ నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది.

అసలేం జరిగిందంటే: రాజధాని అమరావతి పరిధిలో ఎసైన్డ్‌ భూములను మాజీమంత్రి పొంగూరు నారాయణ తన బంధువులు, అనుచరులతో అక్రమంగా కొనిపించారన్న ఆరోపణలతో నమోదైన కేసులో సీఐడీ అధికారులు మంగళవారం అయిదుగుర్ని అరెస్టు చేశారు. రామకృష్ణ హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఉద్యోగులు కొల్లి శివరామ్‌, గట్టెం వెంకటేశ్‌తో పాటు విశాఖపట్నానికి చెందిన చిక్కాల విజయసారథి, బడే ఆంజనేయులు, కొట్టి కృష్ణ దొరబాబును అరెస్టు చేశారు. వీరిలో శివరామ్‌, వెంకటేశ్‌లను న్యాయస్థానంలో హాజరుపరిచారు. అయితే, వారిని జ్యుడిషియల్‌ రిమాండుకు ఇవ్వాలన్న సీఐడీ అభ్యర్థనను ప్రత్యేకకోర్టు న్యాయమూర్తి తిరస్కరించారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పెదపాలేనికి చెందిన యలమటి ప్రసాద్‌కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదుపై 2020లో నమోదైన కేసులో ఈ అరెస్టులు చేశారు.

మాజీ మంత్రి నారాయణ, ఆయన కుటుంబసభ్యులు.. రామకృష్ణ హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ కేవీపీ అంజనీకుమార్‌తో కలిసి ఈ కుట్రకు పాల్పడినట్లు తమ దర్యాప్తులో తేలిందని సీఐడీ తెలిపింది. భూ సమీకరణ పథకంలో భాగంగా ఎసైన్డ్‌ భూములకు ప్రభుత్వం పరిహారం చెల్లించదని, వాటిని ఎసైనీల నుంచి స్వాధీనం చేసుకుంటుందని ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులను మధ్యవర్తులు, స్థిరాస్తి వ్యాపార ఏజెంట్లతో బెదిరించి.. మాజీమంత్రి నారాయణ, ఆయన అనుచరులు నిర్ణయించిన ధరకే రైతులు అమ్ముకునేలా చేశారని తమ దర్యాప్తులో గుర్తించినట్లు తెలిపింది. రాజధానిలో 1,100 ఎకరాల ఎసైన్డ్‌ భూముల్లో అక్రమ లావాదేవీలు చోటుచేసుకున్నాయని పేర్కొంది. 169.27 ఎకరాల ఎసైన్డ్‌ భూములకు సంబంధించి నారాయణ, ఆయన కుటుంబసభ్యులు, రామకృష్ణ హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మధ్య రూ.15 కోట్ల ఆర్థిక లావాదేవీలు నడిచినట్లు తమ దర్యాప్తులో గుర్తించామని వివరించింది. ఈ సొమ్మును అమరావతిలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతుల నుంచి అతి తక్కువ ధరకు ఎసైన్డ్‌ భూములు కొనేందుకు వినియోగించినట్లు తేల్చామని చెప్పింది.

ఇవీ చదవండి:

ఎయిర్ ఇండియా ఫ్లైట్​లో మంటలు.. రన్​వేపై ఉండగా...

ఏడో అంతస్తు నుంచి పడిన లిఫ్ట్- 8 మంది కూలీలు దుర్మరణం

ధవళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ

Last Updated :Sep 14, 2022, 8:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.