ETV Bharat / city

Amaravati Protest: అమరావతి ఉద్యమానికి 800 రోజులు..

author img

By

Published : Feb 24, 2022, 5:08 AM IST

Updated : Feb 24, 2022, 9:51 AM IST

అమరావతి ఆశలు అడియాసలు కాకుండా.. రోడ్డెక్కి గళమెత్తారు..! అరెస్టులకు అదరకుండా.. సమరశంఖం పూరించి..ఉద్యమ పిడికిలి బిగించారు..! అడ్డంకులు, నేతల వ్యాఖ్యలు, అవమానాల్ని భరిస్తూనే.. సంకల్పాన్ని స్పష్టంగా చెప్పారు..! జోరుగా వర్షాలు కురుస్తున్నా.. పాదాలు కందిపోతున్నా.. అడుగులు ముందుకే పడ్డాయి. మీ వెనుక మేమూ ఉన్నామంటూ...ఆయా ప్రాంతాల్లో... ప్రజలూ వెంటనడిచారు..! ఇలా.. ఇవాళ్టితో 800వ రోజుకు చేరిన రాజధాని ఉద్యమంపై...ప్రత్యేక కథనం.

Amaravati Protest 800 days
Amaravati Protest 800 days

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో రైతులు ఉద్యమ బావుటా ఎగురవేసి.. ఇవాళ్టీతో 800వ రోజులైంది. రాజధాని కోసం.. ప్రాణ సమానమైన భూములను వారు ప్రభుత్వానికి అప్పగించారు. రైతుల ఆశలు, ఆకాంక్ష మేరకు.. గత ప్రభుత్వ హయాంలో పనులు సజావుగానే జరిగాయి. అయితే.. రెండున్నరేళ్ళుగా రైతుల కలలు కల్లలయ్యాయి. రాజధాని నిర్మాణాన్ని పక్కన పెట్టడం.. పైగా 3 రాజధానుల పేరుతో కొత్త ప్రతిపాదనలతో.. వారంతా రోడ్డెక్కారు. తమకు జరిగిన అన్యాయాన్ని వాడవాడలా తెలిసేలా నిరంతరం పోరాటం సాగిస్తున్నారు.

ప్రతీసారి విజయమే..

అమరావతి ఉద్యమంలో మహిళలదే ప్రధాన పాత్ర. వారికి రైతులు, యువకులు తోడయ్యారు. పాదయాత్రలు, ద్విచక్రవాహనాల ర్యాలీ, ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో ప్రదర్శనలతో పాటు.. రైతు గర్జన, జనభేరి కార్యక్రమాల్ని నిర్వహించారు. 100వ రోజు నుంచి 700వ రోజు వరకూ.. ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. వారి ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రభుత్వం చేయని ప్రయత్నమంటూ లేదు. ప్రతి సందర్భంలోనూ.. విజయం రైతన్నదే. ఇక న్యాయస్థానం నుంచి దేవస్థానం పాదయాత్ర విజయవంతం గురించి.. జనం ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు.

కేంద్రం చెబుతున్నా..

ఇన్నిరోజులూ భిన్నరూపాల్లో నిరసన తెలిపినా.. ప్రభుత్వ తీరులో మార్పు రావట్లేదని.. అమరావతి రైతులు అంటున్నారు. ఏపీ రాజధాని అమరావతేనంటూ కేంద్రమే చెబుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం భిన్నంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లుల్ని మళ్లీ తెస్తే.. తాడోపేడో తేల్చుకునేవరకూ విశ్రమించబోమని.. రైతులు తేల్చిచెప్పారు.

'అమరావతి ప్రజాదీక్ష' పేరుతో కార్యక్రమం

ఉద్యమం 800వ రోజుకు చేరిన సందర్భంగా రాజధాని రైతులు 'అమరావతి ప్రజాదీక్ష' పేరుతో దీక్ష చేపట్టారు. మార్చిలో ఉత్తరాంధ్ర నుంచి ఐకాసల ఏర్పాటు, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామని వారు చెప్పారు.

ఇదీ చదవండి:

Ukraine crisis: ఏపీ విద్యార్థులను తీసుకొచ్చేందుకు సాయం చేయండి: విదేశాంగ మంత్రికి జగన్‌ లేఖ

Last Updated :Feb 24, 2022, 9:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.