ETV Bharat / city

పోలీసు కష్టాలు ఎదురొడ్డి.. పొలిటికల్ కన్నీళ్లు దిగమింగి.. జై అమరావతి!

author img

By

Published : Dec 16, 2021, 9:26 PM IST

Updated : Dec 16, 2021, 11:07 PM IST

బంతిని గోడకేసి కొడితే అంతే బలంగా వెనక్కి వస్తుంది. కాలితో ఎంత గట్టిగా తొక్కిపెడితే అంతకు మించిన ఒత్తిడితో పైకి లేస్తుంది. అమరావతి రైతుల పాదయాత్రా అంతే.! నిబంధనలు, లాఠీఛార్జ్‌లు, బెదిరింపులు.. చివరకు కేసులు..! వీటన్నింటినీ మించి భోజనాలు, బస చేయడానికీ అడ్డంకులు..! ఐనా..అదరలేదు! బెదరలేదు! ఒక్క అడుగూ వెనక్కి వేయలేదు! గుడారాల్లోనే బసచేశారు. నడిరోడ్డుపైనే తిన్నారు.! నిఘాకళ్ల మధ్యే నడుచుకుంటూ గమ్యం చేరారు.

padayatra
padayatra

పోలీసు కష్టాలకు ఎదురొడ్డి.. పొలిటికల్ కన్నీళ్లు దిగిమింది.. జై అమరావతి!


తుళ్లూరు నుంచి తిరుపతి వరకూ అమరావతి రైతుల పాదయాత్ర ఆద్యంతం పోలీస్‌ ఆంక్షల మధ్యే సాగింది. పాదయాత్ర ఆలోచనను పురిట్లోనేనులిమేసే ప్రయత్నం జరిగింది. పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. 3రాజధానులు కోరుకునే వారు దాడి చేసే అవకాశం ఉందంటూ... ఐకాస నేతలకు డీజీపీ లేఖరాశారు. ఐకాస నేతలు ఎప్పటిలాగే... ధర్మదేవత తలుపు తట్టారు. కోర్టు అనుమతితోనే.. యాత్రకు జేగంట మోగించారు. అనుమతుల ఆంక్షలు ఛేదించి ముందడుగువేసిన రైతులకు.... ప్రజలు పూల బాటలు పరిచినా పోలీసులు అడుగడుగునా నిబంధనల పేరుతో అడ్డంకులు సృష్టించారు. 157మందికి మించి యాత్రలో పాల్గొనడానికి వీల్లేదనిఅభ్యంతరాలు తెలిపారు. దారివెంట నిఘా పెట్టారు. ప్రత్యేకంగా వీడియోగ్రాఫర్లను పెట్టి చిత్రీకరించారు. ప్రతీ సీఐ స్థాయి అధికారి బాడివోర్న్‌ కెమెరాలతో..... రికార్డ్ చేశారు. యాత్రకు ఏఏ రాజకీయ, ప్రజాసంఘాలు వస్తున్నాయో లెక్కలు రాసుకున్నారు. ట్రాఫిక్ మొదలుకుని ఎక్కడైనా నిబంధన ఉల్లంఘించకపోతారా అదుపులోకి తీసుకోకపోతామా అన్నట్లు వెంటాడారు. విద్యార్థులెవరైనా పాదయాత్రలోపాల్గొంటే యాజమాన్యాలకు విద్యాశాఖ ద్వారా నోటీసులిచ్చారు. వాహనాలను నో పార్కింగ్‌లో పెట్టారని జరిమానాలూ వేశారు. జనం మద్దతు పెరిగేకొద్దీ ఐకాస నేతలకు బెదిరింపులు ఎక్కువయ్యాయి. వాటిని సమయస్ఫూర్తితో ఎదుర్కొన్న ఐకాస నేతలు ప్రజల మద్దతును తామెలాకాదనగలం అంటూ సాగిపోయారు.
పాదయాత్రపై లాఠీచార్జ్..
నవంబర్ 6వ ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించాక పాదయాత్రపై... పోలీస్ నిఘా పెరిగింది. అనుమతించిన దానికంటే ఎక్కువగా వచ్చారని పర్చూరులో పాదయాత్ర కళాబృందాల వాహనాన్ని సీజ్ చేశారు. ఇదేమని ప్రశ్నిస్తే... ఫోటో తీస్తున్న కానిస్టేబుల్‌ను అడ్డుకున్నారంటూ ఒక కేసు, కోర్టు నిబంధనలు ఉల్లంఘించారంటూమరో కేసు పెట్టారు. రైతుల యాత్రలోకి బయటి జనం చొచ్చుకు వచ్చారంటూ నవంబర్ 11న చదలవాడ వద్ద ఏకంగా లాఠీచార్జ్ చేశారు. ఓ రైతు మోచేయి విరగ్గా తిరిగి పోలీసుల పైనే దాడి జరిగిందంటూ కేసు పెట్టారు. ఉద్యమం 700 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా కందుకూరు పోస్టాఫీస్ కూడలిలో.. మహిళలు ప్రదర్శన చేయాలనుకుంటే..పోలీసులు అనుమతించలేదు. తప్పెట్లు మోగించొద్దంటూ అడ్డుకున్నారు.

మొత్తం 40 కేసులు..
నెల్లూరు జిల్లాలో పోలీసుల ఆంక్షలకు అధికార పార్టీ ఒత్తిళ్లు....జతకలిశాయి. బయటివారు జిల్లాలోకి రావొద్దంటూ కావలి డీఎస్పీ ఆంక్షలు విధించారు. ప్రజలకు ట్రాఫిక్‌ కష్టాలు ఎదరువుతున్నాయంటూ పాదయాత్ర జిల్లాలోకి రాగానే అడ్డుకున్నారు. అక్కడి నుంచి అమరావతి రైతులపై కేసులపరంపరసాగింది. . పాదయాత్ర సాగిన మార్గంలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కేసులు పెట్టారు. మొత్తగా రైతులపైనగానీ, రాజకీయ నేతలపైనగానీ... పాదయాత్ర సందర్భంగా 40 కేసులునమోదైనట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో రాజకీయ సాధింపులూ రైతుల సహనాన్నిపరీక్షించాయి. మధ్యాహ్న భోజనాలకూ స్థలం లేకుండా చేశారు. మొదట ఇచ్చిన వారినీ బెదిరగొట్టారు. టెంటు కింద భోజనం చేయాల్సిన రైతులు దుమ్ముధూళిలో నడిరోడ్డుపైనే నాలుగు మెతుకులతో..సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

రాత్రి బసకు అనేక ఇబ్బందులు..
సర్వేపల్లి నియోజకవర్గంలో ఏకంగా రాత్రి బసకూ నిలువనీడలేకుండా అడ్డంకులు సృష్టించారు. అర్థరాత్రి రైతులు అప్పటికప్పుడు మంచాలు, వంటసామాగ్రి సర్దుకుని.. వెళ్లాల్సివచ్చింది. పాదయాత్రగా వెళ్లిన రైతులు మళ్లీ వెనక్కి రావాల్సి వచ్చింది. దాదాపు 30 కిలోమీటర్ల మేర వెనక్కి వెళ్లి.. మళ్లీ యాత్ర సాగించాల్సి వచ్చంది. అలా రెండ్రోజులు బసకు ఇబ్బందులు ఎదురయ్యాయి. చివరకు మొబైల్‌ టాయిలెట్స్‌ కూడా లేకుండా చేశారంటూ..మహిళలు కన్నీటిచారికలతోనేఅర్థరాత్రి రోడ్డుపై నిలబడ్డారు.

అన్నీ భరిస్తునే శ్రీవారి చెంతకు..
డిసెంబర్ 7న శ్రీకాళహస్తి మండలం ఎంపేడు వద్ద ఓ ప్రైవేటు స్థలంలో మధ్యాహ్న భోజనానికి రైతులు ఏర్పాట్లు చేసుకోగా అధికార పార్టీ సర్పంచ్ ట్రాక్టర్‌తో ఆ ప్రదేశాన్ని దున్నించడం పరాకాష్ట. యాత్ర కాళహస్తి చేరుకున్నాక... రాత్రి బస కోసం ఓ ఫంక్షన్ హాల్‌ 50వేలు అడ్వాన్స్ తీసుకుని మరీ యజమాని వెనక్కి తగ్గారు. అప్పటికప్పుడు ప్రైవేటు స్థలంలో టెంట్లు వేసుకుని రైతులు తలదాచుకున్నారు. జగ్గరాజుపల్లె వద్ద పోలీసులు అమరావతి రైతులను ఉద్దేశించి ఫ్లకార‌్డులు ప్రదర్శించారు. చివరకు... రైతుల అభ్యంతరాలతో విరమించుకున్నారు అలాంటి అసౌకర్యాల్ని లెక్కచేయకుండా సాగిన మహిళలకు.. యాత్రలో రక్షణగా నిలిచిన శివ అనే యువకుడిపై వెంకటగిరి సీఐ నాగమల్లేశ్వరరావు చేయిచేసుకోవడం... ఖాకీ క్రౌర్యానికి సాక్ష్యంగా నిలిచింది. వీటన్నింటినీ భరిస్తూనే రైతులు గోవిందుడి చెంతకు చేరారు. కష్ట సుఖాలను ఆ ఆపదమొక్కుల వాడికే చెప్పుకున్నారు.


ఇదీ చదవండి

amaravati padayatra: పాలకులు కక్షగట్టారు.. ప్రజలు అక్కున చేర్చుకున్నారు..!

Last Updated :Dec 16, 2021, 11:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.