PARISHAD COUNTING: రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

author img

By

Published : Sep 18, 2021, 7:29 PM IST

Parishad Election Results

రాష్ట్రంలోని జిల్లా, మండల పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 206 కేంద్రాల్లో పరిషత్ ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టనున్నారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఈ లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ లెక్కింపు ప్రక్రియ చేపట్టేందుకు ఏర్పాట్లు చేసినట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. మరోవైపు లెక్కింపు కేంద్రాలు, పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు.

హైకోర్టు ఆదేశాల అనంతరం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 206 కేంద్రాల్లో కౌంటింగ్ ప్రక్రియను చేపట్టనున్నారు. ఈ కేంద్రాల్లోని 958 హాళ్లలో కౌంటింగ్​కు ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు (ఆదివారం) ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.

ప్రత్యేక నిఘా..

కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు 13 జిల్లాల్లోనూ పరీశీలకులుగా ఐఎఎస్ అధికారులను రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియమించింది. కొవిడ్ నిబంధనల మేరకు కౌంటింగ్ నిర్వహణకు ఏర్పాట్లు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. దీనిపై అన్ని జిల్లాల కలెక్టర్లు,ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి తగిన ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడా వివాదాలకు తావులేకుండా చూసేందుకు గానూ 958 కౌంటింగ్ హాళ్లలోనూ సీసీటీవీ కెమెరా నిఘాను ఏర్పాటు చేశారు. ఇప్పటికే వివిధ జిల్లాల కలెక్టర్లు కౌంటింగ్ కేంద్రాల్లోని ఏర్పాట్లను పరిశీలించారు.

ఎంపీటీసీ స్థానాల లెక్కలు ఇలా..

మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 10,047 ఎంపీటీసీ స్థానాలకు గానూ వివిధ కారణాలతో 375 చోట్ల ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. నోటిఫికేషన్​లో తెలిపిన 9,672 స్థానాలకుగానూ 2,371 చోట్ల ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. దీంతోపాటు నామినేషన్ ప్రక్రియ అనంతరం పోటీకి నిలిచిన 81 మంది మృతి చెందడటంతో 7,220 చోట్ల మాత్రమే ఎన్నికలు జరిగాయి. మొత్తం 18,782 మంది అభ్యర్ధులు పోటీపడ్డారు.

జెడ్పీటీసీలు ఎన్నంటే..

ఇక రాష్ట్రవ్యాప్తంగా 660 జెడ్పీటీసీ స్థానాలకు గానూ 8 చోట్ల వివిధ కారణాల వల్ల ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. ఫలితంగా ఎస్ఈసీ 652 స్థానాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో 126 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఎన్నికల ప్రక్రియ జరుగుతుండగానే 11 మంది అభ్యర్ధులు మృతి చెందారు. దీంతో 515 చోట్ల మాత్రమే జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నిక జరిగింది. మొత్తం 2058 అభ్యర్థులు బరిలో నిలిచారు. మరోవైపు కౌంటింగ్ ప్రక్రియ అనంతరం 21, 22 తేదీల్లో జెడ్పీ, ఎంపీటీసీ చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్​ల ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసే అవకాశముంది.

  • ఆదివారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ
  • రాష్ట్రవ్యాప్తంగా 206 కేంద్రాల్లోని, 958 హాళ్లలో కౌంటింగ్​కు ఏర్పాట్లు
  • 13 జిల్లాల్లోనూ పరీశీలకులుగా ఐఎఎస్ అధికారులు
  • కౌంటింగ్ హాళ్లలోనూ సీసీటీవీ కెమెరా నిఘా, 144 సెక్షన్​
  • 10,047 ఎంపీటీసీ స్థానాలకుగానూ వివిధ కారణాలతో 375 చోట్ల ఎన్నికల ప్రక్రియ నిలిపివేత
  • 9,672 స్థానాలకుగానూ 2,371 చోట్ల ఏకగ్రీవం, 81 మంది మృతి
  • 7,220 చోట్ల మాత్రమే ఎన్నికలు
  • పోటీపడ్డ అభ్యర్థులు మొత్తం 18,782 మంది
  • 660 జెడ్పీటీసీ స్థానాలకుగానూ 8 చోట్ల నిలిచిన ఎన్నికలు
  • 652 స్థానాలకు నోటిఫికేషన్.. 126 స్థానాలు ఏకగ్రీవం, 11 మంది అభ్యర్ధులు మృతి
  • 515 చోట్ల మాత్రమే జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నిక
  • పోటీలో 2058 అభ్యర్థులు

ఇదీ చదవండి

సీఎం పదవికి కెప్టెన్ అమరీందర్​ సింగ్​​ రాజీనామా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.