ETV Bharat / city

KRMB, GRMB: ప్రాజెక్టుల స్వాధీనం సాధ్యమేనా? తెలుగు రాష్ట్రాలు అంగీకరించేనా?

author img

By

Published : Oct 10, 2021, 8:18 AM IST

KRMB, GRMB
KRMB, GRMB

కృష్ణా, గోదావరి బోర్డుల (KRMB, GRMB)పరిధిపై కేంద్రం ఇచ్చిన గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలుకు కసరత్తు జరుగుతోంది. గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలుపై రెండు బోర్డులు నియమించిన ఉపసంఘాలు.. తయారు చేసిన ముసాయిదాపై ఇవాళ చర్చించనున్నారు. తుది నివేదికను 12వ తేదీన జరిగే బోర్డు సమావేశం ముందు పెట్టనున్నారు. మొదటి దశలో అయిదు ప్రాజెక్టుల పరిధిలోని 29 కేంద్రాలను బోర్డు పరిధిలోకి తీసుకోనుంది. ఇవాళ జరిగే సమావేశంలో రెండు రాష్ట్రాలు దీనికి ఏమేరకు సమ్మతి తెలుపుతాయన్నది ప్రశ్నార్థకంగా ఉంది.

కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై కేంద్రం ఇచ్చిన గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలు దిశగా.. పూర్వ రంగం సిద్ధమవుతోంది. మొదటి దశలో అయిదు ప్రాజెక్టుల పరిధిలోని 29 కేంద్రాలను బోర్డు పరిధిలోకి తీసుకోవడానికి అవకాశం ఉన్నట్లు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం గుర్తించింది. మిగిలిన చోట్ల రెండు రాష్ట్రాలకు కొన్ని అభ్యంతరాలుండటం వల్ల ప్రస్తుతానికి వీలు కాదని పేర్కొంది. ప్రాజెక్టుల వారీగా సిబ్బంది, కార్యాలయాలు, యంత్రాలు, పరికరాలు ఇలా అన్ని అంశాలపై సమగ్ర ముసాయిదా తయారు చేసింది. ఆదివారం జరిగే సమావేశంలో తుది నివేదికను ఖరారు చేయనుంది.

ఏ మేరకు సమ్మతి తెలుపుతారో..?
కృష్ణా, గోదావరి బోర్డులకు సంబంధించి కేంద్రం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలుపై రెండు బోర్డులూ రెండు ఉపసంఘాలను నియమించాయి. ఇందులో కృష్ణాబేసిన్‌ కీలకమైంది. ఈ కమిటీలో రెండు రాష్ట్రాల నుంచి నీటిపారుదల, జెన్‌కోలకు చెందిన నలుగురు చీఫ్‌ ఇంజినీర్లతో పాటు, కృష్ణా బోర్డు నుంచి అయిదుగురు ఉన్నారు. బోర్డుకు చెందిన రవికుమార్‌ పిళ్లై ఈ ఉపసంఘానికి కన్వీనర్‌గా ఉన్నారు. ఈ కమిటీ తయారు చేసిన ముసాయిదాపై ఆదివారం చర్చించి, తుది నివేదికను 12వ తేదీన జరిగే బోర్డు సమావేశం ముందు పెట్టనున్నారు. ఆదివారం జరిగే సమావేశంలో రెండు రాష్ట్రాలు దీనికి ఏమేరకు సమ్మతి తెలుపుతాయన్నది ప్రశ్నార్థకంగా ఉంది. ఈ నెల 14 నుంచి గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలులోకి రానున్న నేపథ్యంలో ఉపసంఘం ముసాయిదా ప్రాధాన్యం సంతరించుకొంది.

ముఖ్యాంశాలు ఇవీ..


‘‘కృష్ణా బేసిన్‌లో 12 ప్రాజెక్టులు, వాటికి అనుబంధంగా ఉన్న వాటి నుంచి 65 కేంద్రాలను గెజిట్‌ నోటిఫికేషన్‌లోని రెండో షెడ్యూలులో చేర్చారు. ఇవన్నీ బోర్డు నిర్వహణలో ఉంటాయి. అయితే.. ఇందులో రెండు అసలు లేకపోగా, రెండు పునరుక్తి అయ్యాయి. ఒకటి కర్ణాటకలో ఉంది. మిగిలిన 60లోనూ 50 మాత్రమే నిర్వహణలో ఉన్నాయి. ఇందులో 21 ఆంధ్రప్రదేశ్‌లో ఉండగా.. 22 తెలంగాణలో ఉన్నాయి. ఏడు మాత్రమే ఉమ్మడిగా ఉన్నాయి. నోటిఫికేషన్‌ ప్రకారం ఈ 50 కేంద్రాలను బోర్డుకు స్వాధీనం చేయాల్సి ఉంది. అయితే.. కొన్నింటిపై రెండు రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖకు లేఖలు రాశాయి. ఇవి పోనూ.. 29 కేంద్రాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. వీటిని మొదటి దశలో ప్రాధాన్యంగా భావించి స్వాధీనం చేసుకోవచ్చు. మిగిలినవి తర్వాత దశలో తీసుకోవచ్చు’’ అని ఉపసంఘం పేర్కొంది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి తుంగభద్ర బోర్డు పద్ధతినే ఇక్కడ అమలు చేయాలని సూచించింది. రెండు రాష్ట్రాలు సీడ్‌ మనీని ఈ నెల 14వ తేదీకల్లా బోర్డుకు జమ చేయాలని కూడా ముసాయిదా పేర్కొంది. మొదటి దశలో బోర్డు నిర్వహణలోకి తీసుకోవాలని సూచించినవాటిలో శ్రీశైలం కింద ఏడు ఉన్నాయి. అయిదు ఆంధ్రప్రదేశ్‌, రెండు తెలంగాణ చేతిలో ఉన్నాయి.

అభ్యంతరాలున్నవి ఇవే..
నిర్వహణలో ఉన్న, ఇంకా నిర్వహణలోకి రాని పలు ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి అవసరం లేదని రెండు రాష్ట్రాలు పేర్కొన్నట్లు ఉపసంఘం నివేదిక వెల్లడించింది. ఇందులో జూరాల, నెట్టెంపాడు, భీమా సహా దేనినీ తీసుకోవాల్సిన అవసరం లేదని తెలంగాణ పేర్కొంది. వీటితో పాటు ఎస్‌.ఎల్‌.బి.సి, పాలమూరు-రంగారెడ్డి, డిండి, హైదరాబాద్‌ తాగునీటి సరఫరా, భక్తరామదాసు, పాలేరు రిజర్వాయర్‌, గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తీసుకొనే ఆరు పాయింట్లపై కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. నోటిఫికేషన్‌ అమలును వాయిదా వేయాలని కోరుతున్న తెలంగాణ.. శ్రీశైలం ఎడమ విద్యుత్తు కేంద్రం, నాగార్జునసాగర్‌ హెడ్‌వర్క్స్‌, ప్రధాన విద్యుత్తు కేంద్రానికి అంగీకరించే అవకాశం తక్కువేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

బనకచెర్ల రెగ్యులేటర్‌, నిప్పులవాగు, ఎస్సార్బీసీ-అవుకు, వెలిగోడు, తెలుగుగంగ లింకు కాలువ, వెలిగొండ అవసరం లేదని ఆంధ్రప్రదేశ్‌ పేర్కొంది. గాలేరు-నగరి, తుంగభద్ర ఎల్లెల్సీ, హెచ్చెల్సీ, మునియేరు నీటిమళ్లింపు, గోదావరి నుంచి ప్రకాశం బ్యారేజికి నీటిని మళ్లించే పథకం, కృష్ణాడెల్టా, గుంటూరు ఛానల్‌ అవసరం లేదని తెలిపిందని ముసాయిదా నివేదికలో ఉపసంఘం పేర్కొంది.

29 కేంద్రాలు ఏవంటే..

> తెలంగాణలో

  • ఎడమ గట్టు విద్యుత్తు కేంద్రం
  • కల్వకుర్తి ఎత్తిపోతల మొదటి పంపుహౌస్‌
  • నాగార్జునసాగర్‌ కింద అత్యధికంగా 15 పాయింట్లున్నాయి. హెడ్‌వర్క్స్‌, కుడి, ఎడమ కాలువలతోపాటు, ప్రధాన విద్యుత్తు హౌస్‌, ఎడమ కాలువ కింద అనేక పాయింట్లు ఉన్నాయి. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు(ఎ.ఎం.ఆర్‌.పి) లిప్టును కూడా మొదటి దశలో చేర్చారు.
  • నాగార్జునసాగర్‌ టెయిల్‌ పాండ్‌ కింద హెడ్‌వర్క్స్‌, విద్యుత్తు బ్లాక్‌
  • పులిచింతల కింద హెడ్‌వర్క్స్‌, విద్యుత్తు బ్లాక్‌
  • కేసీకాలువ కింద సుంకేశుల
  • ఆర్డీఎస్‌ కింద క్రాస్‌ రెగ్యులేటర్‌
  • తుమ్మిళ్ల ఎత్తిపోతల

> ఆంధ్రప్రదేశ్​లో

  • శ్రీశైలం స్పిల్‌వే
  • కుడి గట్టు విద్యుత్తు కేంద్రం
  • పోతిరెడ్డిపాడు
  • హంద్రీనీవా ఎత్తిపోతలకు నీటిని తీసుకొనే పంపుహౌస్‌
  • ముచ్చుమర్రి పంపుహౌస్‌

ఇదీ చదవండి :

Water boards: ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణపై నేటినుంచే కీలక సమావేశాలు.. ఏం జరగనుంది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.