ETV Bharat / city

ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో 12 మంది అరెస్టు

author img

By

Published : Jul 7, 2020, 8:43 PM IST

Updated : Jul 8, 2020, 4:23 AM IST

LG polymers gas leakage incident
LG polymers gas leakage incident

20:42 July 07

ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో 12 మంది అరెస్టు

ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో 12 మంది అరెస్టు

విశాఖ ఎల్​జీ పాలిమర్స్‌లో స్టైరిన్‌ గ్యాస్ లీకై 15 మంది మృతికి కారణమయ్యారంటూ...12మందిని విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. ఎల్‌జీ పాలిమర్స్ సీఈవో, ఇద్దరు డైరెక్టర్లు సహా 12మంది అరెస్టైన వారిలో ఉన్నారు. విశాఖలో మే 7న ఎల్​జీ పాలిమర్స్‌లో స్టైరిన్‌ గ్యాస్​ లీకైంది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందగా, 500 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. ఈ ప్రమాదంపై నమోదైన కేసు దర్యాప్తుతోపాటు.. హైపవర్‌ కమిటీ నివేదిక ఆధారంగా రెండు నెలల తర్వాత అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో ఎల్​జీ పాలిమర్స్‌ ఎండీ, సీఈవో సుంకీ జియోంగ్, టెక్నికల్ డైరక్టర్ డీఎస్ కిమ్ ఉన్నారు.  

స్టైరిన్ లీక్ ఘటనపై హైపవర్ కమిటీ సీఎంకు నివేదిక సమర్పించిన ఒకరోజు తర్వాత..అరెస్టు చేశారు. ఎల్జీలో అనేక లోపాలు, భద్రతా పరమైన విషయాలపై నిర్వహణ లేకపోవడం వల్లే ఘోర విషాదానికి దారితీసిందని విశాఖ సీపీ ఆర్​కే మీనా తెలిపారు. ప్లాంట్లో అత్యవసర ప్రతిస్పందన విధానం మొత్తం విచ్ఛిన్నమైందని చెప్పారు.

ఎల్​జీ​ పాలిమర్స్‌ ఘటనలో ప్రభుత్వ అధికారుల తీరును ఉన్నతస్థాయి కమిటీ తప్పుబట్టింది. వారిపై చర్యలకు సిఫార్సు చేయడంతో..ముగ్గురు అధికారులను ప్రభుత్వం  సస్పెండ్ చేసింది. డిప్యూటీ చీఫ్ ఇన్స్​స్పెక్టర్ కేబీఎన్​ ప్రసాద్, కాలుష్య నియంత్రణ మండలి ఇంజినీర్లు ఇద్దరిపై వేటు వేసింది.

అరెస్టైన వారి వివరాలు:

  • సుంకీ జియోంగ్, మేనిజింగ్ డైరెక్టర్, సీఈఓ
  • డీఎస్ కిమ్, టెక్నికల్ డైకెర్టర్
  • పిచ్చుక పూర్ణ చంద్ర మోహన్ రావ్, అడిషనల్ డైరెక్టర్ (ఆపరేషన్స్ విభాగం)
  • కోడి శ్రీనివాస్ కిరణ్ కుమార్, హెచ్ఓడీ, ఎస్ఎంహెచ్ ఇంఛార్జీ
  • రాజు సత్యనారాయణ, ప్రొడక్షన్ టీమ్ లీడర్
  • చెడుముపాటి చంద్రశేఖర్, ఇంజినీర్
  • కసిరెడ్ల గౌరీ శంకర నాగేంద్ర రాము, ఇంజినీర్
  • ముద్దు రాజేష్, ఆపరేటర్
  • పొట్నూరు బాలాజీ, నైట్ డ్యూటీ ఆఫీసర్ (ఆపరేషన్స్ విభాగం)
  • శిలపరశెట్టి అచ్యుత్, జీపీపీఎస్ ఇంఛార్జీ
  • కె. చక్రపాణి, ఇంజినీర్
  • కొండవలస వెంకట నరసింహ రమేశ్ పట్నాయక్, నైట్ షిఫ్ట్ సేఫ్టీ ఇంజినీర్

ఎల్‌జీ పాలిమర్స్‌ కేసులో అరెస్టయిన 12 మందిని కేజీహెచ్‌కు తరలించి, వైద్య పరీక్షలు నిర్వహించారు. 

కమిటీ ఏం చెప్పిందంటే...?

విశాఖ గ్యాస్‌ లీక్‌ విషాదం వెనుక అడుగడుగునా... ఎల్జీ పాలిమర్స్‌ సంస్థ నిర్లక్ష్యం ఉందని హై పవర్‌ కమిటీ తేల్చింది. దుర్ఘటనపై సమగ్ర దర్యాప్తునకు నీరబ్‌ కుమార్ అధ్యక్షతన ప్రభుత్వం నియమించిన 9 మంది సభ్యుల హైపవర్ కమిటీ.... ఈ మేరకు సీఎం జగన్‌కు నివేదిక సమర్పించింది. ప్రమాదానికి సంబంధించిన ప్రతి సాంకేతిక అంశాన్నీ పరిశీలించిన కమిటీ... ఆయా వివరాలన్నింటినీ క్రోడీకరించి 350 పేజీలతో ప్రధాన నివేదిక రూపొందించింది. పలు ప్రశ్నలకు పరిశ్రమ యాజమాన్యం నుంచి సమాధానాలు రాబట్టింది. పర్యావరణవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించింది.

గ్యాస్‌ లీక్‌ దుర్ఘటనకు ప్రధానంగా 3 కారణాలను కమిటీ పేర్కొంది. మరమ్మతులను అస్తవ్యస్తంగా నిర్వహించడం, ప్రమాద సంకేతాలు వెలువడినా పట్టించుకోకపోవడం, లాక్‌డౌన్‌లోనూ అప్రమత్తత కొరవడటాన్ని గుర్తించినట్లు తెలిపింది.

ఘటన తర్వాత అత్యవసర చర్యల్లోనూ సంస్థ వైఫల్యం ప్రమాద తీవ్రతను పెంచాయని హైపవర్‌ కమిటీ అభిప్రాయపడింది. 36 సైరన్​లు ఉన్నా ఒక్కటీ పని చేయకపోవడం వల్ల పరిసర ప్రాంతాల వారు తప్పించుకొనే అవకాశం లేకుండా పోయిందని వెల్లడించింది. సంస్థ సిబ్బందిలోనూ అవగాహన లోపించినట్లు గుర్తించింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాల నివారణకు ప్రతి రాష్ట్రమూ, కేంద్రంలో ఫ్యాక్టరీ సేఫ్టీ బోర్డుల ఏర్పాటుకు హై పవర్‌ కమిటీ సిఫార్సు చేసింది. వివిధ మంత్రిత్వ శాఖల పరిధిలోని ప్రతి పరిశ్రమా వాటి కిందకు వచ్చేలా చర్యలు చేపట్టాలని సూచించింది.

ఇదీ చదవండి  : గ్యాస్ లీకేజీ ఘటనలపై ఎన్జీటీ కమిటీలు ...మూడు నెలల్లో నివేదిక


 

Last Updated :Jul 8, 2020, 4:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.