ETV Bharat / business

మార్కెట్లు క్రాష్: ఆ ఒక్కటి చూసి షేర్లు కొనొద్దు.. ఈ జాగ్రత్తలు మస్ట్!

author img

By

Published : Jul 3, 2022, 7:40 AM IST

stock market losses: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ ఏడాది భారీగా నష్టాలను చవిచూశాయి. రష్యా- ఉక్రెయిన్​ యుద్ధం, అధిక చమురు ధరలు, విదేశీ మదుపర్లు భారీగా పెట్టుబడులు ఉపసంహరించుకోవడం వల్ల కొన్ని నెలలుగా దేశీయ స్టాక్ మార్కెట్లలో దిద్దుబాటు కొనసాగుతోంది. దేశంలోని దిగ్గజ కంపెనీల సమూహ సూచీ బీఎస్‌ఈ 500 కూడా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 11 శాతం నష్టపోయింది. ఇందులో 85 శాతానికి పైగా షేర్లు ప్రస్తుతం 200 రోజుల చలన సగటు (డీఎంఏ) దిగువన ట్రేడవుతున్నాయి. చౌక ధరకు షేర్లు లభ్యమవుతున్నాయని మదుపర్లు షేర్లు కొనుగోళ్లు చేస్తారు. అయితే, ఈ సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం..

STOCK PURCHASES
స్టాక్ మార్కెట్లు

stock market losses: రష్యా- ఉక్రెయిన్‌ పరిణామాలు, అధిక చమురు, కమొడిటీల ధరలు, విదేశీ మదుపర్లు భారీగా పెట్టుబడుల ఉపసంహరణ ప్రభావంతో కొన్ని నెలలుగా దేశీయ స్టాక్‌ మార్కెట్లలో దిద్దుబాటు కొనసాగుతోంది. సెన్సెక్స్‌, నిఫ్టీలు ఈ ఏడాదిలో ఇప్పటికే 10 శాతం మేర నష్టపోయాయి. గతేడాది అక్టోబరులో జీవనకాల గరిష్ఠ స్థాయిలను తాకిన ఈ సూచీలు.. అక్కడి నుంచి 15% మేర పతనమవ్వడం గమనార్హం. దేశంలోని దిగ్గజ కంపెనీల సమూహ సూచీ బీఎస్‌ఈ 500 కూడా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 11 శాతం నష్టపోయింది. ఇందులో 85 శాతానికి పైగా షేర్లు ప్రస్తుతం 200 రోజుల చలన సగటు (డీఎంఏ) దిగువన ట్రేడవుతున్నాయట. 200 డీఎంఏ దిగువకు రావడమంటే.. చౌక లేదంటే ఆకర్షణీయ ధరలకు షేర్లు లభ్యమవుతున్నాయనే భావన కొందరి మదుపర్లలో ఉంటుంది. ఇప్పటికే బాగా పడిపోయినందున మున్ముందు మరింత పెరుగుతుందని అనుకుంటుంటారు. కొన్ని బ్రోకరేజీ సంస్థలు కూడా ఈ తరహా షేర్లను సిఫారసు చేస్తుండటంతో వాళ్లూ కొనుగోళ్లకు మొగ్గుచూపుతారు.

అయితే ఇలా చేయడం సరైనదేనా?: 200 డీఎంఏ దిగువకు వచ్చిన షేర్లను కొంటే నిజంగా లాభదాయకమేనా? 200 డీఎంఏ దేనికి సంకేతం.. ఫలానా షేరు లేదా సూచీ సమీపకాలంలో ఎలా కదలాడుతుందనే విషయాన్ని గుర్తించేందుకు పలు రకాల ఇండికేటర్‌లపై మదుపర్లు లేదా స్టాక్‌ మార్కెట్‌ నిపుణులు ఆధారపడుతుంటారు. వీటిని ఆయా షేర్లు లేదా సూచీల చార్టుల్లో ఏర్పాటు చేసుకుంటారు. 200 డీఎంఏ రేఖ కూడా ఈ ఇండికేటర్‌ల్లో ఒకటి. గత 200 రోజులు లేదా 40 వారాల్లో ఆయా షేరు సగటు ధరను ఇది సూచిస్తుంది. ‘200 డీఎంఏ రేఖ పైన షేరు కదలాడుతుంటే.. ఆ షేరు సానుకూలంగా కదలాడొచ్చని భావిస్తుంటారు. ఈ రేఖ ఆ షేరుకు మద్దతు స్థాయిగా పనిచేస్తుండటమే ఇందుకు కారణం. ఒకవేళ 200 డీఎంఏ కంటే దిగువన కదలాడితే.. ఆ రేఖను నిరోధ స్థాయిగా భావించి, షేరుకు ప్రతికూల ధోరణి కొనసాగుతుందని భావిస్తార’ని గ్రీన్‌ పోర్ట్‌ఫోలియో వ్యవస్థాపకుడు దివమ్‌ శర్మ వివరించారు. 200 డీఎంఏ ఎగువన కదలాడే షేర్లతో పోలిస్తే 200 డీఎంఏ దిగువన కదలాడే షేర్ల సంఖ్య ఎక్కువగా ఉంటే.. అది మార్కెట్లో నిస్తేజానికి, ప్రతికూల భావనకు సంకేతమని ఆయన చెప్పుకొచ్చారు.

ఒక్కదానిపై ఆధారపడొద్దు..: 'స్టాక్‌ మార్కెట్‌ కదలికలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరూ ఊహించలేం. అలాంటిది ఒక్క సంకేతం (ఇండికేటర్‌) ఆధారంగా షేర్లను కొనుగోలు చేయడం, విక్రయించడం సరికాదు. సాంకేతిక అంశాలపరంగా ఎన్ని సానుకూలతలు ఉన్నా ఒక్క ప్రతికూల పరిణామం మార్కెట్‌ గతిని మార్చేస్తుంది. అందుకే ఎల్లప్పుడూ అప్రమత్తత అవసరం' అనే అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. 200 డీఎంఏ విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. దీని ఒక్కదానిపై ఆధారపడకుండా.. మరికొన్ని ఇండికేటర్‌లు ఇచ్చే సంకేతాలను, దేశీయ అంతర్జాతీయ పరిణామాలను పరిగణనలోకి తీసుకునే షేర్ల కొనుగోలుకు మొగ్గు చూపాలని షేర్‌ఖాన్‌లో పరిశోధనా విభాగం హెడ్‌గా ఉన్న గౌరవ్‌ రత్నపార్ఖి సూచిస్తున్నారు. సూచీలు, షేర్ల కదలికలను గుర్తించడంలో 200 డీఎంఏకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వనవసరం లేదని, అది కేవలం ఒక అంకె అనే విషయాన్ని గుర్తించుకోవాలని హెడోనోవాకు చెందిన ఓ విశ్లేషకుడు అంటున్నారు.

మదుపర్లు ఏం చేయాలి?: ప్రస్తుతం బీఎస్‌ఈ 500లో 85 శాతానికి పైగా షేర్లు 200 డీఎంఏ దిగువన కదలాడుతున్నాయని అంచనా. అయితే ఈ షేర్లు అన్ని కూడా ఇక్కడి నుంచి పెరుగుతాయని అనుకోవడానికి వీల్లేదని విశ్లేషకులు చెబుతున్నారు. మరికొంత కాలం పాటు కూడా 200 డీఎంఏ దిగువనే ఆ షేర్లు కొనసాగే అవకాశాలూ ఉంటాయని.. ఎంత కాలమనేది ఆయా కంపెనీల మూలాలు, దేశీయ-అంతర్జాతీయ పరిణామాలు, మార్కెట్‌ గమనంపై ఆధారపడుతుందని విశ్లేషిస్తున్నారు. అందువల్ల ఒకవైపు చార్ట్‌ల్లోని ఇండికేటర్‌లను గమనిస్తూనే.. కంపెనీ అనుసరిస్తున్న వ్యాపార విధానాలు, వ్యూహాలపైనా మదుపర్లు దృష్టి సారించాలని సూచిస్తున్నారు. ఏదేని కంపెనీ లేదా ఫలానా వ్యాపారానికి భవిష్యత్‌లో మరిన్ని వృద్ధి అవకాశాలున్నాయని భావిస్తే 200 డీఎంఏ ఇండికేటర్‌తో సంబంధం లేకుండా ఆ కంపెనీ షేర్లలో పెట్టుబడులు పెట్టడం మంచిదేనని సలహా ఇస్తున్నారు. అలాగే ప్రస్తుత వడ్డీ రేట్లు, అధిక ద్రవ్యోల్బణం ప్రభావం ఆయా కంపెనీలపై ఎలా ఉంటుందో కూడా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నారు.

ఇవీ చదవండి: కుబేరులను పెద్దదెబ్బ తీసిన 2022.. కోట్లకు కోట్లు లాస్​!

ప్రతి ఇంటా.. ధరల మంట.. అతిపెద్ద సమస్యగా 'ద్రవ్యోల్బణం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.