ETV Bharat / bharat

గుజరాత్​లో 'భాజపా' ప్రభంజనం.. హిమాచల్​లో 'హస్తం పార్టీ'దే పీఠం

author img

By

Published : Dec 8, 2022, 7:26 AM IST

Updated : Dec 8, 2022, 6:57 PM IST

gujarat election result 2022
gujarat election result 2022

18:56 December 08

గుజరాత్​లో కమలం పార్టీ ఘన విజయం అనంతరం.. ప్రధాని మోదీ దిల్లీలో భాజపా ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. ఆయన వెంట ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఉన్నారు. పార్టీ శ్రేణులకు అభివాదం చేస్తూ మోదీ.. కార్యాలయానికి చేరుకున్నారు. ఆ వెంటనే మోదీని గజమాలతో కార్యకర్తలు సత్కరించారు.

17:57 December 08

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా రికార్డు విజయం సాధించింది. వరుసగా ఏడోసారి విజయం సాధించి 37 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టింది. మొత్తం 182 స్థానాలకు 156 స్థానాల్లో గెలుపొంది సరికొత్త చరిత్రను లిఖించింది. 1995లో 121, 1998లో 117, 2002లో 127 స్థానాలు, 2007లో 117, 2012లో 115, 2017లో 99 స్థానాల్లో విజయం సాధించింది. 2002లో అత్యధిక స్థానాల్లో (127) విజయం సాధించగా.. తాజాగా ఆ రికార్డును బ్రేక్‌ చేసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 17, ఆప్‌ 5, ఇతరులు 4 స్థానాలను దక్కించుకున్నారు.

17:15 December 08

హిమాచల్​ప్రదేశ్​లో ఎన్నికల కౌంటింగ్​ పూర్తయింది. మొత్తం 68 స్థానాలకు గాను.. కాంగ్రెస్​ పార్టీ 40 సీట్లను గెలుచుకుని అధికారం కైవసం చేసుకుంది. గుజరాత్​లో ఘన విజయం సాధించిన భాజపా.. హిమాచల్​లో​ మాత్రం 25 సీట్లకే పరిమితమైంది. ఆమ్​ఆద్మీ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. కాగా, ముగ్గురు స్వతంత్రులు శాసనసభకు ఎన్నికయ్యారు.
అయితే ఇప్పుడు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి ఎవరికి వరిస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీఎం రేసులో ప్రతిభా సింగ్​, సుఖ్వీందర్​ సింగ్​ వంటి నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్​ తన పదవికి రాజీనామా చేశారు.

17:05 December 08

గుజరాత్​లో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ కమలం పార్టీ అధికారాన్ని కైవసం చేసుకున్న నేపథ్యంలో ప్రధాని మోదీ స్పందించారు. తమ కంచుకోటలో వరుసగా ఏడోసారి విజయం సాధించినందుకు పార్టీ కార్యకర్తలకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. "మా పార్టీకి నిజమైన బలం కార్యకర్తలే.. వారి అసాధారమైన కృషి లేకుండా ఈ చరిత్రాత్మక విజయం ఎప్పటికీ సాధ్యం కాదు" అంటూ ట్వీట్​ చేశారు.

16:45 December 08

ఆమ్​ఆద్మీ పార్టీకి జాతీయ హోదా దక్కింది. ఈ మేరకు ఆ పార్టీ కన్వీనర్​ అరవింద్​ కేజ్రీవాల్​ ప్రకటించారు. యంగస్ట్​ నేషనల్​ పార్టీ తమదేనని ఆయన తెలిపారు. "ఈరోజు ఆప్​ జాతీయ పార్టీగా అవతరించింది. 10 ఏళ్ల క్రితం ఆప్​ ఓ చిన్న పార్టీ. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తోంది" అని కేజ్రీవాల్​ చెప్పారు.

ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు సాధించాలంటే.. సాధారణ ఎన్నికల్లో కనీసం 4 రాష్ట్రాల్లో పోలైన ఓట్లలో 6% చొప్పున పొందిన ఓట్లు లేదా ఏవైనా 4 రాష్ట్రాల నుంచి 11 లోక్‌సభ సీట్లు సాధించాలి. ప్రస్తుతం ఆప్‌.. దిల్లీ, పంజాబ్‌లో అధికారంలో ఉండగా.. ఈ ఏడాది జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాలు, 6శాతం ఓటు షేరు దక్కించుకుంది. ఇప్పుడు గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 4 స్థానాల్లో గెలవగా.. మరో స్థానంలో ఆధిక్యంలో ఉంది. దీంతో జాతీయ పార్టీగా అవతరించేందుకు అర్హత పొందింది.

16:31 December 08

హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను ఆ పార్టీ వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సీఎం జైరాం ఠాకూర్.. రాజీనామా చేయనున్నారు. గవర్నర్‌కు రాజీనామా పత్రాన్ని సమర్పించేందుకు సిమ్లాలోని రాజ్‌భవన్‌కు ఆయన చేరుకున్నారు.

15:46 December 08

గుజరాత్​ ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ ఘోర పరాజయం పాలైంది. దీంతో ఆ పార్టీ రాష్ట్ర ఇన్​ఛార్జ్ రఘ శర్మ తన పదవికి రాజీనామా చేశారు.

14:37 December 08

మేజిక్​ ఫిగర్​ దాటేసిన కాంగ్రెస్​.. హిమాచల్​లో హస్తం పార్టీదే పీఠం

ఐదేళ్ల కోసారి అధికారం మార్చే ఆచారం హిమాచల్​ ప్రదేశ్​లో ఈసారీ కొనసాగింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కమలం పార్టీ ఓటమిని చవిచూసింది. కాంగ్రెస్​ పార్టీ జాక్​పాట్​ కొట్టేసింది. మేజిక్​ ఫిగర్​ దాటి 36 సీట్లలో విజయం సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు 35 సీట్లు అవసరం కాగా.. కాంగ్రెస్ సునాయాసంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది.

13:31 December 08

మేజిక్ ఫిగర్ దాటిన భాజపా.. వరుసగా ఏడోసారి ఘన విజయం

గుజరాత్​లో వరుసగా ఏడోసారి ఘన విజయం సాధించింది. మేజిక్​ ఫిగర్​ 92ను దాటి 150కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.

13:08 December 08

గుజరాత్​లో భాజపా తిరుగులేని ఆధిక్యంతో దూసుకెళ్తోంది. వరుసగా ఏడోసారి అధికారం చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈనెల 12న మధ్యాహ్నం 2 గంటలకు భూపేంద్ర పటేల్​ మరోమారు గుజరాత్​ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని తెలిపారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్​.

12:45 December 08

గుజరాత్​లో ఆమ్​ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదాన్ గఢ్వీ వెనుకంజలో ఉన్నారు. ఖంబాలియా నియోజకవర్గంలో భాజపా అభ్యర్థి ఆయనపై స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

12:35 December 08

హిమాచల్​లో మిఠాయిలు పంచుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు​

హిమాచల్​ ప్రదేశ్​లో కాంగ్రెస్​ ఆధిక్యంలో కొనసాగుతోంది. రాజధాని శిమ్లాలో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఒకరికొకరు మిఠాయిలు పంచుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

11:10 December 08

గెలిచిన గుజరాత్, హిమాచల్​ ప్రదేశ్​ సీఎంలు​

  • హిమాచల్‌ప్రదేశ్‌: సెరాజ్‌ స్థానంలో సీఎం జైరాం ఠాకూర్‌ విజయం
  • గుజరాత్‌: గట్లోదియా స్థానంలో సీఎం భూపేంద్ర పటేల్‌ విజయం

09:57 December 08

సీఎం జైరాం ఠాకూర్‌ ముందంజ

హిమాచల్‌ప్రదేశ్‌

మండి స్థానంలో భాజపా అభ్యర్థి అనిల్‌ శర్మ ముందంజ

సిరాజ్‌ స్థానంలో సీఎం జైరాం ఠాకూర్‌ ముందంజ

చురా స్థానంలో భాజపా అభ్యర్థి హన్స్‌రాజ్‌ ముందంజ

మనాలి స్థానంలో గోవింద్‌ సింగ్‌ ఠాకూర్‌ (భాజపా) వెనుకంజ

09:56 December 08

రివాబా జడేజా వెనుకంజ

గుజరాత్‌

ఖంభాలియా స్థానంలో ఆప్‌ సీఎం అభ్యర్థి ఇసుదాన్‌ గధ్వి ముందంజ

విరంగాం స్థానంలో హార్దిక్‌ పటేల్‌ (భాజపా) ముందంజ

గాంధీనగర్‌ దక్షిణం స్థానంలో అల్పేశ్‌ ఠాకూర్‌ (భాజపా) ముందంజ

జామ్‌నగర్‌ ఉత్తరం స్థానంలో రవీంద్ర జడేజా భార్య రివాబా(భాజపా) వెనుకంజ

గట్లోదియా స్థానంలో సీఎం భూపేంద్ర పటేల్‌ ముందంజ

09:43 December 08

హిమాచల్ ప్రదేశ్​లో ఓట్ల లెక్కింపు రసవత్తరంగా సాగుతోంది. ప్రధాన పార్టీలైన భాజపా, కాంగ్రెస్​ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఇరు పార్టీలు దాదాపు చెరి సగం నియోజకవర్గాల్లో ఆధిక్యం కనబరుస్తున్నాయి. చివరకు ఫలితం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
హిమాచల్ ప్రదేశ్​లో మొత్తం 68 నియోజకవర్గాలు ఉన్నాయి. అధికారం చేపట్టాలంటే కనీసం 35 సీట్లు గెలుచుకోవడం అవసరం.

09:04 December 08

గుజరాత్​లో భాజపా ఆధిక్యం.. హిమాచల్​లో కాంగ్రెస్​!

ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాత్​లో భాజపా ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. ప్రత్యర్థి కంటే కాస్త ముందంజలోనే ఉంది. మరోవైపు హిమాచల్​ప్రదేశ్​లో మాత్రం కాంగ్రెస్​ స్వల్ప ఆధిక్యంలో ఉంది.

07:55 December 08

గుజరాత్, హిమాచల్​ ఓట్ల లెక్కింపు ప్రారంభం

gujarat election result 2022
కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గుజరాత్‌, హిమాచల్​ ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలుత పోస్టల్‌ బ్యాలెట్లను, తర్వాత ఈవీఎంల ఓట్లను లెక్కించనున్నారు అధికారులు. ఈ రెండు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం (ఈసీ) అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. హిమాచల్​ప్రదేశ్​లో ఒక విడతలో, గుజరాత్​లో రెండు విడతల్లో పోలింగ్‌ జరగ్గా ఓట్ల లెక్కింపు కోసం కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది.

07:15 December 08

మేజిక్​ ఫిగర్​ దాటేసిన కాంగ్రెస్​.. హిమాచల్​లో హస్తం పార్టీదే పీఠం

దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడనున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం (ఈసీ) అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. పటిష్ఠ భద్రత నడుమ ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. తొలుత పోస్టల్‌ బ్యాలెట్లను, తర్వాత ఈవీఎంల ఓట్లను లెక్కిస్తారు. గుజరాత్‌లో 27 ఏళ్లుగా అధికారంలో ఉన్న భాజపా.. మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు తహతహలాడుతోంది. అక్కడ కమలనాథుల ఘన విజయం లాంఛనమేనని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. కాంగ్రెస్‌ రెండో స్థానంలో, ఆప్‌ తృతీయ స్థానంలో నిలుస్తుందన్న అంచనాలున్నాయి. గుజరాత్​ తొలి దశ ఎన్నికలు డిసెంబరు 1న జరగ్గా.. రెండో విడత ఎన్నికలు డిసెంబరు 5న ప్రశాంతంగా జరిగాయి. మొదటి విడతలో 63.31 శాతం పోలింగ్​ నమోదైందని ఎన్నికలు అధికారుల వెల్లడించారు. ఇక రెండో విడతలో 65.22 శాతం పోలింగ్​ రికార్డైనట్లు ఈసీ వెల్లడించింది.

  • అసెంబ్లీ స్థానాలు- 182
  • కౌంటింగ్​ కేంద్రాలు-37
  • అభ్యర్థుల సంఖ్య- 1,621

ప్రముఖుల భవితవ్యమేంటో?
గుజరాత్​ ప్రస్తుత ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఆమ్‌ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదాన్‌ గద్వి, యువ నాయకులు హార్దిక్‌ పటేల్, జిగ్నేశ్‌ మెవానీ, అల్పేష్​ ఠాకూర్, క్రికెటర్‌ రవీంద్ర జడేజా సతీమణి రివాబా వంటి ప్రముఖల భవితవ్యం గురువారం తేలిపోనుంది.

వరుసగా ఏడోసారి?
గుజరాత్‌లో అధికార భాజపా వరుసగా ఏడోసారి జయభేరి మోగించాలని ఊవిళ్లూరుతోంది. ఎగ్జిట్‌ పోల్స్‌ కూడా భాజపా విజయం తథ్యమని అంచనా వేశాయి. గుజరాత్‌లో అధికారం చేపట్టేందుకు అవసరమైన మెజార్టీ మార్క్‌ 92 సీట్లు కాగా ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం భాజపాకు 117 నుంచి 151 సీట్ల వరకు రావచ్చని లెక్కగట్టాయి. కాంగ్రెస్‌ పార్టీకి 16 నుంచి 51, ఆమ్‌ఆద్మీకి 2 నుంచి 13 సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశాయి.

2017 ఎన్నికల్లో..
2017 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా 99 సీట్లు, కాంగ్రెస్‌ 77 సీట్లు గెలుచుకున్నాయి. బీటీపీకి రెండు, ఎన్సీపీకి ఒకటి, ముగ్గురు స్వతంత్రులు విజయం సాధించారు. ఈ ఏడాది ఎన్నికలు జరిగే సమయానికి భాజపా సభ్యుల సంఖ్య 110కు చేరింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సంఖ్య 60కి తగ్గింది. గత ఐదేళ్లలో కాంగ్రెస్‌ టికెట్‌పై గెలిచిన 20 ఎమ్మెల్యేలు భాజపాలో చేరారు. వారిలో ముగ్గురు ఎన్నికలకు ముందు పార్టీ మారారు.

హిమాచల్‌ ప్రదేశ్‌లో నువ్వానేనా
ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వాలను మార్చే సంస్కృతి ఉన్న హిమాచల్‌ప్రదేశ్‌లో ఈ సారి ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎగ్జిట్‌పోల్స్‌లో భాజపా, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ పోరు ఉందని వెల్లడవగా.. కమలదళం కాస్త ముందంజలో ఉన్నట్లు కనిపించింది. ఈ నేపథ్యంలో గురువారం హిమాచల్‌ప్రదేశ్‌లో ఓట్ల లెక్కింపునకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది.

  • మొత్తం స్థానాలు- 68
  • కౌంటింగ్​ కేంద్రాలు- 68
  • అభ్యర్థుల సంఖ్య- 412

ఎగ్జిట్‌పోల్స్‌ తర్వాత విజయంపై అధికార భాజపాతోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్‌ కూడా ధీమాగా ఉన్నాయి. మహిళలు, యువత ఓట్లపై ఎక్కువ ఆశలు పెట్టుకున్న భాజపా.. వారికి ఎన్నికల్లో భారీ హామీలనే ఇచ్చింది. మహిళలకు ప్రత్యేకంగా మ్యానిఫెస్టో కూడా ప్రకటించింది. మోదీ విస్త్రత ప్రచారం కూడా కలిసొస్తుందని భావిస్తోంది. మరోవైపు ఐదేళ్లకోసారి అధికార మార్పిడి సంప్రదాయం, ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి సమస్యలతోపాటు పాత పింఛను విధానం హామీ తమకు లాభిస్తాయని కాంగ్రెస్‌ నమ్ముతోంది. ఆమ్‌ఆద్మీ కూడా హిమాచల్‌ప్రదేశ్‌పై ఆశలు పెట్టుకుంది. అయితే ఎగ్జిట్‌పోల్స్‌లో ఆ పార్టీ ఉనికి ఏమాత్రం కనిపించలేదు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా 44 సీట్లు గెల్చుకోగా.. కాంగ్రెస్‌ 21, సీపీఎం 1, స్వతంత్రులు రెండు చోట్ల గెలిచారు.

Last Updated : Dec 8, 2022, 6:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.