ETV Bharat / bharat

యడియూరప్పకు షాక్.. 'రూ.కోట్ల స్కామ్'​పై దర్యాప్తునకు కోర్టు ఆదేశం

author img

By

Published : Sep 14, 2022, 4:43 PM IST

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప, ఆయన కుటుంబ సభ్యులు చిక్కుల్లో పడ్డారు. యడ్డీ ముఖ్యమంత్రిగా ఉండగా కోట్లాది రూపాయల కుంభకోణం జరిగిందన్న ఆరోపణలపై న్యాయస్థానం దర్యాప్తునకు ఆదేశించింది. నివేదిక సమర్పణకు నవంబర్ 2 వరకు గడువు ఇచ్చింది.

Yediyurappa
యడియూరప్పకు షాక్.. 'రూ.కోట్ల స్కామ్'​పై దర్యాప్తునకు కోర్టు ఆదేశం

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై దర్యాప్తునకు ఆదేశించింది బెంగళూరు కోర్టు. యడ్డీ, ఆయన కుటుంబసభ్యులు అనేక కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారంటూ దాఖలైన ప్రైవేటు పిటిషన్​ను విచారించిన ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం.. ఈమేరకు నిర్ణయం తీసుకుంది. అవినీతి నిరోధక చట్టం, ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టాలని ఆదేశించింది. తుది నివేదిక ఇచ్చేందుకు నవంబర్​ 2 వరకు గడువు ఇచ్చింది. అదే రోజున తదుపరి విచారణ ఉంటుందని స్పష్టం చేసింది.

ఆయన ఫిర్యాదుతో..
టీజే అబ్రహం అనే సామాజిక కార్యకర్త 2021 జూన్​లో ఈ పిటిషన్​ వేశారు. యడియూరప్ప ముఖ్యమంత్రిగా ఉండగా.. కోట్లాది రూపాయలు ముడుపులు తీసుకుని బెంగళూరు డెవలప్​మెంట్ అథారిటీ(బీడీఏ) పరిధిలోని హౌసింగ్ ప్రాజెక్టు కాంట్రాక్టును రామలింగం కన్​స్ట్రక్షన్​ కంపెనీకి ఇచ్చారని ఆరోపించారు. యడియూరప్ప, ఆయన కుమారుడు విజయేంద్ర, కుమార్తె పద్మావతి బంధువు శశిధర్​ను నిందితులుగా పేర్కొన్నారు.

అయితే.. ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తొలుత అబ్రహం పిటిషన్​ను కొట్టివేసింది. దీనిపై ఆయన హైకోర్టు ఆశ్రయించారు. టీజే అబ్రహం పిటిషన్​ను పునఃపరిశీలించాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించగా.. స్పెషల్ కోర్టు మరోసారి విచారణ జరిపింది. యడియూరప్ప, ఆయన కుటుంబ సభ్యులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.