ఇంట్లో పనివాళ్లకు మున్సిపాలిటీ నుంచి జీతాలు - వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేపై జడ్పీటీసీ ఆరోపణలు
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 17, 2024, 10:18 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17-02-2024/640-480-20776328-thumbnail-16x9-ycp-mla.jpg)
ZPTC Member Allegations to YCP Mla Shilpa Ravi Chandra Kishore : నంద్యాలలో వైసీపీ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్పై అదే పార్టీకి చెందిన జడ్పీటీసీ సభ్యుడు గోకుల్ కృష్ణారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. శిల్పా రవిచంద్ర ఇంట్లో పనిచేసే వారికి మున్సిపాలిటీ నిధుల నుంచి జీతాలు ఇస్తున్నారని గోకుల్ కృష్ణారెడ్డి ఆరోపించారు. అలాగే ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ భర్తకు సైతం మున్సిపాలిటీ నుంచి జీతం వస్తుందని వివరించారు. తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు. తము ఎలాంటి అక్రమాలు చేయమని, నిజాయితిగా ప్రజలకు సేవ చేస్తామని చేప్పుకునే శిల్పా కుటుంబం దీనికి సమాధానం చెప్పాలని గోకుల్ కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.
శిల్పా రవిచంద్ర ఇంట్లో పనిచేసే వారు ఏమైనా మున్సిపాలిటీ ఉద్యోగులా అని గోకుల్ కృష్ణారెడ్డి ప్రశ్నించారు. ప్రజల సొమ్మును జీతాలుగా ఎలా ఇస్తారని మండిపడ్డారు. ఈ విషయం నంద్యాలలో ఉన్న వైసీపీ నేతలందరికి తెలుసన్నారు. కానీ భయపడి ఎవ్వరూ నోరువిప్పటం లేదని విమర్శించారు. ఆర్టీఐ చట్టం ప్రకారం మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. ఈ విషయంపై సమాధానం చెప్పకుంటే మున్సిపల్ కార్యాలయం వద్ద భారీ ఎత్తున ధర్నా చేస్తామని గోకుల్ కృష్ణా రెడ్డి స్పష్టం చేశారు.