ప్రకాశం వైసీపీలో భగ్గుమన్న విభేదాలు - పేరు లేదని శిలాఫలకం ధ్వంసం చేసిన సర్పంచ్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 27, 2024, 6:12 PM IST
YSRCP Sarpanch Destroyed Stone Plaque in Prakasam District : ఎన్నికలు తరుముకొస్తున్న వేళ అధికార పార్టీలో వర్గ విభేదాలు బహిర్గతం అవుతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా (Prakasam District) యర్రగొండపాలెం వైసీపీలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. పెద్దారవీడు మండలం చట్లమిట్ట, రేగుమానుపల్లి సర్పంచుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. రెండు గ్రామాలకు కలిపి ఒకే సచివాలయాన్ని నిర్మించారు. అయితే సచివాలయంలోని శిలాఫలకంపై రేగుమానుపల్లి సర్పంచ్ పేరు లేకపోవడంతో స్థానిక గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రేగుమానుపల్లి పంచాయతీ సర్పంచ్ రామాంజనేయరెడ్డి పేరు లేకపోవడంపై అతడు పలుసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లాడు. ఈ విషయంపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఆగ్రహించిన రామంజనేయ రెడ్డి సుత్తితో శిలాఫలకాన్ని ధ్వంసం చేశాడు. వార్డు మెంబర్లు, సచివాలయం కన్వీనర్లు పేర్లు ఉన్నప్పుడు తన పేరు లేకపోవడం ఏంటని రామంజనేయ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పేరు లేని శిలాఫలకం ఉండకూడదంటూ పగలగొట్టినట్లు తెలిపారు. గతంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ సానుభూతిపరుల ఓట్లుతో గెలిచినందుకే శిలాఫలకంపై సర్పంచ్ పేరు లేదని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.