సీటు కేటాయించకపోయినా ఇంకా ఎమ్మెల్యేనే - ఇన్ఛార్జ్ తీరుపై ఎలీజా ఆగ్రహం
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 3, 2024, 10:58 AM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-03-2024/640-480-20893478-thumbnail-16x9-ysrcp-mla-eliza-comments.jpg)
YSRCP MLA Eliza Comments: నియోజకవర్గ సమన్వయకర్తల పేరుతో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనటం దుర్మార్గమని ఏలూరు జిల్లా చింతపూడి వైసీపీ ఎమ్మెల్యే ఎలీజా ధ్వజమెత్తారు. లింగపాలెం మండలం అన్నపనేనివారిగూడెంలో రహదారి నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. తనకు సీటు కేటాయించకపోయినా ఇంకా ఎమ్మెల్యే పదవిలోనే ఉన్నానన్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయరాజుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. విజయరాజు తీరును ఎలీజా తీవ్రంగా ఖండించారు. తాను ఎమ్మెల్యేగా ఉండగా జగన్ మోహన్ రెడ్డి నియమించిన ఇన్ఛార్జ్ విజయరాజు నియోజకవర్గ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరవుతున్నారని తెలిపారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. పార్టీ ఇన్ఛార్జ్ ప్రజలతో కలిసి ఓటు వేయమని అడగాల్సింది పోయి ఎమ్మెల్యేగా ప్రవర్తించడం దారుణంగా ఉందన్నారు. నేను ఇంకా వైసీపీలోనే ఉన్నానని, ఎమ్మెల్యేగా ఉన్నానని తెలిపారు. కార్యకర్తలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పారు. అధిష్ఠానం మరోసారి ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తే పోటీ చేస్తారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు తాను పోటీ చేయనని ఆయన తెగేసి చెప్పారు.