భీమిలిలో వైఎస్సార్సీపీకి షాక్ - టీడీపీలో భారీ చేరికలు
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 26, 2024, 6:50 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/26-01-2024/640-480-20599770-thumbnail-16x9-ysrcp-members-joinings-in-tdp-under-korada-raja-babu-in-bheemili.jpg)
YSRCP Members Joinings in TDP : విశాఖ జిల్లా భీమిలిలో శనివారం వైఎస్సార్సీపీ ఎన్నికల సమరశంఖం పూరించనుంది. అధికార పార్టీ భారీ హంగులతో అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇదిలావుంటే భీమిలి వైఎస్సార్సీపీ కార్యకర్తలు భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరి అధిష్ఠానానికి షాక్ ఇచ్చారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి కోరాడ రాజబాబు ఆధ్వర్యంలో 300 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆనందపురం మండలం కణమాం పంచాయతీ, ఎర్రవానిపాలెం, గోరింట గ్రామాలకు చెందిన 200 కుటుంబాలకు పార్టీ కండువాలు వేసి టీడీపీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో ఇంచార్జి రాజబాబు మాట్లాడుతూ భవిష్యత్తులో ప్రతి గ్రామంలో, వాడవాడలో తెలుగుదేశం పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమయ్యిందన్నారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా వైఎస్సార్సీపీని ఇక ప్రజలు నమ్మరన్నారు. ప్రభుత్వాన్ని ఆ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలే నమ్మే స్థితిలో లేరన్నారు. సామాన్య ప్రజానీకం కూడా ప్రభుత్వ మోసపూరిత పథకాలను పసిగట్టి ఎంత దోపిడీకి గురవుతున్నారో గుర్తించారన్నారు. ప్రభుత్వం ఈతకాయ ఇచ్చి తాటికాయ తీసుకునే చందంగా పరిపాలన సాగిస్తున్న విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకున్నారన్నారు.