వైఎస్సార్సీపీ శ్రేణులు కక్ష సాధింపు చర్యలు- టీడీపీ సానుభూతిపరుల ఆస్తులు ధ్వంసం చేస్తూ అరాచకాలు - Destruction of TDP property
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 14, 2024, 3:59 PM IST
YSRCP Leaders Destroyed TDP Followers Properties In Chittoor : చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో తెలుగుదేశం కార్యకర్తలపై వైఎస్సార్సీపీ శ్రేణులు కక్ష సాధింపు చర్యలకు దిగాయి. ఆస్తులపై తెగబడి ధ్వంసం చేశారు. బల్ల గ్రామానికి చెందిన వెంకటాచలం సోమవారం జరిగిన ఎన్నికల్లో 96వ బూత్లో తెలుగుదేశం తరఫున ఏజెంట్గా పని చేశాడు. దీన్ని జీర్ణించుకోలేని కొందరు వైఎస్సార్సీపీ కార్యకర్తలు నిన్న సాయంత్రం అతని పొలంలోకి చొరబడి వ్యవసాయ సామాగ్రి, చెట్లకు నిప్పు పెట్టారు. బోరు మోటారు, కేబుళ్లు, బిందు సేద్యం పరికరాలను తగులబెట్టారు. మరో వైపు వైఎస్సార్సీపీ శ్రేణులు బూరుగ మాకనపల్లిలోనూ రామయ్య గౌడు పొలంలోని కొబ్బరి చెట్లకు నిప్పంటించారు.
పొలంలోని బిందు సేద్యం సామాగ్రిని కూడా మంటల్లో కాల్చివేశారు. తెలుగుదేశం సానుభూతి పరులుకావడంతోనే తమపై కక్షగట్టి వైఎస్సార్సీపీ నాయకులే ఆస్తులకు నష్టం కలిగించారని బాధితులు ఆరోపిస్తున్నారు. రోజు రోజుకీ వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతల దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని ప్రజలు వాపోతున్నారు. ప్రాణాలు తియ్యడానికి సైతం వెనకాడకుండా అరాచకంగా ప్రవర్తిస్తున్నారని స్థానిక ప్రజలు వాపోతున్నారు.