ఈసీ ఆదేశాలు లెక్కచేయని సచివాలయ ఉద్యోగులు - సామాజిక మాధ్యమాల్లో వైసీపీ అనుకూల ప్రచారం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 21, 2024, 10:16 AM IST
YSRCP Campaign on Social Media Groups: వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ప్రభుత్వానికి గానీ, అధికార పార్టీకి గానీ ప్రచారం చేసే విధంగా ప్రవర్తించకూడదని ఎన్నికల సంఘం స్పష్టంగా ఉన్నప్పటికీ, ఇందుకు విరుద్దంగా వీరు పనిచేస్తున్నారు. కొంతమంది వాలంటీర్లు వైసీపీ అభ్యర్థుల ఇంటింట ప్రచారాల్లో పాల్గొనగా, మరికొందరు సోషల్ మీడియాలో ప్రచారాలకు పాల్పడుతున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం కొప్పోలులో సచివాలయం అధికార గ్రూప్లో ప్రచారానికి తెరలేపారు. పౌరులకు ఏదైనా సమాచారం తెలియజేయడం కోసం సచివాలయ సిబ్బంది అధికారిక వాట్సాప్ గ్రూప్ను ఏర్పాటు చేశారు. అందులో సచివాలయ సిబ్బందితో పాటు, గ్రామ వాలంటీర్లు కూడా అడ్మిన్గా ఉంటారు. పౌరులు సభ్యులుగా మాత్రమే ఉన్నారు.
మన సచివాలయం కొప్పోలు పేరుతో ఉన్న ఈ వాట్సాప్ గ్రూప్లో వైసీపీ ప్రచారానికి వాడుకుంటున్నారు. ఫేక్ సర్వేలు పెట్టి, జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని, జగన్ను పొగుడుతూ పాటలు, ప్రచారాలు పోస్టులు పెడుతున్నారు. అంతే కాకుండా, ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారిని, ప్రధాని మోదీని విమర్శిస్తూ రూపొందించిన ప్రచారాలను ఇందులో పోస్టు చేస్తూ పౌరులను ప్రభావితం చేస్తున్నారు. వాట్సాప్ గ్రూప్లో వైసీపీకి అనుకూలంగా పోస్టులు పెట్టడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. సచివాలయ సిబ్బంది తీరుపై అధికారులకు ఫిర్యాదు చేస్తామని గ్రామస్థులు తెలిపారు.