మూడేళ్లయినా ముందుకు కదలని రోడ్డు పనులు- గిరిజనులకు తప్పని డోలీ మోతలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 25, 2024, 5:17 PM IST
Tribal protest For incomplete road works: కంకర వేసి వదిలేసిన 17 కిలోమీటర్ల రోడ్డు పనులు పూర్తి చేసి, తమకు డోలీ మోత కష్టాలను తప్పించాలని గిరిజనులు వేడుకుంటున్నారు. అల్లూరి జిల్లా అనంతగిరి మండలం పెనుకోట, పెదకోట పంచాయతీ పరిధిలోని 9 గ్రామాల్లో 300 మంది గిరిజనులు నివసిస్తున్నారు. ఈ గ్రామాలకు వెళ్లే రోడ్డు కోసం, గతంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద సుమారు 19కోట్ల రూపాయలు నిధులు విడుదల చేశారు. 2021లో రోడ్డు పనులు మెుదలు పెట్టారు. అయితే కంకర వేసిన అనంతరం రోడ్డు పనులను మధ్యలోనే ఆపేశారని గిరిజనులు చెబుతున్నారు.
రోడ్డు సరిగా లేక వాహనాలు రాకపోవడంతో నిత్యం డోలీ మోతలతో అనేక అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు. పాలకులు, అధికారులు ఓట్ల కోసం తమ గ్రామాలవైపు వస్తున్నారే తప్పా సమస్య పరిష్కారం కోసం ఎవరూ రావడం లేదని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు పనులు పూర్తి చేయాలంటూ గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు.