ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఇంటి ముట్టడికి గిరిజన భాషా వాలంటీర్లు పిలుపు - అడ్డుకున్న పోలీసులు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 12, 2024, 5:37 PM IST
Tribal Bhasha Volunteers Protest: అల్లూరి సీతారామరాజు జిల్లాలో భాషా వాలంటీర్లు తమను రెన్యూవల్ చేసి, పనికి తగ్గ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. అయితే పోలీసులు ముందస్తుగా ప్రతి మండల కేంద్రంలో ఎక్కడి వాలంటీర్లను అక్కడే గృహ నిర్బంధించారు. కొందరిని పోలీస్ స్టేషన్లలో బంధించారు. పాడేరులో హోటల్లో టిఫిన్ చేస్తుండగా ముగ్గురిని హుకుంపేట పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఎలాగోలా పాడేరు చేరుకున్న వాలంటీర్లు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి (MLA Bhagyalakshmi) ఇంటి ముట్టడికి ప్రయత్నం చేశారు. అయితే ఎమ్మెల్యే ఇంటికి వెళ్లకుండా పోలీసు అధికారులు రహదారిపై బారికేడ్లు ఏర్పాటు చేసి ముట్టడిని అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ భాషా వాలంటీర్లు రహదారి పక్కనే బైఠాయించారు. సమస్యలపై స్పందించని ఎమ్మెల్యే మాకొద్దు అంటూ నినాదాలు చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ ఉద్యోగాలను రెన్యూవల్ చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.