పట్టుబడ్డ వైఎస్సార్సీపీ ప్రచార సామగ్రి గుట్టు విప్పండి - టీడీపీ నేతల ఫిర్యాదు - YCP LEADERS ELECTION GIFTS
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 27, 2024, 6:50 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/27-03-2024/640-480-21083951-thumbnail-16x9-tdp-leaders-complaint-on-ycp-election-gifts.jpg)
TDP Leaders Complaint on YCP Election Gifts : రేణిగుంట గోదాములోని వైఎస్సార్సీపీ ప్రచార సామగ్రిని స్వాధీనం చేసుకుని 24 గంటలు అవుతున్నా అధికారులు పూర్తిస్ధాయిలో సమాచారం బయటపెట్టడం లేదని టీడీపీ నాయకులు ఆరోపించారు. పట్టుబడిన వైసీపీ ఎన్నికల సామగ్రిపై వెంటనే విచారణ చేపట్టాలంటూ టీడీపీ తిరుపతి లోక్సభ అధ్యక్షుడు నరసింహ యాదవ్, శ్రీకాళహస్తి నియోజకవర్గం అభ్యర్ధి బొజ్జల సుధీర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తిరుపతి కలెక్టర్ లక్ష్మీశకు వినతిపత్రం అందజేశారు. ఫిర్యాదు చేసినా కలెక్టర్ స్పందించిన తీరు సరిగ్గా లేదంటు మండిపడ్డారు. మంగళవారం మధ్యాహ్నం ఫిర్యాదు చేస్తే ఇవాళ మధ్యాహ్నం జీఎస్టీ అధికారులు వచ్చి పరిశీలించారని తెలిపారు.
అనంతరం బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజలను ప్రభావితం చేసే వస్తువులు దొరికినప్పుడు వెంటనే సీజ్ చేసి విచారణ చేపట్టాలన్నారు. మండలానికి ఒక్క ఫ్లయింగ్ స్క్వాడ్ పెట్టడమేంటని ప్రశ్నించారు. వెంటనే ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేస్తామన్నారు. గోదాముల వద్ద స్థానిక పోలీసులు ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయన సెంట్రల్ ఫోర్స్ను సంఘటనా స్ధలంలో ఉంచాలని కోరారు. గోదాముల్లో ఉన్న వస్తువులను సీజ్ చేయటంతోపాటు వాటి వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు.