గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబైన ప్రభుత్వ భవనాలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 26, 2024, 7:57 AM IST
Republic Day Celebrations in AP : గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సచివాలయం, శాసనసభ భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. సచివాలయంలోని ఐదో నంబరు బ్లాక్ భవనాన్ని మువ్వన్నెల జెండా రంగుల్లో అత్యంత ఆకర్షణీయంగా ముస్తాబు చేశారు. సచివాయంలోని అన్ని బ్లాక్లతో పాటు రాష్ట్ర గవర్నర్ నివాసం రాజ్ భవన్, ఏపీ హైకోర్టు, ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తుల నివాసాలను విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అంతే కాకుండా విజయవాడలోని ఇతర ప్రభుత్వ భవనాలకు విద్యుత్ దీపాలంకరణ చేశారు.
Government Buildings Decorated With Electric Lights : అయితే ఈరోజు (శుక్రవారం) ఉదయం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగనున్నాయి. అందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. స్టేడియంలోని మైదానాన్ని మువ్వన్నెల జెండాలతో ముస్తాబుచేసి విద్యుద్దీప కాంతులతో శోభాయమానంగా అలంకరించారు. రిపబ్లిక్ డే వేడుకలలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ తో కలిసి సీఎం జగన్ పాల్గొననున్నారు. అలాగే సాయంత్రం 4.15 గంటలకు రాజ్భవన్లో గవర్నర్ ఆథిద్యం ఇచ్చే కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు.