చక్కెర ఇవ్వలేదని ప్రశ్నించిన వ్యక్తి - దాడికి పాల్పడిన రేషన్ డీలర్ కుటుంబం - Attacked on Photo Studio Owner
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 25, 2024, 12:52 PM IST
Ration Dealer Family Attacked on Photo Studio Owner : వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండలం అమృతనగర్లో రేషన్ డీలర్ కుటుంబం రెచ్చిపోయింది. చక్కెర ఇవ్వలేదని అధికారులకు ఫిర్యాదు చేసినందుకు ఫొటో స్టూడియో నిర్వాహకుడు నాగరాజుపై దాడికి తెగబడింది. దీంతో అతనికి గాయాలయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళితే, అమృతనగర్కు చెందిన నాగరాజు అదే ప్రాంతంలోనే ఫొటో స్టూడియో నిర్వహిస్తున్నారు. స్థానిక రేషన్ డీలర్ చాలా మందికి చక్కర ఇవ్వకపోవడంతో నాగరాజు పలు సంఘాల నాయకులతో కలిసి రెవెన్యూ కార్యాలయంలో అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అధికారులకు ఫిర్యాదు చేయడాన్ని జీర్ణించుకోలేని రేషన్ డీలర్ షేక్ రెహానా, ఆమె భర్త నిజాం, కుమారులు ఫొటో స్టూడియో వద్దకు వెళ్లి నాగరాజుపై దాడి చేశారు. అంతటితో ఆగకుండా ఫొటో స్టూడియోపై రాళ్లు విసిరారు. స్టూడియో అద్దాలు, కంపూటర్లు, ఇతర పర్నిచర్ ధ్వంసం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.