మాచర్లలో వైఎస్సార్సీపీ అరాచకాలు - మహిళపై కత్తితో దాడి - Pinnelli follower attacked on woman
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 26, 2024, 7:12 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/26-05-2024/640-480-21564805-thumbnail-16x9-mla.jpg)
MLA Pinnelli Ramakrishna Reddy Follower Attack : పల్నాడు జిల్లా మాచర్లలో వైఎస్సార్సీపీ అరాచకాలు ఆగడం లేదు. మాచర్ల 22వ వార్డులో నీలావతి అనే మహిళపై ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుడు ఉప్పుతోళ్ల వెంకటేష్ దాడికి తెగబడ్డాడు. కత్తితో అత్యంత పాశవికంగా దాడి చేయడంతో నీలావతి తల, చెంప, చేతులపై తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలింగ్ తర్వాత రోజు నుంచి వీధుల్లో కత్తితో హల్చల్ చేస్తున్న వెంకటేష్, మా అన్న పిన్నెల్లి జోలికొస్తే కత్తితో పొడుస్తా అంటూ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలను బెదిరిస్తున్నారు. పిన్నెల్లి ప్రధాన అనుచరుడు, మాచర్ల కిరాతక మూకకు నాయకత్వం వహిస్తున్న తురకా కిషోర్ వెంట తిరిగే వెంకటేష్పై, 10 కేసులు ఉన్నా పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మే 13న పోలింగ్ రోజు PWD కాలనీ, పాల్వాయి గేటు ప్రాంతాల్లో, మరుసటి రోజు కారంపూడిలో వైఎస్సార్సీపీ గూండాల అరాచకంలో వెంకటేష్ కీలక పాత్ర పోషించాడు. ఇలాంటి రౌడీల పట్ల పోలీసులు ఎందుకు ఉదాసీనంగా ఉన్నారంటూ బాధిత కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. వెంకటేష్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.