మల్లన్న సేవలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి - స్వాగతం పలికిన ఆలయ ఈవో - mp cm visit srisailam temple
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 25, 2024, 6:56 PM IST
Madhya Pradesh CM Mohan Yadav Visit Srisailam Temple in Nandyala District : నల్లమల అడవుల్లో కొండగుట్టల మధ్య కొలువైన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ దంపతులు దర్శించుకున్నారు. హైదరాబాదు నుంచి శ్రీశైలానికి ప్రత్యేక హెలికాప్టర్లో మోహన్ యాదవ్ దంపతులు సున్నిపెంట చేరుకున్నారు. అక్కడి నుంచి కాన్వాయ్లో శ్రీశైలాన్ని చేరుకున్నారు.
శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయ మహాద్వారం వద్ద మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ దంపతులకు దేవస్థానం ఈవో డి. పెద్దిరాజు, అర్చకులు సాదర స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనం కోసం ఆలయ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. మోహన్ యాదవ్ దంపతులు శ్రీ స్వామివారికి రుద్ర అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో వారికి అర్చకులు వేద పండితులు వేద ఆశీర్వచనాలు పలికారు. అనంతరం ఆలయ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు, జ్ఞాపికలను మోహన్ యాదవ్ దంపతులకు అందజేశారు.