ఒంటిమిట్టలో కోదండరాముడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం - VONTIMITTA BRAHMOTSAVAM
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 17, 2024, 1:37 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17-04-2024/640-480-21245529-thumbnail-16x9-kodanda-rama-swamy-brahmotsavam-to-begin.jpg)
Kodanda Rama Swamy Brahmotsavam to Begin: వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రాముని బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో కీలకమైన ఆగమశాస్త్రం ప్రకారం ధ్వజారోహణ కార్యక్రమంతో ప్రారంభించారు. స్వామి, అమ్మవార్లకు తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున పట్టువస్త్రాల సమర్పించిన వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. కోదండరాముని ఆలయం రామనామ స్మరణతో మార్మోగుతోంది. ధ్వజారోహణం తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. నేటి నుంచి ఈ నెల 26వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగునున్నాయి.
ఆంధ్రుల భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఆలయ ప్రాకారం గోడ చుట్టూ ప్రత్యేకంగా అలంకరణ చేశారు. జగదభిరాముడి సన్నిధి, మాడ వీధులు, పరిసర ప్రాంతాలు, కల్యాణ వేదిక ప్రాంగణం సరికొత్త శోభను సంతరించుకున్నాయి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం స్వామి వారి ఉత్సవ వేడుకలు జరుగుతాయి. ఈనెల 22వ తేదీన రాత్రి సీతారాముల కల్యాణ మహోత్సవం జరగనుంది. రాములోరి కల్యాణాన్ని లక్ష మంది భక్తులు వీక్షించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 23న రథోత్సవం నిర్వహిస్తామని టీటీడీ అధికారులు వెల్లడించారు.