వైఎస్సార్సీపీ పాలనలో భావితరాల భవిష్యత్తు అంధకారమైంది: కామినేని శ్రీనివాసరావు - BJP leader Kamineni Srinivasa Rao
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 28, 2024, 5:08 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/28-03-2024/640-480-21091093-thumbnail-16x9-kamineni-srinivasa-rao-fires-on-ysrcp.jpg)
Kamineni Srinivasa Rao Fires on YSRCP : వైఎస్సార్సీపీ అరాచక పాలనలో రాష్ట్రంలోని భావితరాల భవిష్యత్తు అంధకారమైందని మాజీ మంత్రి, కైకలూరు బీజేపీ అభ్యర్ధి కామినేని శ్రీనివాసరావు తెలిపారు. బీజేపీ అభ్యర్ధిగా ప్రకటించిన నేపథ్యంలో కైకలూరులో ఆయనను పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కైకలూరు అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించినందుకు టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ పార్లమెంటరీ కమిటీకి కామినేని ధన్యవాదాలు తెలియజేశారు.
నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉండరని, ప్రతిపక్షాలపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని కామినేని శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రిగా పనిచేసిన కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాల్సి వచ్చినా అవినీతి మచ్చ లేకుండా కైకలూరు అభివృద్ధి కోసం పని చేశానని గుర్తు చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యేలా తన కుటుంబ సభ్యులు ఎవరు పరిపాలనలో జోక్యం చేసుకున్న దాఖలాలు లేవని వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వ సాయంతో కొల్లేరు సమస్యలకు శాశ్వత పరిష్కారం చేస్తానని కామినేని శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో నీటి సమస్య తీవ్రంగా ఉందని, మంచినీరు అందేలాగా శాశ్వత పరిష్కారం చేసి చూపిస్తామని ప్రజలకు భరోసా కల్పించారు. తాను రాజకీయాల నుంచి విరమించాలనుకున్నానని తెలిపారు. కానీ నియోజకవర్గంలో పరిస్థితులు, ప్రజల ఆకాంక్ష మేరకు మళ్ళీ పోటీ చేయాల్సిన అవసరం నెలకొందని స్పష్టం చేశారు.