ప్రధానిమోదీ సభలో పోలీసులు వ్యవహరించిన తీరు పలు అనుమానాలకు తావిస్తోంది: నాదెండ్ల
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 18, 2024, 2:19 PM IST
Janasena PAC Chairman Nadendla Manohar on AP Police: పల్నాడు జిల్లాలో ఆదివారం నిర్వహించిన ప్రధానిమోదీ సభలో పోలీసులు వ్యవహరించిన తీరు పలు అనుమానాలకు తావిస్తోందని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ చెప్పారు. దేశ ప్రధాని సభకు జిల్లా అధికారులు బ్లాంక్ పాసులు ఎలా ఇస్తారని మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మనోహర్ ప్రశ్నించారు. దీనిపై ఎన్నికల అధికారిని కలిసి ఫిర్యాదు చేస్తున్నామని అన్నారు. నేతల సహకారంతో సభ విజయవంతంగా జరిగిందన్నారు. పొత్తులలో భాగంగా సీట్లు ఆశించి, రాని వారికి భవిష్యత్తులో న్యాయం చేస్తామన్నారు. పోలీసుల నిర్లక్ష్యం వల్ల సభలో చాలా ఇబ్బందులు వచ్చాయని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ నాలుగేళ్ల కృషికి ఆదివారం సభ వల్ల ఫలితం వచ్చిందని చెప్పారు. త్వరలోనే పవన్ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారని మనోహర్ అన్నారు.
"పల్నాడు జిల్లాలో జరిగిన ప్రధానిమోదీ సభ విజయవంతం అయింది. అయితే పోలీసులు వ్యవహరించిన తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. దేశ ప్రధాని సభకు జిల్లా అధికారులు బ్లాంక్ పాసులు ఎలా ఇస్తారు? దీనిపై ఎన్నికల అధికారిని కలిసి సాయంత్రం 4 గంటలకు ఫిర్యాదు చేస్తాం. బొప్పూడి సభ విజయవంతం అయింది. మూడు పార్టీల కలయిక ప్రజలకు మేలు చేస్తుంది." - నాదెండ్ల మనోహర్, జనసేన పీఏసీ ఛైర్మన్