వైసీపీని అంతమెుందించేందుకే కూటమి ఏర్పడింది: మండలి బుద్ధప్రసాద్‌ - mandali buddha prasad comments

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 5, 2024, 9:14 PM IST

thumbnail

Mandali Buddha Prasad Comments: రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతున్న వేళ ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపటానికే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయని అవనిగడ్డ నియోజకవర్గ కూటమి అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో గడిచిన ఐదేళ్లలో అవనిగడ్డ ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారని ఆయన విమర్శించారు. రానున్న ఎన్నికలలో రాష్ట్రంలోనూ, నియోజకవర్గంలోనూ కూటమి ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని బుద్ధప్రసాద్ అన్నారు. 

అధికారం చేపట్టిన తర్వాత ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా తాను నడుచుకుంటానని, జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలకు అండగా ఉంటానని తెలిపారు. మూడు పార్టీల కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుతానని బుద్ధప్రసాద్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యువతకు భవిష్యత్తు లేకుండా పోయిందని, ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడి, కేసులు పెట్టారని మండిపడ్డారు. కార్యకర్తలు కూడా నాయకుల ఆలోచనలను అవగతం చేసుకుని నడుచుకోవాలని అన్నారు. 

ప్రజాస్వామ్యంలో పార్టీ టికెట్ ఆశించడం తప్పు కాదని, కానీ పార్టీ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు పని చేయాలని బుద్ధప్రసాద్ అన్నారు. టికెట్ ఆశించిన వారందరినీ కలుపుకుని వెళ్తానని, నియోజకవర్గ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పని చేయాలని కోరారు. విభేదాలను పక్కన పెట్టి పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బుద్ధప్రసాద్ పిలువునిచ్చారు. జనసేన పార్టీలో తనకు అవకాశం కల్పించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కి, తన నిర్ణయాన్నిఆశీర్వదించిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.