ఎంపీ ఎంవీవీ ఓటమి నా చేతిలోనే: జనసేన నేత వంశీకృష్ణ శ్రీనివాస్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 17, 2024, 4:12 PM IST
Janasena Leaders Fired on MP MVV Satyanarayana: వ్యాపారం, సొంత ఆస్తులు పెంచుకోవటం కోసం పార్లమెంటు అభ్యర్థిగా గెలిచారా అని వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను జనసేన నేతలు ప్రశ్నించారు. విశాఖలో భూకబ్జాలు చేయడం ఎంపీ ఎంవీవీకి పరిపాటిగా మారిందని ఎమ్మెల్సీ వంశీకృష్ణ, కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. ఎంవీవీ ఎంపీగా గెలిచిన తరువాత సొంత వెంచర్ల వద్ద ఎంపీ నిధులతో రహదారులు వేయించుకున్నారని వారు మండిపడ్డారు. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ విశాఖలో గెలిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని జనసేన నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ (Vamsi Krishna Srinivas) సవాలు విసిరారు. తాను వైఎస్సార్సీపీ నాయకుల గురించి ఎవరి మీద వ్యక్తిగత విమర్శలు చేయలేదని ఆయన అన్నారు. ఎంవీవీనే దిగజారి మాట్లాడుతున్నారని వంశీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంవీవీ అనుచరులైన కుమార్, జీవీ గురించి తాను మాట్లాడితే కొంతమంది కార్పొరేటర్లతో తనను, యాదవ కులం పేరిట తిట్టించడం సిగ్గుచేటు ఆయన అన్నారు. విశాఖ బ్యాంకుల్లో అత్యధిక అప్పులు తీసుకున్న వ్యక్తి ఎంవీవీ అని, ఎంవీవీ ఓటమి తన చేతిలోనే ఉందని వంశీకృష్ణ హెచ్చరించారు.