ఫార్చ్యునర్ కారు డిక్కీలో నోట్ల కట్టలు- స్వాధీనం చేసుకున్న పోలీసులు - Huge Cash Seized Anantapur
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 30, 2024, 8:27 PM IST
Huge Cash Seized By Police In Anantapur District : అనంతపురంలో కోటి రూపాయలకుపైగా నగదును పోలీసులు పట్టుకున్నారు. నగరంలోని విద్యుత్ నగర్ సర్కిల్ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఫార్చ్యునర్ కారు అటువైపుగా వచ్చింది. కారు డ్రైవర్ ఆందోళన పడుతున్న విషయాన్ని గమనించిన పోలీసులు వాహనం డిక్కీ తెరిచి చూడగా రెండు లగేజ్ బ్యాగుల్లో నిండుగా 500రూపాయల నోట్ల కట్టలు గుర్తించారు. నగదు ఎక్కడి నుంచి తరలిస్తున్నారని ప్రశ్నించారు. డ్రైవర్ సమాచారం చెప్పక పోవడంతో, విచారణ కోసం స్టేషన్కు తరలించారు.
నగదు లెక్కించడానికి పోలీసులు నగదు లెక్కింపు యంత్రాలు తీసుకొచ్చారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా నగదు పట్టుబడిందని డీఎస్పీ రాఘవరెడ్డి మీడియాకు వివరించారు. పట్టుబడిన నగదు కోటి రూపాయలకు పైగా ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఎన్నికల వేళ కోట్లలో డబ్బు తరలించడం అనుమానస్పదంగా ఉందని స్థానికులు అంటున్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు.