గుడివాడలో పోటాపోటీ ఫ్లెక్సీలు- 'సిద్ధం' అంటున్న వైఎస్సార్సీపీ, 'సై' అంటున్న టీడీపీ
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 30, 2024, 9:13 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-01-2024/640-480-20627126-thumbnail-16x9-flexi-issue-between-tdp-and-ycp-parties-in-gudivada.jpg)
Flexi Issue Between TDP and YCP Parties in Gudivada : కృష్ణా జిల్లా గుడివాడలో పోటాపోటీగా రాజకీయ ఫ్లెక్సీలు వెలిశాయి. 'సిద్ధం' అంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ' సై' అంటూ తెలుగుదేశం నేత వెనిగండ్ల రాము బ్యానర్లు కట్టించారు. దీంతో పోటాపోటీగా వెలిసిన అధికార, విపక్ష పార్టీ నేతల ఫ్లెక్సీలతో గుడివాడ ముఖ్య కూడళ్లు నిండిపోయాయి. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఇలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం గుడివాడలో రాజకీయ వేడిని పెంచింది.
అయితే వైఎస్సార్సీపీ అరాచక పాలనపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు టీడీపీ-జనసేన పార్టీలు రాష్ట్రంలో ఇప్పటికే ‘రా కదలి రా’ పేరుతో భారీ బహిరంగ సభలను నిర్వహిస్తున్నాయి. టీడీపీ ఆవిర్భావం సందర్భంగా ఆనాడు ఎన్టీఆర్ 'రా కదలి రా' అంటూ ఇచ్చిన పిలుపుతో ఈ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే సిద్దం పేరుతో విశాఖపట్నం భీమిలో ఎన్నికల శంఖారావాన్ని జగన్ పూరించారు. రానున్న ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధమని సీఎం జగన్ అభివర్ణించారు. ఈ ఎన్నికలకు వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. దీంతో రెండు రాజకీయ పార్టీలు పోటాపోటీగా సభలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండటంతో రాష్ట్రంలో రాజకీయ వేడిని రగిలిస్తున్నాయి.