చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు హల్చల్ - భయం గుప్పిట్లో స్థానికులు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 10, 2024, 1:26 PM IST
Elephants Attack on Crop Fields: చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు నియోజకవర్గంలో ఏనుగులు హడలెత్తించాయి. ఐరాల మండలం చుక్కవారి పల్లి గ్రామంలోని పంట పొలాల్లో 19 ఏనుగులు తిష్ట వేశాయి. గ్రామంలోని అరటి, మామిడి, చెరకు పంటలను ధ్వంసం చేశాయి. పంటల రక్షణ కోసం రైతులు ఏర్పాటు చేసిన కంచెను నేలమట్టం చేశాయి. అనంతరం వ్యవసాయ పొలాల నుంచి గ్రామాల్లోకి ఏనుగుల గుంపు ప్రవేశించడంతో స్థానికులు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు.
Elephants Hulchul in Chittoor District: అడవుల్లో ఉండాల్సిన ఏనుగులు సమీప ప్రాంతంలోని పంట పొలాల్లోకి వచ్చి ధ్వంసం చేస్తూ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయని గ్రామస్థులు వాపోయారు. ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటూ ఇంటికే పరిమితం అవుతున్నామని, ఏనుగులు పంట పొలాలను ధ్వంసం చేస్తున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు స్పందించి ఏనుగుల కట్టడికి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.