పథకాల నిధుల విడుదలపై విచారణ- అత్యవసర పంపిణీపై వివరాలు ఇవ్వాలన్న హైకోర్టు - HC on Input Subsidy Funds

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 8, 2024, 9:10 AM IST

thumbnail
పథకాల నిధుల విడుదలపై అత్యవసర విచారణ- అత్యవసర పంపిణీపై వినతి ఇవ్వాలన్న హైకోర్టు (ETV Bharat)

EC Report to High Court on Input Subsidy Funds: ఎన్నికలు పూర్తయ్యేవరకు రైతులకు పెట్టుబడి రాయితీ, విద్యాదీవెన, చేయూత పథకాల కింద నిధుల విడుదలకు అనుమతి నిరాకరిస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు మంగళవారం అత్యవసరంగా విచారణ జరిపింది. ఈసీ తరఫు సీనియర్ న్యాయవాది అవినాశ్‌ దేశాయ్‌ వాదనలు వినిపించారు. ఎన్నికల నియమావళికి లోబడి నిధుల విడుదల వాయిదా నిర్ణయం తీసుకున్నామన్నారు. పెట్టుబడి రాయితీ నిధులను తక్షణం పంపిణీ చేయకపోతే అవి మురిగిపోతాయని పిటిషనర్లు, రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న కారణం సహేతుకంగా లేదన్నారు.

ఈ నెల 13న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ తర్వాత నిధులను పంపిణీ చేయొచ్చన్నారు. అత్యవసరంగా ఎందుకు పంపిణీ చేయాలనుకుంటున్నారో కారణాలను పేర్కొంటూ వినతి ఇస్తే 24గంటల్లో నిర్ణయం తీసుకొని కోర్టుకు చెబుతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్‌ సైతం వెంటనే వినతి ఇస్తామన్నారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు విచారణను గురువారానికి వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వినతిపై ఎన్నికల ప్రవర్తన నియమావళికి లోబడి నిర్ణయం తీసుకొని ఆ వివరాలను కోర్టుకు చెప్పాలని ఈసీని ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి. కృష్ణమోహన్‌ ఈమేరకు ఉత్తర్వులు ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.