రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి : సీఈవో మీనా
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 19, 2024, 12:46 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/19-02-2024/640-480-20785402-thumbnail-16x9-cc-cameras-in-police-stations.jpg)
CC Cameras in Police Stations: రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ టీవీ కెమెరాల ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి సూచించారు. దేశవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ టీవీ కెమెరాలు పెట్టాలని, 2020 డిసెంబర్ 2న సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు అమలయ్యేలా చూడాలని సీఈసీకి ఏపీ టుమారో అధ్యక్షుడు నల్లమోతు చక్రవర్తి గతేడాది డిసెంబర్లో లేఖ రాశారు. ఆ ఫిర్యాదును ప్రస్తావిస్తూ డీజీపీకి మీనా ఈ సిఫార్సు చేశారు.
ఏపీ ప్రభుత్వం పోలీసులను రాజకీయ కక్షలకు వాడుకుంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని నలమోతు చక్రవర్తి అంతకుముందు సీఈసీ ఎంకే మీనాకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజల హక్కులు కాపాడాల్సిన పోలీసులే ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్నారని తెలిపారు. 41ఏ నోటీసులు ఇవ్వాల్సిన కేసుల్లోనూ ప్రభుత్వ ఆదేశాల మేరకు చట్టవిరుద్ధంగా పౌరులను, ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురిచేస్తున్నారని అన్నారు. ఎంపీ రఘురామకృష్ణరాజు, అంకబాబు పట్ల పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారని గుర్తు చేశారు. ఈ తరుణంలో సార్వత్రిక ఎన్నికలు పారదర్శకంగా జరగాలంటే సుప్రీంకోర్టు ఆదేశాల అమలు అత్యంత అవసరమని నల్లమోతు చక్రవర్తి పేర్కొన్నారు.