ETV Bharat / state

తక్కువ వ్యవధిలో పరీక్షలకు సన్నద్ధత ఎలా? - ప్రభుత్వ తీరుపై నిరుద్యోగుల ఆగ్రహం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 10, 2024, 9:26 AM IST

YSRCP Govt Neglecting Unemployed: డీఎస్సీ, గ్రూప్ ఉద్యోగాల భర్తీకి వైసీపీ సర్కార్‌ అనుసరిస్తోన్న విధానం నిరుద్యోగులు, చిరుద్యోగుల పాలిట శాపంగా మారింది. యువత భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేసేలా జగన్‌ ప్రభుత్వం తమ రాజకీయ లబ్ధి కోసం హడావుడిగా ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసి, అంతే హడావుడిగా పరీక్షలు నిర్వహించాలని చూస్తోందని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. అత్తెసరు పోస్టులు విడుదల చేసిందే కాకుండా, పరీక్షలకు సిద్ధమయ్యేందుకు కనీసం సమయం ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. పరీక్షల సన్నద్ధతకు సమయం ఇచ్చి డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని నిరుద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు.

YSRCP_Govt_Neglecting_Unemployees
YSRCP_Govt_Neglecting_Unemployees

తక్కువ వ్యవధిలో పరీక్షలకు సన్నద్ధత ఎలా సాధ్యం - ప్రభుత్వ తీరుపై నిరుద్యోగుల ఆగ్రహం

YSRCP Govt Neglecting Unemployed: వైసీపీ అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ, గ్రూప్ 1, గ్రూపు 2 సహా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తానని, ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని గత ఎన్నికల్లో ఆర్భాటంగా చెప్పిన జగన్, ఆ హామీలను గాలికొదిలేశారు. అధికార పీఠమెక్కగానే మాట మడతేసి ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కారు. ఫలితంగా డీఎస్సీ సహా గ్రూప్ ఉద్యోగాల కోసం నాలుగున్నరేళ్లుగా నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేయాల్సిన దుస్ధితి దాపురించింది.

రాబోయే ఎన్నికల్లో నిరుద్యోగుల ఆగ్రహానికి కొట్టుకుపోతామని భావించిన సీఎం జగన్, అత్తెసరు పోస్టులతో ఆగమేఘాలపై డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. రాష్ట్రంలో 20 వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీలున్నా కేవలం 6 వేల వంద పోస్టులు ప్రకటించి మ.మ. అనిపించారు. గ్రూప్ ఉద్యోగాల్లో వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయినా కూడా 81 పోస్టులతో గ్రూప్ 1 , కేవలం 897 పోస్టులతో గ్రూప్ 2 నోటిఫికేషన్లు జారీ చేశారు. ఇది చాలదన్నట్లు అభ్యర్థులకు కనీసం పరీక్షలకు సిద్ధమయ్యేందుకు సరిపడా సమయం ఇవ్వకుండా పరీక్ష తేదీలను ఖరారు చేయడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు.

గందరగోళం ఎక్కువ-సమయం తక్కువ! ఏపీ సర్కార్ జారీ చేసిన టెట్‌ నోటిఫికేషన్‌పై అభ్యర్థుల్లో ఆందోళన!

గత ప్రభుత్వం ఏపీపీఎస్సీ గ్రూప్ 1, 2 నోటిఫికేషన్ ప్రకటన చేశాక, పరీక్షకు సన్నద్ధమయ్యేందుకు 5 నెలలకుపైగా సమయం ఇచ్చింది. ఈలోపు అభ్యర్థులంతా కోచింగ్ కేంద్రాలకు వెళ్లి సంసిద్ధులవ్వడంతో చాలా మంది ప్రయోజనం పొందారు. గతేడాది డిసెంబర్ 7, 8 తేదీల్లో గ్రూప్ 1, 2 నోటిఫికేషన్లను విడుదలచేసిన వైసీపీ సర్కారు గ్రూప్ 2 పరీక్షకు కేవలం 79 రోజులు మాత్రమే గడువిచ్చింది. గ్రూప్ 2 పరీక్షను ఈ నెల 25 న , గ్రూప్ 1 పరీక్షను మార్చి 17 న నిర్వహించాలని ప్రకటించింది. పైగా ఈసారి సిలబస్​లోనూ మార్పులు చేశారు.

దీనిపై ఏపీపీఎస్సీ నుంచి స్టడీ మెటీరియల్ సైతం విడుదల చేయలేదు. దీంతో సిలబస్ కోసం ప్రైవేటు పబ్లిషర్లనే అభ్యర్థులు నమ్ముకోవాల్సిన దుస్ధితి ఏర్పడింది. మారిన సిలబస్ ప్రకారం పరీక్షలకు సిద్ధమయ్యేందుకు కనీసం 4 నుంచి 5 నెలల సమయమైనా కావాలని అప్పటివరకు పరీక్షను వాయిదా వేయాలని వేలాది మంది నిరుద్యోగులు ఏపీపీఎస్సీని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. 5 లక్షల మంది నిరుద్యోగులకు న్యాయం చేసేలా పరీక్షను వాయిదా వేయాలని ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్​కు ముగ్గురు ఎమ్మెల్సీలు సైతం లేఖ రాశారు.

హడావుడిగా డీఎస్సీ నోటిఫికేషన్​ విడుదల చేశారు: నిరుద్యోగుల ఆందోళన

ఉద్యోగాల భర్తీపై ముందస్తుగా ప్రకటన చేయకుండా నోటిఫికేషన్లు ఇవ్వడంతో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు సహా వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తోన్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర నిరుత్సాహానికి లోనయ్యారు. సాధారణంగా ఏ ప్రభుత్వమైనా తొలుత ఉన్నతస్థాయి పోస్టులను భర్తీ చేశాకే తరువాత స్థాయి పోస్టులను భర్తీ చేస్తుంది. వైసీపీ ప్రభుత్వం తనదైన రివర్స్‌ పాలనతో ముందుగా గ్రూప్ 3 స్థాయి పోస్టులైన గ్రామ వార్డు సచివాల ఉద్యోగాల భర్తీకి ప్రకటన ఇచ్చింది.

దీంతో గ్రూప్ 1, 2, డీఎస్సీ కోసం సిద్ధమవుతోన్న వేలాది మంది నిరుద్యోగులు తప్పనిసరి పరిస్ధితుల్లో గ్రామ, వార్డు సచివాలయం పోస్టులకు దరఖాస్తు చేసి ఉద్యోగానికి ఎంపికయ్యారు. నాలుగున్నరేళ్లు నాన్చి తీరా ఎన్నికల సమయానికి గ్రూప్, డీఎస్సీ పోస్టుల ప్రకటన రావడంతో తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. ఇప్పటికే గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకు ఎన్నికల విధులు అప్పగించి, సెలవులు లేవని చెప్పేశారు. దీంతో పరీక్షలకు సన్నద్ధమయ్యే పరిస్థితి లేదని అభ్యర్థులు వాపోతున్నారు. ప్రభుత్వం పునరాలోచించి పరీక్షలను 4 నెలలపాటు వాయిదా వేయాలని కోరుతున్నారు.

సాధారణంగా టెట్ ఫలితాలు విడుదల చేశాకే డీఎస్సీ దరఖాస్తులు తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దీనివల్ల అభ్యర్థులు ముందుగా టెట్ పరీక్షకు సిద్ధమయ్యి, తదుపరి డీఎస్సీ సిలబస్‌కు సన్నద్ధమయ్యేవారు. తద్వారా టెట్ లో మంచి మార్కులు సాధించడమే కాకుండా డీఎస్సీలో సత్తా చూపేందుకు అవకాశం ఉంటుంది. ఇవేమి పట్టని వైసీపీ సర్కారు తక్కువ వ్యవధిలో టెట్‌, డీఎస్సీ నిర్వహించేలా ప్రణాళిక చేసింది. దీంతో డీఎస్సీ అభ్యర్థులంతా తీవ్ర గందరగోళంతో మథన పడుతున్నారు.

'నాడు మెగా - నేడు దగా' - ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.