ETV Bharat / state

వైఎస్సార్సీపీ ఓట్ల ఎర- విందు భోజనాలు, బహుమతుల పంపిణీ

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 12, 2024, 1:21 PM IST

YSRCP Gifts To Voters at Vijayawada : ఓటర్లను ప్రభావితం చేయగలిగే అవకాశం ఉన్న వాళ్లెవరినీ వైఎస్సార్సీపీ నేతలు వదలడం లేదు. తప్పనిసరి సమావేశాలంటూ పిలవడం విందు భోజనాలు పెట్టడం ఇంటికి వెళ్లేటప్పుడు కుక్కర్లు, మిక్సీలు, గ్రైండర్లు, స్మార్ట్‌వాచ్‌లు, చీరలు లాంటి తాయిలాల బాక్సులతో ఉన్న సంచులను చేతిలో పెట్టడం. వాటితో పాటు ఓ చిన్న కవర్‌లో డబ్బులు పెట్టి అందించటం. కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ ఇంఛార్జ్‌ల ఆధ్వర్యంలో నిత్యం జరుగుతున్న తంతు ఇది.

ysrcp_gifts_to_voters_at_vijayawada
ysrcp_gifts_to_voters_at_vijayawada

YSRCP Gifts To Voters at Vijayawada : కనీసం ఓ పది మంది ఓటర్లను ప్రభావితం చేయగలిగే అవకాశం ఉందనే ఏ వర్గాన్ని వైఎస్సార్సీపీ నేతలు వదిలిపెట్టడం లేదు. వాలంటీర్లు, డ్వాక్రా రిసోర్స్‌పర్సన్‌లు, డ్వాక్రా మహిళలు, పాస్టర్లు, సామాజిక మాధ్యమాల ఇన్‌ఫ్లుయెన్సర్ల జాబితాలను రూపొందించారు. రోజుకొక వర్గానికి సత్కారాల పేరుతో సమావేశాలు పెడుతూ తమకు ఈ ఎన్నికల్లో ఓట్లను కురిపించాలంటూ ప్రాధేయపడుతున్నారు. అనంతరం వారి చేతిలో తాయిలాలు (Gifts) పెట్టి పంపిస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వం నుంచి వేతనాలు తీసుకునే ఏ ఉద్యోగిని కానుకలతో ప్రలోభాలకు గురిచేయడానికి వీల్లేదు. ఓటర్లను కూడా ప్రభావితం చేసేలా కానుకలను పంచకూడదు. కానీ వైఎస్సార్సీపీ రాజ్యంలో ఈ నిబంధనలన్నీ అటకెక్కాయి. వైఎస్సార్సీపీ (YSRCP) నేతలు తాయిలాలతో విజృంభిస్తున్నారంటూ ప్రత్యక్ష నిదర్శనాలతో సహా వెలుగు చూస్తున్నా అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా ఎలాంటి అడ్డుకట్టపడకపోగా ఆయా ప్రతినిధులకు హెచ్చరికలు కూడా జారీచేయటంలేదు.

ఈ తాయిలాలు మీకు, మీ ఓట్లు మాకు: ఎమ్మెల్యే అనిల్ కుమార్

MLA Anil Kumar Gifts To people at Pamarru : దర్జాగా పెనమలూరు, విజయవాడ పశ్చిమ, మధ్య, మైలవరం, పామర్రు, గన్నవరం సహా చాలా నియోజకవర్గాల్లో గుట్టలకొద్దీ కుక్కర్లు, మిక్సీలు, చీరలు, దుస్తులు, స్మార్ట్‌వాచ్‌లను కొనుగోలు చేసి మినీ లారీల్లో తీసుకొచ్చి మరీ బహిరంగంగా పంపిణీ చేస్తున్నారు. రెండు జిల్లాల్లోని పెనమలూరు, విజయవాడ మధ్య నియోజకవర్గాల్లో మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఈ తాయిలాల సంస్కృతి ఆరంభమైంది. క్రమంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రస్తుతం ఇదే పంథా కొనసాగుతోంది. అవసరం లేకపోయినా ఓ నమూనా చెక్కు ఇచ్చేందుకు ప్రభుత్వం డబ్బులతో ఏర్పాటు చేసిన సభలకు వేలాది మంది మహిళలను బలవంతంగా రప్పించి ఫ్యాన్‌ గుర్తుకే ఓటు వేయాలంటూ ప్రచారం చేసుకున్నారు. సభ ముగిశాక బిర్యానీ, చికెన్‌తో విందు భోజనాలు ఏర్పాటు చేసి అదికూడా తమ గొప్పతనం అన్నట్టుగా ప్రచారం చేసుకున్నారు.

ఓటర్లకు వైఎస్సార్సీపీ నేతల తాయిలాలు - ఓటరు కార్డు, ఆధార్​ చూసి మరీ పంపిణీ

YSRCP Leaders Distributing Gifts to People : పెనమలూరులో వాలంటీర్లకు కుక్కర్లు, చీరలు, ఫ్లాస్కులు, హాట్‌బాక్సులతో కూడిన సంచులను అందజేశారు. పాస్టర్లతోనూ సమావేశాలు పెట్టి గృహోపకరణాలు, దుస్తులు ఇచ్చి, చేతిలో నగదు కవర్లను పెట్టారు. తాజాగా ఆదివారం కూడా సామాజిక మాధ్యమాల ఇన్‌ఫ్లుయెన్సర్లను పిలిచి సమావేశం నిర్వహించి భోజనం పెట్టి చేతిలో తాయిలాల సంచి ఉంచారు. మైలవరంలో 5 వేల రూపాయలు నగదు కవరు, దుస్తులు, స్వీటు బాక్సులు వాలంటీర్లకు ఇచ్చారు. విజయవాడ మధ్య, పశ్చిమ నియోజకవర్గాల్లో వాలంటీర్లు, రిసోర్స్‌పర్సన్‌లకు కుక్కర్లు, చీరలు ,నగదు కవర్లు, స్మార్ట్‌వాచ్‌లు గోప్యంగా అందిస్తున్నట్టు తెలిసింది. తాజాగా పామర్రులోనూ తాయిలాల పంపిణీ ఆరంభమైంది.

వైఎస్సార్సీపీ ఓట్ల ఎర- విందు భోజనాలు, బహుమతుల పంపిణీ

ఎన్నికల షెడ్యూల్‌కు ముందే వైసీపీ ప్రలోభాలు - చిల్లర తాయిలాలతో కుల, మత సంఘాలకు ఎర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.