ETV Bharat / state

జగన్​కు అమరావతిపై తగ్గని కసి - మరింత దెబ్బతీసేందుకు ప్రణాళికలు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 15, 2024, 9:37 AM IST

YCP Govt Withdraws Amaravati Land Acquisition Announcement: ఐదేళ్లపాటు ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకుండా అమరావతిని అడవిలా మార్చేసిన వైసీపీ ప్రభుత్వానికి ఇంకా రాజధాని ప్రాంతంపై కసి చావలేదు. ఇప్పటికే పరిహారం మంజూరైన, రోడ్లకు కేటాయించిన భూములను సేకరణ నుంచి ఉపసంహరించేందుకు పన్నాగం పన్నుతోంది. రాజధాని బృహత్ ప్రణాళికను ఛిన్నాభిన్నం చేసేందుకు ఎత్తుగడ వేస్తోంది.

amaravati_land_acquisition
amaravati_land_acquisition

జగన్​కు అమరావతిపై తగ్గని కసి - మరింత దెబ్బతీసేందుకు ప్రణాళికలు

YCP Govt Withdraws Amaravati Land Acquisition Announcement: రాజధాని అమరావతిని పూర్తిగా దెబ్బతీసిన జగన్‌కు ఇంకా ఆ ప్రాంతంపై పగ చల్లారినట్లు లేదు. రాజధాని బృహత్‌ ప్రణాళికను దెబ్బతీసేందుకు కొత్త ఎత్తుగడలు వేస్తోంది. ఇందులో భాగంగా హడావుడిగా రాజధాని పరిధి గ్రామాల్లోని భూసేకరణ ప్రకటనను వెనక్కి తీసుకుంది. ఇప్పటికే 21 రెవెన్యూ గ్రామాలకు చెందిన 625 ఎకరాలకు గత ప్రభుత్వం జారీ చేసిన భూసేకరణ ప్రకటనను ఉపసంహరించారు. తాజాగా తాడేపల్లి మండలం ఉండవల్లలో 280 మంది రైతులకు చెందిన 113 ఎకరాలను సేకరించేందుకు ఇచ్చిన నోటీసులను కూడా ఉపసంహరిస్తూ గుంటూరు జిల్లా కలెక్టర్‌ గెజిట్‌ విడుదల చేశారు. దీంతో భూసేకరణ నుంచి ఉపసంహరించిన విస్తీర్ణం 738 ఎకరాలకు చేరింది. ఈ చర్య చట్టవిరుద్ధమని, దీనిని హైకోర్టులో సవాలు చేసేందుకు రాజధాని రైతులు సమాయత్తమవుతున్నారు.

సీఆర్‌డీఏ, జీఏడీ మధ్య చట్టవిరుద్ధ ఒప్పందం - బ్యాంకర్లతో కుమ్మక్కు - గుట్టుగా సంతకాలు

రాజధానిని మరింత దెబ్బతీసేందుకు: ఎన్నికల ప్రకటన వచ్చేలోపు రాజధానిని మరింతగా దెబ్బతీసేందుకు సీఎం జగన్‌ ప్రభుత్వం మరో పన్నాగానికి తెరలేపింది. గత ప్రభుత్వ హయాంలోనే భూసేకరణ ప్రక్రియలో పరిహారం మంజూరైన భూములను, మాస్టర్‌ ప్లాన్‌లోని రోడ్లు, ఇతర మౌలిక వసతుల కోసం కేటాయించిన భూములను కూడా ప్రకటన నుంచి ఉపసంహరించేందుకు ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. మాస్టర్‌ ప్లాన్‌ పూర్తిగా దెబ్బతీసేలా జగన్ పావులు కదుపుతుండటంపై రాజధాని గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రాజధానిని నిర్మించగలిగిన రాజకీయ పార్టీనే అధికారంలోకి రావాలి: అమరావతి రైతులు

పరిహారం మంజూరైనా: గత ప్రభుత్వం సేకరించిన 191.62 ఎకరాలకు పరిహారం సైతం మంజూరైంది. మాస్టర్‌ ప్లాన్‌, రోడ్ల కోసం 217.76 ఎకరాలు కేటాయించారు. గుంటూరు కలెక్టర్‌ ఇటీవల విడుదల చేసిన గెజిట్‌లో వీటి జోలికి వెళ్లలేదు. కానీ ఉన్నట్టుండి ఈ రెండు రకాల భూములనూ సేకరణ నుంచి తప్పించనున్నారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఇదంతా చట్టవిరుద్ధమని తెలిసినా సీఆర్డీఏ అధికారులు దీనికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రోడ్లు, మౌలిక సదుపాయాలకు, పరిహారం మంజూరైన భూములను సేకరణ ప్రకటన నుంచి ఉపసంహరించడం చట్టవిరుద్ధం. బృహత్‌ ప్రణాళికను దెబ్బతీసే చర్యలు తీసుకోకూడదు.

బ్యాంకులను బురిడీ కొట్టించేందుకు సిద్ధమైన జగన్‌ సర్కార్ - కట్టుకథలు చెప్పాలంటూ అధికారులపై ఒత్తిడి

ఖర్చంతా ప్రభుత్వమే భరించాలి: మాస్టర్‌ ప్లాన్‌ రోడ్లను ఆ పరిధి నుంచి ఉపసంహరించడం వల్ల రైతుల ప్లాట్లకు అనుసంధానత దెబ్బతింటోంది. అయితే భూసేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వం భూసేకరణ ప్రకటనను ఉపసంహరించుకుంటే అప్పటి వరకు రైతుకు జరిగిన నష్టం, నోటీసు వల్ల రైతులు ఎదుర్కొన్న పరిణామాలకు, ఆ ప్రకటనను కోర్టులో సవాలు చేసినందుకు అయిన ఖర్చులను ప్రభుత్వమే చెల్లించాలి. ఈ నేపథ్యంలో కోర్టులో పెండింగ్‌లో ఉన్న వ్యాజ్యాలను రైతులు ఉపసంహరించుకుంటే వారికి ప్రభుత్వం నష్టపరిహారం ఎంత వరకు చెల్లిస్తుందన్నది అనుమానమే. చట్టవ్యతిరేకమని తెలిసినా, రాజధాని నిర్మాణానికి నష్టం కలిగించే పనుల్లో ఉన్నతాధికారులు చురుగ్గా వ్యవహరిస్తున్నారు. దీనికి సహకరించిన వారు భవిష్యత్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుందని రాజధాని రైతులు హెచ్చరిస్తున్నారు. వార్షిక కౌలు జమ చేయడానికి అధికారులకు చేతులు రావడం లేదు కానీ రాజధాని బృహత్‌ ప్రణాళికను చెడగొట్టడానికి మాత్రం ముందుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.