ETV Bharat / state

ఇసుక అక్రమ రవాణాపై టీడీపీ-జనసేన ఆందోళనలు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 24, 2024, 10:05 PM IST

TDP Janasena agitation programs: ఇసుక అక్రమ రవాణాపై టీడీపీ-జనసేన నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అక్రమంగా తరలిస్తున్న ఇసుక వాహనాలను అడ్డుకున్నారు. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం దొంపాకలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను మాజీ ఎమ్మెల్యే రమణమూర్తి అడ్డుకున్నారు.

TDP Janasena agitation programs
TDP Janasena agitation programs

TDP Janasena agitation programs: అధికార వైఎస్సార్సీపీ ఇసుక అక్రమాలకు అడ్డు అదుపూ లేకుండా పోతుంది. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మళ్లీ తమ ప్రభుత్వం వస్తుందో లేదో అన్న సందేహంలో వైఎస్సార్సీపీ నేతలు దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కబెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అధికార పార్టీ నేతల అక్రమాలను నిత్యం ప్రశ్నిస్తూ ప్రతిపక్ష పార్టీలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అక్రమ ఇసుక కార్వీల వద్దకు వెళ్లి ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. చర్యలు తీసుకోవాలంటూ అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు.

ఎన్టీఆర్ జిల్లా రాష్ట్రంలో విచ్చలవిడిగా అక్రమ ఇసుక రవాణాన్ని జరుగుతుందని జనసేన-టీడీపీ నేతలు ఆరోపించారు. ప్రభుత్వం ఇసుక అక్రమ రవాణాను వెంటనే అరికట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజలతో కలిసి గ్రామాల్లో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఇసుక అక్రమ రవాణాపై టీడీపీ నేత శ్రీరాం రాజగోపాల్ తాతయ్య ఆధ్వర్యంలో టీడీపీ-జనసేన నేతలు ఆందోళన కార్యక్రమాలు చేప్టటారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చింది మొదలు ఇసుక, మద్యం ద్వారా వేల కోట్లు సంపాదించిందని తాతయ్య ఆరోపించారు. అక్రమంగా సంపాదించిన డబ్బులనే రాబోయే ఎన్నికల్లో ఖర్చు పెడతారంటూ ఆరోపించారు. గత టీడీపీ ప్రభుత్వంలో ప్రజలకు ఉచితంగా ఇసుక పంపిణీ చేస్తే, ఈ ప్రభుత్వంలో పేద ప్రజలకు ఇసుక అందని ద్రాక్షగా మారిందని ఆరోపించారు. ఇసుక అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం, న్యాయస్థానాలు మొట్టికాయ వేసినా ప్రభుత్వానికి బుద్ధి రాలేదని విమర్శించారు.

అడుగుపెడుతూనే అక్రమార్జనలో వైసీపీ కీలక నేత లీనం - 'ఎన్నికల ఫండ్‌' పేరుతో వసూళ్లు

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం మినగల్లు ఇసుక రీచ్​లో అక్రమ తవ్వకాలు ఆపాలంటూ జనసేన ఆందోళన కార్యక్రమం నిర్వహించింది. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా కొల్లగొడుతున్నారని జనసేన నేత కిషోర్ ఆరోపించారు. జిల్లా వ్యాప్తంగా విచ్చలవిడిగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని పేర్కొన్నారు. ఇసుక అక్రమాలపై అధికారులను ప్రశ్నిస్తే అనుమతులు ఉన్నాయని అంటున్నారని, కానీ అందుకు సంబంధించిన పత్రాలు మాత్రం చూపడం లేదని మండిపడ్డారు. ఇసుక రవాణాకు అనుమతులు చూపించాలంటూ జనసేన నేతలు పట్టుబట్టండంతో, రీచ్ నిర్వాహకులకు, జనసేన నాయకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం దొంపాకలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను మాజీ ఎమ్మెల్యే రమణమూర్తి అడ్డుకున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలను చేస్తుండటంపై ఆయన అభ్యంతరం తెలిపారు. టీడీపీ శ్రేణులతో కలిసి ఇసుక రీచ్‌ల వద్ద నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ అండతోనే ఇసుక మాఫియా పేట్రేగి పోతుందని ఆయన విమర్శించారు. ఇంత జరుగుతున్నా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రమణమూర్తి ప్రశ్నించారు.

50 వేల కోట్లు లూటీ - ఇసుక దోపిడీపై టీడీపీ, జనసేన ఆందోళనలు: అచ్చెన్నాయుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.