ETV Bharat / state

మేకతోటి సుచరిత అనుచరుల అక్రమాలు - దేశం దృష్టికి తెచ్చేందుకు బొటన వేలు నరుక్కున్న మహిళ - Lakshmi Cuts Off Thumb of Left Hand

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 23, 2024, 9:09 AM IST

Finger Chopping Protest in Delhi
Finger Chopping Protest in Delhi

Finger Chopping Protest in Delhi: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత అనుయాయుల అరాచకాలపై దిల్లీలో ఫిర్యాదు చేసేందుకు తన బృందంతో కలిసి దిల్లీ వెళ్లిన ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీలక్ష్మి తన వేలును నరుక్కోవడం కలకలం రేపింది. శ్రీలక్ష్మి చంద్రబాబు, నారా లోకేశ్ అండగా నిలిచారు. జగన్‌కు వేలుతో ఓటేసి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

Finger Chopping Protest in Delhi : మాజీ హోంమంత్రి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత అనుయాయుల అరాచకాలపై దిల్లీలో ఫిర్యాదు చేసేందుకు తన బృందంతో కలిసి దిల్లీ వెళ్లిన ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీలక్ష్మి తన వేలును నరుక్కోవడం కలకలం రేపింది. ఎమ్మెల్యే అనుచరుల ఆగడాలు దేశ ప్రజల దృష్టికి తెచ్చేందుకు ఆమె ఈ విధంగా చేశారు. ఈ ఘటన ఆదివారం దిల్లీలో జరిగింది. దీనికి సంబంధించి బాధితురాలి కథనం ఇలా ఉంది.

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ అధికార పార్టీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత అనుయాయులు కొందరు గుంటూరు నగర శివారు స్వర్ణభారతినగర్‌, అడవితక్కెళ్లపాడు పరిధిలో భూదందాలకు పాల్పడ్డారు. పేదల భూములకు నకిలీ హక్కు పత్రాలు సృష్టించి విక్రయిస్తూ అసలైన హక్కుదారులను రోడ్డున పడేశారు. వారి అన్యాయాలను స్థానికంగా ఉన్న ఆదర్శ మహిళా మండలి సభ్యులు ప్రశ్నించి కలెక్టర్‌, ఎస్పీ, డీజీపీ, సీఐడీ విభాగాలకు ఫిర్యాదు చేశారు. వాటిపై వారు స్పందించకపోగా తిరిగి శ్రీలక్ష్మిపైనే కేసులు పెట్టారు. దీంతో ఆమె కొందరు మహిళలతో కలిసి రాష్ట్రపతి, ప్రధాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేయడానికి దిల్లీ వెళ్లారు. ఆయా కార్యాలయాలకు వెళ్లి ఆమె వినతిపత్రాలు అందజేశారు. అలాగే ఈ వ్యవహారం దేశం దృష్టిని ఆకర్షించాలని నిర్ణయించుకుని శ్రీలక్ష్మి తన ఎడమ చేతి బొటన వేలును నరుక్కున్నారు. అనంతరం రాష్ట్రపతి భవన్‌ ముందు సెల్ఫీ వీడియో తీసుకుని నియోజకవర్గంలో చోటు చేసుకున్న భూకబ్జాలు, దందాలు, గంజాయికి బానిసలవుతున్న యువత పరిస్థితిని తెలియజేశారు.

సొంత బాబాయ్‌నే చంపిన వారు- వేలు కోసుకుంటే స్పందిస్తారా: లోకేశ్​ - Lokesh Reaction on Kovuru Lakshmi

ఫోర్జరీ చేసి అక్రమాలు : స్వర్ణ భారతినగర్‌, అడవితక్కెళ్లపాడులో పేద ప్రజలు ఎక్కువగా నివాసం ఉంటారు. గతంలో ఇక్కడ పలు సందర్భాల్లో పేదలకు ప్రభుత్వం స్థలాలు కేటాయించింది. స్థలాలు పొందిన వారిలో కొందరు అక్కడ ఉండడం లేదు. ఇలాంటి వారి స్థలాలను కబ్జా చేసి నకిలీ హక్కు పత్రాలతో విక్రయిస్తున్నారని, ఈ అన్యాయాలపై ప్రశ్నిస్తే తనను సుచరిత అనుయాయులు లక్ష్యంగా చేసుకున్నారని, అధికారం వినియోగించి తనపైనే పోలీసులకు లేనిపోనివి చెప్పి ఎదురుకేసులు పెట్టించారని శ్రీలక్ష్మి తెలిపారు. వీరి అక్రమాలకు కొందరు రెవెన్యూ అధికారుల సహకారం ఉందని చెప్పారు. అందుకే దేశం దృష్టికి సుచరిత అనుయాయుల అరాచకాలను తీసుకెళ్లాలని భావించి దిల్లీ వెళ్లి ఆదివారం బొటన వేలిని నరుక్కున్నట్లు తెలిపారు.

ఎమ్మెల్యే అనుచరులైన మేరీ, వెంకట్‌, నాగులు, మోహన్‌ అక్కడ జరిగే అక్రమాల్లో ప్రధాన భూమిక పోషిస్తున్నారని ఆమె ఆరోపించారు. వీరే అధికారుల సంతకాలు, స్టాంపులు ఫోర్జరీ చేసి అక్రమాలకు పాల్పడుతున్నారని వివరించారు. స్వర్ణ భారతినగర్‌లో నివాసం ఉంటున్నానని, అక్కడ జరిగే ప్రతి అన్యాయం, అరాచకం తనకు తెలుసని అన్నారు. ఇతరులు ఎవరూ అక్కడ ఉండలేని పరిస్థితి నెలకొందని, గంజాయి విక్రయాల్లో కూడా సుచరిత అనుచరులదే కీలక ప్రాత అని ఆరోపించారు.

చెరువు తవ్వకం పేరుతో భూ ఆక్రమణకు వైసీపీ నేతల యత్నం-అడ్డుకున్న దళిత రైతులు

వేలుతో ఓటేసి జగన్‌కు బుద్ధి చెప్పండి : 'ప్రజలారా! మీ వేళ్లు కోసుకోవడం కాదు. రేపటి ఎన్నికల్లో అదే వేలితో బటన్‌ నొక్కి, సీఎం జగన్‌కు బుద్ధి చెప్పండి' అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రానికి చెందిన మహిళ వేలు కోసుకున్న ఘటనపై సోమవారం ట్విటర్ వేదికగా (X) వేదికగా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

బాబాయినే హతమార్చిన వారు - వేలు కోసుకుంటే స్పందిస్తారా?: వైఎస్సార్సీపీ అరాచకాలు, అవినీతిపై దిల్లీలో పోరాడుతున్న ఉద్యమకారిణి కోవూరు లక్ష్మీకి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అభినందించారు. లక్ష్మి వేలు కోసుకోవడంపై నారా లోకేశ్ స్పందించారు. సొంత బాబాయ్‌ని హతమార్చిన వారు. మీరు వేలు కోసుకుంటే మాత్రం స్పందిస్తారా అని అన్నారు. వైసీపీ పాలనపై నిరసన తెలియజేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయని సూచించారు. ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని కోరారు. వైసీపీ అసుర పాలనను అంతం చేయడానికి కలిసి పోరాడుదామని పిలుపునిచ్చారు. బాధితురాలు విడుదల చేసిన వీడియోను లోకేశ్‌ తన ట్విటర్​లో (X) ఖాతకు జోడించారు.

ఎమ్మెల్యే సుచరితకు నిరసన సెగ - తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నిలదీసిన మహిళలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.