Polling Materials And EVM Machines Distribution For Voting To Polling Stations : సార్వత్రిక ఎన్నికల నిర్వాహణకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ వద్దకు పోలింగ్ సిబ్బంది చేరుకున్నారు. ఎన్నికల అధికారులు సెక్టార్ల వారీగా సిబ్బందికి కేటాయించిన పోలింగ్ కేంద్రాల విధులను అప్పగించారు. ఈవీఎమ్లు ఇతర ఎన్నికల సామాగ్రి, సిబ్బందిని పోలీసు బందోబస్తుతో పోలింగ్ కేంద్రాలకు అధికారులు తరలిస్తున్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా : అల్లూరి సీతారామరాజు జిల్లాలో అరకు, పాడేరు, రంపచోడవరంలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పాడేరు డిగ్రీ కళాశాల వద్ద పోలింగ్ సిబ్బంది నియామక పత్రాలు గురించి క్యూ కట్టారు. దూరప్రాంత పోలింగ్ బూత్ సిబ్బందికి ముందుగానే సామాగ్రిని పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. పాడేరు రిటర్నింగ్ అధికారి భావన ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లా : ఎన్టీఆర్ జిల్లా నందిగామ కాకాని వెంకటరత్నం కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఉదయాని కల్లా వేర్వేరు ప్రాంతాల నుంచి పోలింగ్ సిబ్బంది తరలివచ్చారు. నియోజకవర్గంలో 25 సెక్టార్లు, 23 రూట్ లను ఏర్పాటు చేశారు. సెక్టార్ వారిగా పోలింగ్ సిబ్బందికి కేటాయించిన పోలింగ్ కేంద్రాల విధులను అప్పగించారు. నియోజకవర్గంలోని 2వందల 22 పోలింగ్ కేంద్రాలకు గాను విధుల్లో 13 వందల 83 మంది ఉద్యోగులు పాల్గొననున్నారు. అదనంగా మరో 150 మంది సిబ్బందిని రిజర్వులో ఉంచారు. పోలీస్ బందోబస్తుతో ఎన్నికల సిబ్బందిని ఈవీఎం యంత్రాలను పోలింగ్ కేంద్రాలు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
జిల్లాలోని తిరువూరులో జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రానికి సిబ్బంది చేరుకున్నారు.
నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 2వంద34 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహణకు అవసరమైన సామాగ్రిని ఆర్ఓ మాధవి పంపిణీ చేస్తున్నారు.
గన్నవరం : ఎన్నికల నిర్వహణ సామగ్రి పంపిణీతో గన్నవరంలో ఎన్నికల సందడి మొదలైంది. గన్నవరం బాలుర జడ్పీ ఉన్నత పాఠశాలలో రిటర్నింగ్ అధికారిణి గీతాంజలిశర్మ ఆధ్వర్యంలో ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశారు. నియోజకవర్గ పరిధిలోని 3వందల ఆరు పోలింగ్ కేంద్రాలకు ప్రత్యేక వాహనాల్లో రూట్ ల ఆధారంగా పోలింగ్ సిబ్బందిని, ఎన్నికల సామాగ్రిని తరలించనున్నారు. మధ్యాహ్నం నుంచి పోలింగ్ కేంద్రాలకు సామగ్రితో సిబ్బంది తరలివెళ్లేలా అన్ని ఏర్పాట్లు చేశామని ఆర్వో తెలియజేశారు.
పశ్చిమగోదావరి జిల్లా : పశ్చిమగోదావరి జిల్లా తణుకులో బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పోలింగ్ బూత్ల వారీగా కౌంటర్లు ఏర్పాటు చేసి సామాగ్రిని పంపిణీ చేశారు. పంపిణీ ప్రారంభంలో ఎవరికి ఏ విధి నిర్వహణ కేటాయించారో వారందరూ హాజరయ్యారో లేదో పరిశీలించారు. సామాగ్రి పంపిణీ చేసిన తర్వాత సిబ్బంది పరిశీలించుకునేందుకు టేబుల్లు ఏర్పాటు చేశారు. పరిశీలన పూర్తి చేసుకున్న సిబ్బంది పోలింగ్ బూతులు వారీగా తమ కేంద్రాలకు చేరుకోవడానికి బస్సులు ఏర్పాటు చేశారు.
శ్రీ సత్యసాయి జిల్లా : శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ఆర్డీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు తనిఖీ చేశారు. ఎన్నికల సామాగ్రి, సిబ్బందికి సంబంధించిన ఎటువంటి సమస్యలున్న తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు అనంతరం సెక్టార్ సెంటర్లను పరిశీలించి ఉద్యోగస్తులతో పోలింగ్ సామాగ్రి గురించి ఏమైనా సందేహాలు ఉంటే ఆర్వో వద్ద నివృత్తి చేసుకోవాలని సూచించారు.
తూర్పుగోదావరి జిల్లా : తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని మహిళా కళాశాల ఆవరణలో పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పోలింగ్ బూత్ ల వారీగా కౌంటర్లు ఏర్పాటు చేసి సామాగ్రిని పంపిణీ చేశారు. పంపిణీ ప్రారంభంలో ఎవరికి ఏ విధి నిర్వహణ కేటాయించారో వారందరూ హాజరయ్యారో లేదో పరిశీలించారు. అనంతరం సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకునేందుకు బస్సులు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్కి సంబంధించిన సామగ్రిని పంపిణీ చేశారు.
వైఎస్సార్ జిల్లా : రేపటి పోలింగ్కు వైఎస్సార్ జిల్లా సిద్ధమైంది. జిల్లాలోని పార్లమెంటుతోపాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు అధికారులు పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 16 లక్షల 39 వేల 66 మంది ఓటర్ల కోసం 2 వేల 35 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 14 వేల మందికిపైగా సిబ్బంది విధులు నిర్వహించబోతున్నారు. ఈ మేరకు కడపలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రం నుంచి మరిన్ని వివరాలను మా ప్రతినిధి సతీష్ అందిస్తారు.
బాపట్ల జిల్లా : బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు రేపు జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ మెటీరియల్ ని సిబ్బంది అందజేసేందుకు రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. అద్దంకి నియోజక వర్గంలో 298 పోలింగ్ బూత్లలో పోలింగ్ జరుగనుంది. ఈ పోలింగ్ ప్రక్రియలో సుమారు 1888 మంది సిబ్బంది పాల్గొననున్నారు. సిబ్బందికి పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన సామాగ్రిని వారికి అందించేందుకు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో కౌంటర్లను ఏర్పాటు చేసి పోలింగ్ మెటీరియల్ను అందజేస్తున్నారు. పోలింగ్ సిబ్బందిని ప్రత్యేక బస్సులలో వారి వారి గమ్య స్థానాలకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు.