No Equipments for Labs in Government Hospitals: తెలంగాణలో ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు ప్రజలకు చక్కటి ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మాత్రం నిర్ధారణ పరీక్షలు రోగులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యమే కాదు వ్యాధి నిర్ధారణ పరీక్షలూ ఖరీదైనవే. సాధారణంగా ఆరు పరీక్షలు చేయించుకోవాలనుకుంటేనే వేలల్లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వమే అన్ని రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలను ఉచితంగా చేసి వాటి ఫలితాలను సత్వరం అందిస్తే పేద, సామాన్య రోగులకు ఎంతో ఊరట కలుగుతుంది.
Medicines Shortage In Govt Hospitals: ఏపీలో ప్రభుత్వాసుపత్రుల డొల్లతనం బట్టబయలు.. పీఏజీ ఆగ్రహం..
తెలంగాణ ప్రభుత్వం సరిగ్గా అదే చేస్తోంది. పేద, సామాన్య రోగుల ప్రయోజనార్థం అక్కడి ప్రభుత్వం రోగులకు పరీక్షలను నిర్వహించేందుకు వీలుగా డయాగ్నొస్టిక్ ల్యాబ్లు, రేడియాలజీ హబ్లను ఏర్పాటు చేసింది. 134 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలను వీటి ద్వారా ఉచితంగా చేస్తూ వాటి ఫలితాలను గంటల వ్యవధిలో రోగులకు అందజేస్తోంది. ఏపీలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షల నిర్వహణ మాత్రం అస్తవ్యస్తంగా తయారైంది.
ఆంధ్రప్రదేశ్లోని ఆసుపత్రుల్లో సాధారణ వ్యాధుల నిర్ధారణ పరీక్షలే కొనసాగుతున్నాయి. అవీ అంతంతమాత్రంగానే జరుగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో మెడాల్ సంస్థ ద్వారా ఆసుపత్రుల్లో పరీక్షలు జరిగేవి. ఈ విధానాన్ని వైసీపీ సర్కారు రద్దు చేసింది. వైద్యులకు చూపించుకోవడానికి వచ్చే రోగులకు పరీక్షలు తక్కువగా చేస్తున్నారు. ఇన్పేషెంట్లకు మాత్రమే తప్పనిసరి పరిస్థితుల్లో పరీక్షలు జరుగుతున్నాయి.
చీకట్లో ప్రభుత్వ ఆసుపత్రి - సెల్ ఫోన్ వెలుతురులోనే వైద్య సేవలు
వైద్య పరీక్షలకు అవసరమైన నిధుల కేటాయింపు నిర్వహణలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. చాలా కేంద్రాల్లో ఎక్స్రే, అల్ట్రాసౌండ్ యూనిట్లు, ఇతర పరికరాలు, యంత్రాలు చెడిపోయాయి. వీటికి మరమ్మతులు చేయించడానికి నిధుల కొరత సమస్యగా మారింది. పలు కేంద్రాల్లో రసాయనాలు, కిట్స్ కొరత వేధిస్తోంది. కొన్ని ఆసుపత్రుల్లో ఇప్పటికీ థైరాయిడ్ పరీక్షలు జరగడం లేదు. ఫలితంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోని కేంద్రాల్లో సకాలంలో పరీక్షలు చేయక, ఫలితాలు రాకపోవడంతో రోగులు ప్రైవేట్ కేంద్రాలను ఆశ్రయిస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు.
వైద్యుల సిఫార్సుతో పరీక్ష చేయించుకున్న రోగులు ఫలితాలు ఎప్పుడొస్తాయో తెలియక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాటి కోసం రోజుల తరబడి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. కొన్ని ఆసుపత్రుల్లో ప్రైవేట్ వ్యక్తులు రోగుల నుంచి నమూనాలు సేకరించి బయట ఉన్న ల్యాబ్ల్లో పరీక్షలు చేయిస్తూ డబ్బులు తీసుకుని ఫలితాలు అందిస్తున్నారు. కొన్ని ప్రైవేట్ ల్యాబ్ల నిర్వాహకులు నేరుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే పోస్టర్లు, బోర్డులు ఏర్పాటు చేస్తుండటం గమనార్హం.
ఓపీ చీటీల్లో జగన్ ఫొటో- తొలగించని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ
ఏ ప్రభుత్వమైనా పెరుగుతున్న రోగుల సంఖ్యకు సరిపడా ఆసుపత్రులు, వ్యాధి నిర్ధారణ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. కానీ వైసీపీ సర్కారు అంటేనే రివర్సు కదా అవేవీ పట్టడంలేదు. ఆరోగ్య మిషన్ కింద కేంద్ర ప్రభుత్వ నిధులతో విశాఖ, విజయవాడ, తిరుపతి వంటి ప్రధాన నగరాల్లో సీటీ డయాగ్నొస్టిక్ సెంటర్ల ఏర్పాటుకు పనులు ప్రారంభించగా అవి నెలల తరబడిగా కొనసాగుతున్నాయి. రక్త, ఇతర పరీక్షలతోపాటు ఎమ్మారై, సిటీ స్కాన్ తదితరాలను చేసే బాధ్యతను ప్రైవేటు సంస్థకు అప్పగించాలని చూస్తున్నారు. ఈ మేరకు గతేడాది టెండర్లు పిలిచారు.
మంగళగిరి ఎయిమ్స్లో పరీక్షలు చేస్తున్న ఓ సంస్థ ముందుకొచ్చింది. ఇదే సమయంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు హైదరాబాద్ నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. ఆ తర్వాత పరీక్షల విషయాన్ని పక్కన పెట్టారు. ఈ మూడు నగరాల్లో సీటీ డయాగ్నొస్టిక్ సెంటర్లను ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారు? వాటి ద్వారా ఎప్పుడు పరీక్షలు నిర్వహిస్తారు? అని పేద, సామాన్య ప్రజలు దీనంగా ఎదురుచూస్తున్నారు.
శంకుస్థాపనలు సరే పూర్తిచేసేది ఎప్పుడు - ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా?
చిత్తూరులోని జిల్లా ఆసుపత్రిలో 130 వరకు వైద్య పరీక్షలు చేయాలి. వాటిలో 80% మాత్రమే చేస్తున్నారు. ఆయా పరీక్షల నిర్వహణ కూడా అస్తవ్యస్తంగా తయారైంది. థైరాయిడ్ పరీక్షలు చేసేందుకు యంత్రం అందుబాటులో ఉన్నా రోగులను బయటకు పంపిస్తున్నారు. స్కానింగ్ విభాగాన్ని మధ్యాహ్నం తర్వాత మూసేస్తున్నారు. ఎక్స్రే ఫిల్మ్ల కొరత వేధిస్తోంది.
శ్రీకాకుళంలోని సర్వజన ఆసుపత్రిలో లిపిడ్ ప్రొఫైల్, సీరం, థైరాయిడ్ పరీక్షలు జరగడంలేదు. టెక్కలి జిల్లా ఆసుపత్రిలోనూ ఇదే పరిస్థితి. రసాయనాల కొరతతో థైరాయిడ్ పరీక్షల్లో వాడే ఎనలైజర్ పరికరం నిరుపయోగంగా మారింది. ప్రస్తుతం ఈ ఆసుపత్రి రేడియాలజిస్టు దీర్ఘకాలిక సెలవులో ఉండటంతో రోగుల పరీక్షల నిర్వహణకు ఇబ్బందులు ఎదురయ్యాయి. నరసన్నపేటలోని ప్రాంతీయ ఆసుపత్రిలో థైరాయిడ్ పరీక్ష చేసేందుకు అవసరమైన పరికరమే లేదు.