ETV Bharat / state

అరకొర జీతం, అదీ మూడు నెలలకు గానీ రాదు - ఆర్​బీకే ఉద్యోగులపై తీవ్ర ఒత్తిళ్లు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 11, 2024, 12:14 PM IST

Updated : Feb 11, 2024, 1:23 PM IST

Low Salaries for RBK Employees: వైసీపీ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల సేవలు నభూతో అని చూపే ప్రయత్నం చేస్తోంది. దాని కోసం ఆర్బీకేల్లోని ఉద్యోగులకు గోరంత జీతమిచ్చి కొండంత పని చేయిస్తోంది. పైగా వారికి లక్ష్యాలు నిర్దేశించి, ఒత్తిడి పెంచి హడలెత్తిస్తోంది. అరకొర జీతం, అదీ మూడు నెలలకు గానీ రాదు, శక్తికి మించిన పని చేస్తూ ఉద్యోగులు సచివాలయ, వ్యవసాయ శాఖ చేతిలో కీలుబొమ్మలా మారుతున్నారు.

Low_Salaries_for_RBK_Employees
Low_Salaries_for_RBK_Employees

అరకొర జీతం, అదీ మూడు నెలలకు గానీ రాదు - ఆర్​బీకే ఉద్యోగులపై తీవ్ర ఒత్తిళ్లు

Low Salaries for RBK Employees: విత్తనం నుంచి పంట విక్రయం వరకు రైతు భరోసా కేంద్రాల్లోనే. దేశానికే ఇవి ఆదర్శమంటూ సీఎం జగన్‌ బాకాలూదుతున్నారు. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసిన సీఎం జగన్‌ ఇంద్రుడు, చంద్రుడని చూపించేందుకు ఉన్నతాధికారులు శక్తికి మించి ప్రయత్నిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులను తీసుకొచ్చి విజయవాడ చుట్టుపక్కల ఎంపిక చేసిన నాలుగైదు ఆర్‌బీకేలను చూపించి గొప్పలు చెప్పుకున్నారు.

వీరెవరూ క్షేత్రస్థాయి సమస్యలు, ఉద్యోగుల ఇబ్బందులను పట్టించుకోవడం లేదు. ఆర్‌బీకే ద్వారా 22 రకాల సేవలందించాలని ప్రభుత్వం నిర్దేశించింది. వ్యవసాయ సహాయ సంచాలకుల నుంచి ఆర్‌బీకే సిబ్బంది వరకు అందరికీ లక్ష్యాలు పెట్టి హడలెత్తిస్తోంది. వ్యవసాయ కోర్సులు చదివి ఆర్‌బీకేల్లో పనిచేసే ఎంపీఈఓలకు నెలకు ఇచ్చేది కేవలం 12 వేలే. అదీ మూడు నెలలకూ జమ కాని పరిస్థితి.

రాష్ట్రంలో 10 వేల 778 ఆర్‌బీకేలను ఏర్పాటు చేశారు. వాటిలో ఒక్కో కేంద్రంలో వ్యవసాయ లేదా ఉద్యాన లేదా పట్టు, పశుసంవర్థక లేదా మత్స్యశాఖల సహాయకులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఒక్కో కేంద్రంలో ఇద్దరు సహాయకులు పనిచేయాలి. వాస్తవానికి వ్యవసాయ, ఉద్యాన శాఖల పరిధిలో 2 వేల 200కుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొన్నిచోట్ల ఒక్కో వీఏఏ లేదా వీహెచ్‌ఏలు 2, 3 చోట్ల బాధ్యతలు నిర్వహించాల్సి వస్తోంది. పశుసంవర్థక, మత్స్యశాఖల పరిధిలో 4 వేల 750 పోస్టులు ఖాళీయే. ఇటీవల పశుసంవర్థక శాఖ పరిధిలోని కొన్ని పోస్టుల్ని భర్తీ చేసే ప్రక్రియ మొదలైంది.

ఉద్యోగాలు ఇచ్చింది బతకమనా? చావమనా? - మమ్మల్ని ఉద్యోగస్తులుగా గుర్తించండి : ఆర్బీకే ఉద్యోగులు

రైతు భరోసా కేంద్రంలో ఏం కొనాలన్నా ముందే సొమ్ము చెల్లించాలి. తర్వాత వాటిని తెచ్చిస్తారు. అవీ కొన్ని సంస్థలవే ఉంటాయి. 40 నెలల్లో పరిశీలిస్తే సగటున ఒక్కో రైతు భరోసా కేంద్రం పరిధిలో నెలకు 12.60 లీటర్ల పురుగు మందులు, 750 బస్తాల ఎరువులు అమ్మారు. విత్తన విక్రయం మరింత తక్కువ. అయితే ప్రభుత్వం మాత్రం అమ్మకాలు ఘనంగా ఉన్నాయని చెప్పాలంటూ సిబ్బందిపై ఒత్తిడి పెంచుతోంది. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న ఎరువులు, పురుగుమందులు ఏవి వచ్చినా ముందు వైసీపీ నేతలకు ఇవ్వాల్సిందే. కొన్నిచోట్ల వాళ్లు డబ్బు చెల్లించకుండానే వారు తీసుకెళుతున్నారు.

ప్రైవేటు భవనాల్లో ఏర్పాటు చేసిన ఆర్‌బీకేలు, ఎరువుల గోదాములకు అద్దెలూ చెల్లించలేని దుస్థితి నెలకొంది. దీంతో వాటి యజమానులు అక్కడి సిబ్బందినే నిలదీస్తున్నారు. అద్దె కట్టడం లేదని తాళాలేసి బయటకు పంపిస్తున్నారు. 10 వేల 778 కేంద్రాల్లో 542 మాత్రమే సొంత భవనాల్లో ఉన్నాయి. 10 వేల 236 భవనాల నిర్మాణాలు చేపట్టగా, 4 వేలే పూర్తయ్యాయి. అక్కడా మౌలిక సౌకర్యాలు లేవు. చాలాచోట్ల సిబ్బంది విద్యుత్తు బిల్లులను ముందే తమ జీతం నుంచి కట్టాల్సి వస్తోంది.

ఉన్నతాధికారులు వచ్చారంటే వారి జేబు ఖర్చులు తడిచి మోపెడవుతున్నాయి. క్షేత్రస్థాయి సిబ్బందికి సెలవు దొరకడమూ ఆషామాషీ వ్యవహారం కాదు. ముందుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. సచివాలయంలోని పంచాయతీ కార్యదర్శి, వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు ఆన్‌లైన్‌లో వాటిని ఆమోదించాలి. మళ్లీ వాళ్ల వద్దకెళ్లి సంతకాలు పెట్టించుకోవాలి. వాటిని తీసుకుని వచ్చి పంచాయతీ కార్యదర్శికి ఇస్తే అప్పుడు సెలవు మంజూరవుతుంది.

రైతు భరోసా కేంద్రానికి ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య - భయాందోళనలో గ్రామస్థులు

పశుసంవర్థక శాఖ పరిధిలో పనిచేసే సిబ్బందిని ఇటీవల బదిలీ చేసినా వ్యవసాయ, ఉద్యాన శాఖల్లో బదిలీలు మాత్రం ఇదిగోఅదిగో అంటూ సాగదీస్తున్నారు. సిబ్బంది హాజరు, జీతాలు, సెలవుల వ్యవహారమంతా గ్రామ సచివాలయాల శాఖ చూస్తుంది. వారి పనితీరు పర్యవేక్షించేది మాత్రం వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు. దీంతో వ్యవసాయ, ఉద్యాన అధికారులు చెప్పిన పని తప్పకుండా చేయాలి. మరోవైపు పంచాయతీ కార్యదర్శి అప్పగించే బాధ్యతలనూ నిర్వర్తించాలి.

ఇతర పనుల ఒత్తిడిని వారు ప్రస్తావిస్తే? జీతాలు పెట్టేది, ఎస్‌ఆర్‌, సెలవులు ఇచ్చేది మేమే, చెప్పిన పనిచేయకపోతే జీతాలెందుకు పెడతాం? అని సచివాలయాల శాఖ సతాయిస్తోంది. మిమ్మల్ని నియమించింది మేమే, సర్వీస్‌ రిజిష్టర్‌ మావద్దే ఉంటుంది. ముందు మన శాఖ పనులు చూడండి’ అని వ్యవసాయశాఖ మండిపడుతోంది. మరోవైపు మరుగుదొడ్ల వసతులు లేక ఉద్యోగినులు నరకయాతన అనుభవిస్తున్నారు.

బాపట్ల జిల్లాలో ఆర్బీకే అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ ఆత్మహత్యాయత్నం

Last Updated :Feb 11, 2024, 1:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.