ETV Bharat / state

విద్యార్థిని ఫీజు రీయింబర్స్​మెంట్ విషయంపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 24, 2024, 10:27 PM IST

HC on Consumer Forum
High Court on Fee Reimbursement Issue

High Court on Fee Reimbursement Issue : పదో తరగతి వరకు తెలంగాణలో చదివి విభజన నేపథ్యంలో ఉద్యోగరీత్యా ఆంధ్రాకు తల్లి వెళ్లడంతో అక్కడ ఇంటర్, డిగ్రీ చదివిన విద్యార్థినికి ఎంబీయే ఫీజు రీయింబర్స్​మెంట్ ఇవ్వకపోవడంపై కౌంటరు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ పెండింగ్‌లో ఉన్నందున విద్యార్థిని నుంచి పరీక్ష ఫీజు స్వీకరించి, పరీక్షలకు అనుమతించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పిటిషన్ తేలేదాకా ఫలితాలను వెల్లడించరాదంది.

High Court on Fee Reimbursement Issue : ఫీజు రీయింబర్స్​మెంట్ ఇవ్వకపోవడాన్ని సవాలు చేస్తూ వరంగల్ వాగ్దేవి కాలేజీల్లో ఎంబీఏ చేస్తున్న బి.వాసంతి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సూరేపల్లి నంద విచారణ చేపట్టారు. ఎస్సీ వర్గానికి చెందిన పిటిషనర్ 10వ తరగతి వరకు తెలంగాణలో, ఇంటర్ & డిగ్రీ ఏపీలో చదివారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు తెలిపారు.

ఏపీ మినరల్ డెవలప్​మెంట్ కార్పొరేషన్లో అటెండర్‌గా పనిచేస్తున్న పిటిషనర్ తల్లి రాష్ట్ర విభజన(State Division) సమయంలో తెలంగాణలో ఖాళీలు లేక ఏపీకి వెళ్లారన్నారు. దీంతో పిటిషనర్ అక్కడే ఇంటర్, బీఎస్సీ పూర్తి చేశారన్నారు. బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతుండగా తల్లి మృతి చెందడంతో తిరిగి తెలంగాణలోని అమ్మమ్మ ఇంటికి వచ్చి ఎంబీయేలో చేరారన్నారు. ఏపీలో డిగ్రీ పూర్తి చేసిన కారణంగా ఇక్కడ ఫీజు రీయింబర్స్​మెంట్ ఇవ్వడంలేదని, అంతేకాకుండా పరీక్ష ఫీజు కూడా తీసుకోవడంలేదన్నారు.

దుర్గం చెరువు పునరుద్ధరణకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేయాలి : హైకోర్టు

వాదనలను విన్న న్యాయమూర్తి విద్యార్థిని నుంచి పరీక్ష ఫీజు తీసుకొని పరీక్షలకు అనుమతించాలని కాలేజీకి ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో డిగ్రీ చదివిందన్న కారణంగా ఫీజు రీయింబర్స్​మెంట్ కల్పించకపోవడంపై కౌంటర్లు దాఖలు చేయాలంటూ ఉన్నత విద్యాశాఖ, సాంఘిక సంక్షేమ శాఖ(Social Welfare Department) ముఖ్యకార్యదర్శులు, సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్, వాగ్దేవి కాలేజీలకు నోటీసులు జారీ చేస్తూ విచారణను మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది.

HC on Consumer Forum : మరో కేసులో హైదరాబాద్​లోని మూడు జిల్లాల వినియోగదారుల కమిషన్ల ప్రాదేశిక అధికార పరిధిని నిర్ణయిస్తూ 2022లో జారీ చేసిన సర్క్యులర్‌ను పక్కనపెడుతూ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఇన్​ఛార్జి అధ్యక్షురాలు ఇచ్చిన ఉత్తర్వులను ఇటీవల హైకోర్టు రద్దు చేసింది. రాష్ట్ర కమిషన్ అధ్యక్షుల హోదాలో హైదరాబాదద్‌లోని జిల్లా కమిషన్ల అధికార పరిధిని నిర్ణయించవచ్చని, అయితే అది పారదర్శకంగా ఉండాలని స్పష్టం చేసింది.

14 ఏళ్లుగా ఉద్యోగాల భర్తీ కోసం న్యాయ పోరాటం చేస్తున్నాం : డీఎస్సీ 2008 అభ్యర్థులు

పరిధిని ఎందుకు మార్చాల్సి వచ్చిందన్న దానిపై తగిన కారణాలతో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. అంతేగానీ జిల్లా కమిషన్ న్యాయవాదుల సంఘం ఇచ్చిన వినతి పత్రం(Petition) మేరకు నిర్ణయం తీసుకోవడం సరికాదంది. హైదరాబాద్​లోని మూడు జిల్లా కమిషన్ల ప్రాదేశిక అధికార పరిధిపై 2022 జారీ చేసిన సర్క్యులర్‌ను నిలిపివేస్తూ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ గత ఏడాది ఏప్రిల్ 27న రాసిన లేఖను సవాలు చేస్తూ న్యాయవాది రాఘవేంద్రసింగ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Telangana High Court on State Consumer Commission : ఈ అంశంపై విచారణ చేపట్టిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. హైదరాబాద్‌లోని మూడు జిల్లా కమిషన్లు నాంపల్లిలోని చంద్రవిహార్ నుంచి విధులు నిర్వహిస్తున్నాయి. కమిషన్-1లో కేసులు ఎక్కవగా ఉండగా మిగిలిన రెండు కమిషన్లలో కేసులు లేక మధ్యాహ్నంలోగానే విచారణ పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా వినియోగదారుల కమిషన్ న్యాయవాదుల సంఘం వినతి పత్రం సమర్పించడంతో కేసుల విభజన భాధ్యతను కమిషన్-1 కి అప్పగిస్తూ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ రిజిస్ట్రార్ లేఖ రాశారు.

కేసుల విభజన సమయంలో ఒక్కోసారి పక్షపాతం కనిపిస్తోందని పిటిషనర్ ఆరోపించారు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం మూడు కమిషన్లలో ఒకదానిలో మాత్రమే కేసులుండి మిగిలిన వాటిల్లో తగినన్ని లేవని భావించినపుడు అన్ని ఆధారాలను పరిశీలించి రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఇన్​ఛార్జి అధ్యక్షురాలు నిర్ణయం తీసుకోవచ్చంది. అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు గత అధ్యక్షుడు జారీ చేసిన సర్క్యులర్లను సవరించాల్సి ఉందని, అంతేగాని దాన్ని నిలిపివేయడం సరికాదంది.

పోలీసులు ఉన్నది ప్రజల కోసం - వారిని భయాందోళనలకు గురి చేయడానికి కాదు : హైకోర్టు

హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌ మాజీ ఓఎస్​డీ హరికృష్ణకు హైకోర్టులో ఊరట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.